Friday, November 9, 2018

కార్తీక చతుర్ధి-నాగుల చవితి

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. 

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం! 

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!

నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. 

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! 

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. 

నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కార్తీక దీపము

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. 

అనాదిగ ఈ రోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ''ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!'- అని.
అనేక స్థలములలో విగ్రహములలో ఈశ్వరుని ఆవాహన చేయురీతినే ఈరోజు దీపములో దామోదరుడనే మూర్తినో లేక ఉమాదేవీ సహితుడైన త్య్రంబకునో- ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కేశవ, నారాయణ, మాధవ- అని చెప్పు నామములతో పండ్రెండవ నామము, దామోదరుడు, ఆయననో లేక ఉమాసహితుడైన త్య్రంబకునో ఆవాహన చేస్తారు.
కృత్తికా పూర్ణిమ నాడు దీపములో ఈశ్వరుని ఆవాహనచేసి- ఈ దీపజ్వాలను చూచినను సరే- ఈ దీపజ్వాలపైబడిననుసరే, చూచుటకు శక్తికల జీవులు, శక్తిలేని జీవులు - ఏవి అయినను-వాని పాపములు నశించాలి అని ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి 'లోకా స్సమస్తా స్సుఖనో భవన్తు', అనే సంకల్పము ఋషులు వెలిబుచ్చారు. కృత్తికానక్షత్రము, పూర్ణిమతిథి-రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. నక్షత్రము ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చుట కూడ ఉంది. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము. తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెటతారు. దీపము వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తినో, దామోదరమూర్తినో ఆవాహనచేసి- 'కీటాః పతంగాః' అనే శ్లోకం చదువుతారు.
ఈ దీపదర్శనమువలన మనుష్యుల పాపములేకాదు. పశుపక్షి కీటకముల పాపములు సైతము నశిస్తాయి. మన మలి పుట్టుక ఏదో మనకు తెలియదు. మనము ఏమ్రాను అయినా కావచ్చు. మశకమయినా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణికోటికి పాపనివృత్తి - ప్రసాదించాలి - అని ప్రార్థన చేయుట.
చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై - అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా - దీపము వెలిగిస్తారు.
జ్వాలాదర్శనముచేసే జనుల పాపములేకాక కీటాః - పురుగులు, పతంగాః - పక్షులు, మశకాః - దోమలు, వృక్షాః - చెట్లు, వీని కన్నిటికీ జన్మనివృత్తి కావాలి. చెట్లు చేమలు లతలు కొన్ని రోజు నీరు పోయకపోతే వాడిపోతాయి. శోషిస్తాయి. ఇది మనము ఎఱిగిందే. వాని జన్మసైతము నివృత్తి కావాలి. జల్సేజలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థల్సేస్థావరాలైన జంతువులు- ''దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగినః''. త్ర్యంబకుని ఆవాహన చేసిన దీపము చూచినా, ఆ దీపజ్వాలయొక్క వెలుతురు వానిపైపడినా - పుష్టివర్థకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాపనివృత్తి కావలెనని కరుణాస్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు.
ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నిటికి పాదములే ఉండవు. వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేలకొలది కాళ్లు. అవి సహస్రపాదులు. 'తే ద్విపాద్‌ చతుష్పావ్‌' అని వేదములో చెప్పబడింది. 'సకలము క్షేమముగా ఉండాలి' అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. 'లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు' అని అన్ని లోకాల సుఖమూ కూడ కోరాలి.
కృత్తికా దీపమునాడు చెప్పవలసిన శ్లోకము
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||
పై శ్లోకమును విడివిడిగా భాగించి స్ఫుటంగా చెప్పడం. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు పశువులు పక్షులు కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అనియే. అదే ఈ శ్లోక తాత్పర్యము. ఇది పరంపరగా వస్తూ ఉంది. ఈశ్వరుని ఆవాహన చేసిన ఈ దీప ప్రకాశమే పరమేశ్వర స్వరూపము, పాపవిమోచకము.
కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని - జ్ఞాపకార్థమైఉంది. ఈ ఆరు నక్షత్రములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఆరు నక్షత్రములే షణ్మాతృకలైన సుబ్రహ్మణ్యస్వామియొక్క తల్లులుగా చెప్పబడుతూ ఉన్నవి.
మరొక విశేషం, ఏమంటే - శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము - కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క ఉత్సవము విశేషము. కాని అన్ని గుడులలో, అన్ని క్షేత్రములలో - ఒకే రోజున విశేషముగా - మూర్తి భేదములేక చేసే ఉత్సవం ఇదే 'లోకా స్సమస్తాస్సుఖినో భవన్తు' అనే వాక్యానికి వ్యాఖ్యానమా? అన్నట్లు - ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణికోటికి జన్మనివృత్తి ఔతోంది. అందుచే మనము కృత్తికా పూర్ణిమనాడు (కార్తికమాసమున పూర్ణిమనాడు) దీపదర్శనముచేసి- దామోదరుని ఉమాసహిత త్ర్యంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనచేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాపనివృత్తులమై లోకులక్షేమానికై ప్రార్థించుట కర్తవ్యము.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...