Friday, November 23, 2018

శ్రీనాథ కవి సార్వభౌముడు


శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట్టణంలో. నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరి ఊరు అది. నాటి కొండవీటి రెడ్డి రాజ్యంలోని ప్రాంతమది. తండ్రి మారయ్య. తల్లి భీమాంబిక.

శ్రీనాథుడి చిన్ననాటి మిత్రుడు ఆవచి తిప్పయ్యశెట్టి. ఇతడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి కొడుకు. అతనిది తమిళనాడు లోని కాంచీపురం. తండ్రితో పాటు తెలుగు ప్రాంతాలకు వస్తూండేవాడు. అప్పటికి శ్రీనాఽథుడి వయసు సుమారు 14 ఏళ్లు. ఆ చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే ‘మరుత్తరాట్చరిత్ర’ రచించాడు. ఆ పద్యాల్ని సెట్టికి వినిపిస్తూ ఉండేవాడు. ఇలాంటి బాలసరస్వతిని సంపన్నులకు పరిచయం చేస్తే ఫలం ఉంటుందనుకొన్నాడు సెట్టి. అలా శ్రీనాథుడికి ప్రెగ్గడయ్యను, సింగననూ పరిచయం చేశాడు.

స్నేహాన్ని బంధంగా మలుచుకోవడమెలాగో శ్రీనాథుడికి తెలుసు . అందుకే ‘మరుత్తరాట్చరిత్ర’ని వేమనకి అంకితమిచ్చాడు. కొన్నాళ్లకి ‘పండితారాధ్య చరిత్ర’ రచించి ప్రెగ్గడయ్యకి అంకితమిచ్చాడు.

రోజులు గడిచాయి. శ్రీనాథుడికి నూనుగు మీసాల నూత్న యవ్వనం వచ్చింది. ‘శాలివాహన సప్తశతి’ అనే శృంగార శతకాన్ని రచించి పెదకోమటి వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అంతలో కొండవీటికి- వేమారెడ్డి రాజయ్యాడు. మామిడి సింగన మంత్రి అయ్యాడు. నిండు యవ్వనంలో శ్రీనాథుడు ‘శృంగార నైషధం’ రచించి సింగనకి అంకితమిచ్చాడు.

అంతలో ఓ రాచకార్యం శ్రీనాథుడిపై పడింది. రాజమహేంద్రవరం రెడ్డిరాజులతో కొండవీటి ప్రభువులకు యుద్ధ పరిస్థితి నెలకొంది. రాజమండ్రి రాజులకు విజయనగర చక్రవర్తుల అండ ఉండేది. ‘దీన్ని నివారించాలి’- అన్నది కొండవీటి రాజు ఆలోచన. అది అవచి తిప్పయ్యశెట్టికే సాధ్యం. ఎందుకంటే అప్పటికి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో చక్రవర్తులందరికీ దగ్గరయ్యాడు. మరి తిప్పయ్యను ఒప్పించేదెవరు? - శ్రీనాథుడే!

అలా శ్రీనాథుడు కంచి వెళ్లాడు. అవసరమై వచ్చానంటే చిన్నప్పటి స్నేహితుడు చిన్నబుచ్చుకుంటాడు. అందుకే చూసిపోదామని వచ్చానన్నాడు. ఆనందించాడు సెట్టి. ‘‘అందరికీ అన్నీ అంకితమిచ్చావు. మరి నాకు’’ అని అడిగాడు సెట్టి. నిజానికి కవితలు, కాకరకాయలు రాయడానికి రాలేదు శ్రీనాథుడు. కార్యభారంతో వచ్చాడు. అయినా త్వరత్వరగా ‘హరవిలాసం’ అనే శైవప్రబంధం రచించి సెట్టి చేతుల్లో పెట్టాడు. ఇందుకు బదులుగా రాచకార్యం పూర్తి చేశాడు సెట్టి. విజయగర్వంతో కొండవీడు చేరాడు శ్రీనాథుడు. కృతజ్ఞతగా శ్రీనాథుడికి విద్యాధికార పదవి కట్టబెట్టాడు వేమారెడ్డి. ఈ మహోన్నత పదవిలో శ్రీనాథుడు 18 ఏళ్ల పాటు మహారాజ భోగాలు అనుభవించాడు. రాజుతో వెళ్లని ఊరు లేదు. పొందని అనుభవం లేదు. వర్ణించని అందం లేదు.

అంతలో 1420లో పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. శ్రీనాథుడి పరిస్థితి తారుమారైంది. కొన్నేళ్లుగా ఒకే వంశాన్ని నమ్ముకొని, ప్రభువులకు తలలో నాలుకై, కొండవీటి శత్రువులకు తానూ శత్రువై, ఆపై అష్టైశ్వర్యాలు అనుభవించి. కవిరాజై వర్ధిల్లి, కవిపుంగవులకు సింహస్వప్నమై- ఇప్పుడు రాజాశ్రయం కోల్పోయాడు.

