కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని
ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరిమర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని
మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు
శ్రీహరిభక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ
జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి
ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను
సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు.
రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు.
పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు
ఉద్యానవనాలు దేవతామందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.
వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము
రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధముగా రాజ్యపాలన
చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం
రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన
మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి
దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో
దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ
వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా
ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు
వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో
దారితప్పిపోయాడు.
ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట
సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక
ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం
ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో
ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని
చూడగానే అతనిని గుర్తుపట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని
గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు.
ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు.
ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి. “నాయనా!
నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు
కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా!
మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై
వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా
చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ
రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని ఱేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ
కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే
ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.
మాయమాటలతో రాజును తనను
నమ్మేలాచేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపటసన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు
అర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా
కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ
చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిదికాదా! అందుకనే
ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”.
వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ
బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని
తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు. సృష్టిప్రారంభములో నేను జన్మించాను.
తరువాత మఱియొకదేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా
వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపటసన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు
పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు.
జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు
“స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా
తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని
వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు
చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు
ఆ కపటసన్యాసి.
సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక
ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ
దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు
కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి
ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం
కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును
అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ
దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని
“నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు. ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి
ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ
కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా
ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి
నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విప్రులను ప్రసన్నము
చేసుకునే ఉపాయము దయతో నాకు సెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే.
కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా
చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను.
మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.
“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే
కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇవ్వండి.
శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని
ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన
నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపటసన్యాసి గురించి ఏమీ తెలియకుండానే
వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని
“విప్రులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా
సులభమార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన
విప్రులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని
వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా
తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత
నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని
అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.
ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము
దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను
హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి
దుష్టసంహారం చేశాడు ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం
పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి
ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో
చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు.
తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము
గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక
యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి
పాదాలనే ధ్యానించసాగినాడు.
అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ
విప్రులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత
లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన వంటలను పాకశాస్త్రమును అనుసరించి
షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక
బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్థము విప్రులు
సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ
భోజనము హానికరము. దీనిలో జంతువిప్ర మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని
పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విప్రులు “ఓ క్షత్రియాధమా! మమ్ము
సపరివారముగా భ్రష్టులను చేయ తలచితివి. నీవుకుటుంబ సహితముగా రాక్షసుడవై
జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు. మీకు
తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి
సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపటసన్యాసి శత్రురాజులందఱిని
కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో
కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా
ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై
జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి
విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్జతే”. సమస్త భూమండలానికి
ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి
చివరికి నాశనమైనాడు.
2. మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో
వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి.
ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి పరిచయంతోనే కపటుని గురువుగా
స్వీకరించాడు.
3. బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ
క్రోధాదులు) హాని చేయకమానవు. కావున ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి.
ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను గమనించక వారిచేత
మోసగించబడినాడు.