Friday, February 23, 2018

శ్రీవారికి సమర్పించే నైవేద్యం

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు.*

వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా ?

ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా ?

ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం!

స్వామి వారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు.

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు.

అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.

ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు.

ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక...

శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

*నేవైద్యం పెట్టేది ఇలా...*

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.

గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.

స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.

విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు.

కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు.

చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.

ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.

రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.

ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు.

పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.

తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.

నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.

ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

*ఉదయం బాలభోగం*

మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

*మధ్యాహ్నం రాజభోగం*

శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

*రాత్రి శయనభోగం*

మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

*అల్పాహారాలు*

లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు.

తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు.

ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది.

సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!

అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు.

ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది.
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటో తెలుసా

శ్రీ మాత్రే నమః

ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :
1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం

ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

1. *దక్షిణావర్త శంఖం.*
ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖం అని  అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకుని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.

లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే ... లక్ష్మీదేవి సముద్రంనుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరుకుతాయి. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే కావడం విశేషం. అయితే  దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు.

దక్షిణావర్తి శంఖాలు మోగవు ... కానీ మోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. పగిలినది, విరిగినది, పల్చనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు.. పూజకు పనికిరావు. ఈ శంఖాలు వున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి, రామేశ్వరాలో దొరుకుతాయని ప్రసిద్ధి.

2. *ముత్యాల శంఖం..*
ముత్యపు కనతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు..
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహిదేహి నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి.

3. *ఏకాక్షి నారికేళం..*
మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు వుంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి (ఒంటికన్ను) నారికేళానికి ఒకే కన్ను వుంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది . 

  శ్రీ మాత్రే నమః

పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్త్యశ్యాజానిగోరథమ్‌ ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతు కరోతుమాన్‌

మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత. ఆ జగజ్జనని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు.

పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్త్యశ్యాజానిగోరథమ్‌
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతు కరోతుమాన్‌

అని అన్నారు. అంటే, సహజంగా లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తుందని అంటుంటారు. అయితే, ఆ మాత...పుత్రులను, పుత్రికలను, మనునళ్లను, మనుమరాళ్లను, ధనాన్ని, ధ్యాన్యాన్ని, వాహన సౌకర్యాన్ని ఇవ్వడంతోపాటూ, వాటన్నింటినీమించి ఆయుష్షును ఇస్తుందని శ్రీసూక్తం చెబుతోంది.

సువర్ణవర్చస్సుతో భాసించే మహాలక్ష్మీమాత, పూర్ణవికసిత పద్మంపై చతుర్భుజాలతో ఆసీనురాలై ఉంటుంది. పైనున్న రెండుచేతుల్లో పద్మపుష్పాలు ఉంటాయి. పద్మం సౌందర్యానికి, నిర్మలత్వానికి పసిడిపంటల శోభకు సంకేతము. ఆమె ఆసీనురాలై ఉన్న పద్మం బురద నుండి ఆవిర్భవిస్తుంది. ఎటువంటి వాతారణంలోనైనా పూర్ణవికాసం చెందగల మనలోని అపరిమితశక్తికి ఆ పుష్పం సంకేతం. ఆ పద్మం చుట్టూ నీరు ఉంటుంది. ఆ నీరు జీవశక్తికి సంకేతం. నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించకపోతే, ఆ నీరు చెడిపోతుంది. అలాగే ధనం ప్రవహిస్తూ ఉండాలి. ధనం ఒకచోట నుండి మరో చోటుకు మారినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది.

