కైలాస దర్శనం: మానసరోవర యాత్ర(ManasaSarovara Yathra)
సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం లేనివారికి ఈ యాత్ర చేయడం దుర్లభమే.
కైలాస
పర్వతాన్ని, మానసరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు
ప్రాంతాలు పరమపవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని
చూస్తే.. అమరేశ్వరుడిని చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో.. మంచు
పర్వతాల మధ్య.. ఎప్పుడూ స్వచ్చమైన నీళ్లతో కనిపించే మానసరోవరం.. అందరికీ
మిస్టరీలానే ఉంటుంది. అందుకే, అటు కైలాస పర్వత పరిక్రమను, మానసరోవర
పరిక్రమనూ పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. కైలాస పర్వత పాదభాగంలో
ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానసరోవర పరిక్రమను మొదలుపెడతారు.
బ్రహ్మమానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది.
తొలిరోజు డార్చెన్ నుంచి కుహు కు.. రెండో రోజు కుహూ నుంచి కుగుకూ యాత్ర
సాగుతుంది. కుగు నుంచి చూస్తే.. మానసరోవరం, కైలాసపర్వతం కలిసి ఉన్నట్లే
కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు.. ఒక్కోసారి కైలాస శికరం
నుంచి కాంతిపుజం మానస సరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది..
తిరిగి డార్చెన్కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమ్మీద
మరెక్కడా కనిపించని స్వచ్చమైన నీరు.. కేవలం మానసరోవరంలో మాత్రమే
కనిపిస్తుంది. గంటగంటకూ ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని
అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ
మొదలవుతుంది. కైలాసనాథుడి కొలువైన పర్వతాన్ని చుట్టిరావడానికి మూడురోజుల
సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా
తొలిరోజు భక్తులు నడకసాగిస్తారు. ఈ ద్వారాన్ని దాడటం ద్వారా మృత్యుభయం
తొలిగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాతే, బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది.
కైలాసపర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగ, సింధు,
సట్లైజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి.
అది మహాశివుడు మానవాళికిచ్చిన మహా ప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా
నడుస్తూ.. కైలాసగిరి అందాలను చూస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు
శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రానదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత
డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత
శిఖరం.. ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరత్వరగా
మారిపోతుంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుతూ,
యాత్రికులను భక్తపారవశ్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం
మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది.
సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా
అందదు. శివనామస్మరణ చేస్తూ, భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు
యాత్రికులు. ఆ శివనామ స్మరణే.. భక్తులకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.
మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్ లా కనిపించే ఈ కొలనులోనే
పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుందీ ప్రాంతం.
జోంగ్ జెర్బును చేరుకోవడంతో ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు..
అక్కడి నుంచి డార్చెన్కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ
యాత్రలో నాలుగు వైపులా నాలుగు రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఒక వైపు
నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు
వర్ణంలో మెరుస్తుంది. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా
సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా నాలుగు రూపాలు భక్తులకు
దర్శమనిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీ దేవి వాహనమైన సింహం,
వినాయకుడికి ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు
కనిపిస్తాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే పరమపవిత్రమైన
కైలాస శిఖర పరిక్రమే భక్తులు పరిమితమవుతారు తప్ప, శిఖరాన్ని
అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించారు. పదో శతాబ్ధంలో ఓ బౌద్ధగురువు
శిఖరాధిరోణ చేసినట్లు చెప్తారు. ఆ తర్వార ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ
విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన
ఎవరెస్టును ఎంతోమంది ఎక్కగలిగారు గానీ, కైలాస పర్వత అంచును మాత్రం ఎవరూ
చూడలేకపోయారు. అందుకే, ఇది మహాఅద్భుతంగా మిగిలిపోయింది. కైలాస,మానసరోవర
పరిక్రమ యాత్రను పూర్తి చేసుకున్నవాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని
ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణవుతారు.యాత్రిక రచయిత :-
శ్రీవల్లీ సుబ్రహ్మణ్యం శర్మ
No comments:
Post a Comment