Sunday, April 15, 2018

శాశ్వత సత్యాలు

మనకేం కావాలో తెలియనపుడు ఎన్ని శాస్ర్తాలు నేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఏ శాస్ర్తం గొప్పది, ఏ మార్గం గొప్పది, ఎవరు గొప్పవారు‌ అనే ప్రశ్నలు మానవుని ఆచరణ శూన్యతకు, పతనానికి కారణాలు.

భగవంతుని కన్నా శాస్ర్తమే ఎక్కువ. అనే వెర్రిలో పడరాదు. భగవంతుడిని మరువలేని శాస్త్రమే కావాలి. భగవంతుడు లేడు లేడు అని అరుస్తుంటారు కొంతమంది. అలా అంటూనే మరల భగవంతుణ్ణి తిట్టే వారు కూడా ఉన్నారు. మనకీ భగవంతునికి మధ్య పొరలు తొలగాలంటే మిగిలిన జీవులకు మనకు మధ్య పొరలుండరాదు.

మనం ఉండటం అంటే మనము ఉన్నట్లు అనిపించడమే గాని అదికాక మనం అంటే ఏమిటో చెప్పు? ఎవడి అస్తిత్వము వాడికి ఉండడమే ఉండటం.

నువ్వు సర్వ శక్తి సంపన్నుడవు అంటే ఒక్కొక్కడు అంగీకరించడు . ఎందుకో తెలుసా? అలా అని నమ్మితే ఆ శక్తిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత తన నెత్తిన పడుతుందేమోనని.

ఒక్కొక్కడికి తోచదు ఎవరైనా చెపుతూ ఉంటే వినడు. వినగలిగే మంచితనం, సహనం ఉండాలి. వినడానికి అహంకారం పడక, బుద్ధి గలిగి వినగలిగితే వినే ప్రతిమాట మంత్రమే-- మార్గమే.

తెలిసి తప్పు చేసినవాడు, ఇతరుల తప్పులను పట్టుకు కూర్చునే వాడు, చేసిన తప్పులను గూర్చి తపస్సు‌ చేసేవాడు, శరీరం మీద అభిమానం, మృత్యుభీతి ఉన్న వాడు బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు.......

........✍🏻 గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

సదా స్మరణీయులు మన సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!*
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!*

భారతీయ పరంపరాగత ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు...

వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు)

దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి:*

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు :*

ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి:*

త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. గౌతముడు:*

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి:*

రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు:*

ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...