లక్ష్మీదేవి సుసంపన్నతను, తేజస్సును వెదజల్లుతుంటుంది. మన  జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఆ జగన్మాత ఆకాంక్షిస్తుంటుంది. ఆమె నాలుగు హస్తాలు ధర్మార్థకామ మోక్షాలకు సంకేతాలు. ఆ హస్తాలు మన జీవితాలకు బంగారు పునాదులు. లక్ష్మీదేవి కుడి హస్తం నుండి బంగారు నాణేలు వర్షిస్తుంటాయి. ఆ తల్లి కరుణ మనకు లభిస్తే, మన జీవితాలు సువర్ణమయం అని ఆ నాణేలు గుర్తుచేస్తుంటాయి. ఇక ఆ తల్లి ఎడమ చేత్తో పట్టుకున్న సువర్ణకలశం సుభీక్షానికి ప్రతీక. ఆమె ఆకుపచ్చని రంగు చీరను ధరిస్తుంది. పచ్చపచ్చని పొలాల పంటల సిరికి, అభివృద్ధికి, ఆ హరితాంబరం సంకేతం. ఒక్కొక్కసారి ఆమె ఎరుపురంగు చీరలో దర్శనమిస్తుంది. ఎరుపురంగు కార్యశీలతకు, ప్రకృతిశక్తికి సంకేతం.

ఆమె కుడి, ఎడమల రెండు తెల్లటిఏనుగులు నిలబడి నీటిని విరజిమ్ముతుంటాయి. ధర్మబద్ధంగా, విజ్ఞత, జ్ఞానం, వినిర్మలతలతో ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను పొందేందుకై ప్రతివ్యక్తి చేసే నిరాటంక ప్రయత్నానికి ఆ జలధారలు సంకేతాలు. మహాలక్ష్మి చిత్రపటాలలో అప్పుడప్పుడు ఓ తెల్లని గుడ్లగూబను చూస్తుంటాం. ఇందులో రెండు ప్రతీకలున్నాయి. ఒకటి విజ్ఞతకు, అదృష్టానికి సంకేతము. రెండు, తెలివితక్కువ తనానికి ప్రతీక. సక్రమంగా నిర్వహించని సంపద అదృశ్యమైపోతుందని ఆ సంకేతార్థం. లక్ష్మీదేవి గర్వం, అహంకారాలను క్షమించదు. అందుకే ఆమె చంచల అయింది. క్రూరబుద్ధి, నాస్తికులు, కృతఘ్నులు, పాపాత్ములు, అబద్ధాలు ఆడేవారు, అయుష్షులయందు తాను కరుణ చూపనని చెప్పిన వారిని కాక, లక్ష్మీదేవి సత్యాన్ని పలికేవరు, పరిశుభ్రతను పాటించేవారు, గురుభక్తి, గర్వం లేనిపుణ్యాత్ములు, నిశ్చలబుద్ధిగలవారు, జ్ఞానులు, తపస్సు, దానం చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, దయాగుణం గలవారిని అనుగ్రహిస్తానని చెప్పింది. లక్ష్మీ అనే పదం లక్ష్యం అనే పదాఅన్ని కూడ సూచిస్తుంది. ఒక ప్పష్టమైన లక్ష్యం, గమ్యం ఉన్న వారికే ధనం లభిస్తుంది.

లక్ష్మీదేవి ఆవిర్భావం

లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే, క్షీరసాగర మథనానికి ముందటి పరిస్థితులను తెలుసుకోవాలి. ఆ కాలంలో స్వర్గాధిపతియైన ఇంద్రునిలో అమితమైన గర్వాతిశయం పొడుసూపింది. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాసమహర్షి తారసపడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవసూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ నిచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞత చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండడానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ, ఇటూ ఆడిస్తూన్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపావేశ పూరితుడై, "ఓయీ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి" అని శపించాడు.

అప్పుడు ఇంద్రుని కళ్ళకుకప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాసమునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుని అతని పరివాంతోపాటు స్వరం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుముర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో, అందరూ విష్ణుసన్నిధికి చేరుకుంటారు.

ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందునుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపములో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యివతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆమె అక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జనించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోను ఆయన సరసనే ఉంటుంది.

చంచల స్వరూపిణి

లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ర్టుని ముందు నిలిచిన దుర్యోధనుడు, పాండవులపట్ల తనకు గల అక్కసునంతా వెళ్లగక్కుతాడు. పాండవులు అలవిలేనంత సంపదల మధ్య తులతూగిపోతున్నారనీ, లెక్కలేనంతమంది భృత్యులతో, రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారనీ, చెప్పాలంటే సంపదలో కుబేరుని కూడ మించిపోయారని, వారిని మించాలంటే తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తారు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు, పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతినియమాలతో ప్రవర్తించాలనీ, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును. ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ, అతడు నడిచిన బాట నైతిక ఋజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని ఋజువర్తనం మనకు ఇంద్రుని ఉదంతం ద్వారా తెలుస్తోంది.

ఒకసారి విషయవాంఛలతో విసిగి వేసారిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్నివిధాలైన సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరోసందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయము ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరికలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటివరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూగడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు.

"రాజుగా నా స్థాయిని తలచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ, గురువులు, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగివుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం". ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరంకొమ్మంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ఋజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు 'సరే' నని ఒప్పుకోగానే, అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది.

"నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివశిస్తానని చెప్పి, ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలోనుంచి బయల్వెడలిన మరో జ్వాల, తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం, తాను నిజాన్ని అని, ధర్మబద్ధాతతో ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలంనీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయట పడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు అర్థమవుతోంది.

లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమైఇళ్ళను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్తజనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.

విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?


🕉🌼🕉🌼🕉🌼🕉🌼🕉🌼🕉

అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు స‌ముద్ర మ‌థ‌నం చేస్తారు తెలుసు క‌దా. ఆదిశేషువును తాడుగా  చేసుకుని మంద‌ర ప‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు.

దీంతో దాని నుంచి అనేక వ‌స్తువులు ఉద్భ‌విస్తాయి. అందులో నుంచి వ‌చ్చే విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకుంటాడు. అనంత‌రం కామ‌ధేనువు, ఐరావ‌తం, ఉచ్ఛైశ్ర‌వం, క‌ల్ప‌వృక్షం, అప్సర‌స‌లు, చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తారు. చివ‌రిగా ల‌క్ష్మీదేవి కూడా వ‌స్తుంది. అయితే అంద‌రూ అన్నీ తీసుకుంటారు. కానీ ల‌క్ష్మీ దేవిని మాత్రం ఎవ‌రూ తీసుకోరు. తీసుకోరు అంటే… ఆవిడే ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లదు. కేవ‌లం విష్ణువు వ‌ద్ద‌కే వెళ్లి ఆయ‌న్ను మాత్ర‌మే వ‌రిస్తుంది. అయితే ల‌క్ష్మీదేవి అలా ఎందుకు చేస్తుందో తెలుసా..?

క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ల‌క్ష్మీదేవి ఉద్భ‌వించిన‌ప్పుడు మొద‌ట ఆమె రుషుల‌ను చూస్తుంది. అయితే వారు ఆమెను త‌మ వ‌ద్ద‌కు ర‌మ్మంటే త‌మ వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని ఆహ్వానిస్తారు. అయినా ఆమె వారిని వ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది.

ఎందుకంటే రుషులు ఎల్ల‌ప్పుడూ ఆగ్రహంతో ఉంటార‌ని, వారికి వారిపై గ‌ర్వం ఎక్కువ‌ని, వారు మాన‌వుల క‌న్నా అధికుల‌మ‌నే పొగ‌రుతో ఉంటార‌ని, దైవం వ‌ద్ద‌కు ఎలాగైనా చేరుకోగ‌ల‌మనే అహం క‌లిగి ఉంటార‌ని భావించి ల‌క్ష్మీదేవి వారిని వ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది. అనంత‌రం ఆమె రాక్ష‌సుల‌ను చూస్తుంది. కానీ వారి వ‌ద్ద‌కు కూడా వెళ్ల‌దు. ఎందుకంటే రాక్ష‌సులు ఉండే ప్రాంతాలు అత్యంత అప‌రిశుభ్రంగా ఉంటాయ‌ని ఆమె న‌మ్మ‌కం. కేవ‌లం స్వచ్ఛ‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలోనే ఉండాల‌ని ఆమె అనుకుంటుంది. అందుకే రాక్ష‌సుల‌ను కూడా కాద‌ని ల‌క్ష్మీదేవి ముందుకు వెళ్తుంది. అనంత‌రం ఆమె ఇత‌ర దేవుళ్ల‌ను కూడా దాటి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వారు క‌ష్ట ప‌డే త‌త్వం ఉన్న వారు కాద‌ని, వారి శ‌క్తుల‌న్నీ వారికై వారు సంపాదించిన‌వి కావ‌ని ఆమె న‌మ్మ‌కం.

అలా ల‌క్ష్మీదేవి దేవుళ్ల‌ను కూడా దాటి వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఉలుకూ ప‌లుకూ లేకుండా శేష త‌ల్పంపై ప‌డుకున్న విష్ణువు క‌నిపిస్తాడు.

అంద‌రూ త‌నను త‌మ వ‌ద్ద‌కే రావాల‌ని ఆహ్వానిస్తుంటే ఆయ‌న మాత్రం అలా త‌న‌ను ప‌ట్టించుకోకుండా ఉండ‌డం చూసి ల‌క్ష్మీదేవి ఆశ్చ‌ర్య‌పోతుంది. వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేస్తుంది, చేసుకుంటే విష్ణువునే వివాహం చేసుకోవాల‌ని అనుకుంటుంది.

అనుకున్న‌దే త‌డ‌వుగా విష్ణువుకు పాదాభి వంద‌నం చేసి త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆయ‌న్ను అడుగుతుంది. అందుకు విష్ణువు అంగీక‌రిస్తాడు. అలా ల‌క్ష్మీదేవి విష్ణువుకు భార్య అవుతుంది.

కోపానికి బద్ధశత్రువు ఓర్పు


ఓర్పు కు ప్రతీక సాలెపురుగు.
గదిలో ఓ మూలన నిశ్శబ్దంగా - ఓర్పుగా - ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది.
ఎవరినీ సాయం అడగకుండా, ఎవరినీ బాధించకుండా, తననుంచి తాను విడివడుతూ, తనను తాను త్యాగం చేసుకుంటూ పోగు తరువాత పోగు గొప్ప ఏకాగ్రత తో ఒక శిల్పి చెక్కినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.

ఒక హడావుడి ఉదయాన, నిశ్శబ్ద సాయంత్రం సమయానో, గోడ మీద నుండి పెద్ద శబ్దం తో వచ్చే చీపురు కట్ట ఒక్క వేటు తో దాని శ్రమనంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. సర్వనాశనమైపోయిన సామ్రాజ్యం లో నుంచి సాలెపురుగు అనాథలా నేలమీద పడుతుంది.

ఎవ్వరినీ కుట్టదు. ఎవ్వరిమీద కోపం ప్రదర్శించదు. మళ్ళీ తన మనుగడ కోసం కొత్త వంతెన నిర్మించుకోవడానికి సహనం పోగు లను నమ్మకం అనే గోడ మీద తిరిగి స్రవిస్తుంది.

ఎలా బ్రతకాలో మనిషి కి పాఠం చెపుతుంది.

మౌనము&మనస్సు


మౌనము మనగా మాట్లాడకుండుట కాదు. మాట్లాడవలసిన ఆవశ్యకతను తగ్గించుట

మౌనము. మనస్సు చెలరేగుచుండగా గొంతు బిగించుకొనుట మౌనము కాదు.
దీనివలన రక్తపోటు, తలనొప్పి, నిద్రలేకుండుట మున్నగు వ్యాధులు సంక్రమించును.

ఎక్కువ మాట్లాడుతుంటే నీకున్న ప్రజ్ఞ అంతా  నిర్వీర్యమవుతుంది.
వాక్ప్రవాహము సహస్రారము చేరి, అక్కడనుండి భ్రూమధ్యము వచ్చి, హృదయము చేరి నిశ్వాస ఆధారముగా బయటకు ఉచ్చారణ రూపములో వస్తుంది.

మనలను మనము పండించుకోవాలంటే బయటకు  ఉచ్చరించేటపుడు వాక్కును filter చేసుకోవాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...