పైగా వయసేమో 50 ఏళ్లు. చేసేదిలేక కొండవీడు విడిచి పలనాడుకి పయనమయ్యాడు. పేదరికం తాండవించే ప్రాంతమది. వరి అన్నం లేదు. మంచినీళ్లు లేవు. విలాసాలు లేవు. చెప్పలేనన్ని బాధలు. అయినా ‘పలనాటి వీరచరిత్ర’ అనే అచ్చమైన దేశీకావ్యం రచించాడు.

ఇక రాజమహేంద్రవరం రెడ్డి రాజుల్ని ఆశ్రయించక తప్పలేదు. తాను వెళ్తున్నది శత్రురాజ్యానికి. అక్కడి వారంతా కొత్త. తనను చూస్తే కత్తులు దూస్తారు- కవులైనా, భటులైనా. ఫలించే పరిచయాలు ఉంటే తప్ప రాజదర్శనం జరగదు. అలాంటి హితుడు ఎవరున్నారా అని ఆలోచించాడు. ద్రాక్షారామలోని బెండపూడి అన్నయ అనే సఖుడు గుర్తొచ్చాడు. వెంటనే వెళ్లాడు. కబుర్లాడారు. తనకూ ఓ కావ్యం అంకితమివ్వమని కోరాడు అన్నయ. కాదనలేదు శ్రీనాథుడు. ‘భీమఖండం’ రచించి అన్నయకి అంకితమిచ్చాడు. తెలుగువారి పండగల్ని, పంటల్ని, వంటల్ని, పిండివంటల్ని, తత్త్వాన్ని, మనస్తత్వాల్ని, ఆచారాల్ని, కట్టుబాట్లని పిండారబోశాడు ఈ శైవ కావ్యంలో శ్రీనాథుడు.

ఇందుకు కృతజ్ఞతగా బెండపూడి అన్నయ శ్రీనాథుణ్ణి రాజమండ్రికి తీసుకెళ్లాడు ప్రభుదర్శనం కోసం. కానీ అక్కడి కవులు, శ్రీనాథుణ్ణి అడ్డుకొన్నారు. కాకుల్లా పొడిచారు. చివరకు ఇదే భూమికి అసమాన కీర్తిప్రతిష్ఠలతో తిరిగివస్తానని శపథం చేసి మరీ గోదావరి తీరాన్ని విడిచిపెట్టాడు.

ఇక మిగిలింది విజయనగర చక్రవర్తులు. వారి ప్రాపకం పొందాలంటే మరో చెలికాడు దొరకాలి. దొరికాడు. అతగానే వినుకొండ వల్లభరాయుడు. ఇతడు కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు అధికారి. శ్రీనాథుడు వచ్చేసరికి ఇతడు ‘క్రీడాభిరామం’ రచిస్తూ ఉన్నాడు. కానీ రససమంచిత కవికాడు వల్లభుడు. అందుకే ఈ రచనని శ్రీనాథుడే చేపట్టి కవిగా వల్లభరాయుడి పేరే పెట్టాడు. ఉబ్బితబ్బిబ్బయ్యాడు వల్లభుడు. ఆ రుణం తీర్చుకొనేందుకు తానే స్వయంగా శ్రీనాథుణ్ణి విజయనగరానికి తీసుకెళ్లాడు.

అయినా విజయనగర ప్రౌఢదేవరాయల దర్శనం త్వరగా లభించలేదు. మళ్లీ కష్టాలు. రాచవీధుల్లో కాళ్లరిగేలా తిరిగాడు. నువ్వులపిండి తిన్నాడు. చల్ల అంబలి తాగాడు. చివరకు రాజు ఎదుట కవితాప్రదర్శనకి అవకాశం దక్కింది. డిండిమభట్టు కంచుఢక్కని పగలగొట్టించి, ‘కవిసార్వభౌమ’ బిరుదు పొందాడు. ప్రౌఢదేవరాయలు- తన ముత్యాలశాలలో సభా మధ్యమున ఉన్నతపీఠంపై శ్రీనాథుణ్ణి కూర్చోబెట్టి, శిరస్సుమీంచి జలధారగా దీనారటంకాల్ని గుమ్మరించి అలా నేలపై పడిన వాటిని కవి,పండితులకు పంచిపెట్టి- కనకాభిషేకం చేశాడు. అలాంటి సత్కారాల మోజుతో అక్కడే ఉండిపోలేదు శ్రీనాథుడు. రాయలసీమ నుంచి తన చూపు తెలంగాణపై వేశాడు. నల్గొండ దగ్గరి రాచకొండ రాజ్యానికి వెళ్లాడు. ఒకప్పుడు పెదకోమటి వేమారెడ్డిని రాచకొండ ప్రభువులు ఓడించి రెడ్డిరాజులు గర్వంగా భావించే కఠారిని తీసుకుపోయారు. ఇప్పుడు శ్రీనాథుడు దాన్ని తిరిగి దక్కించుకొన్నాడు తన పాండిత్య పాటవంతో!

తెలంగాణ నుంచి తిరిగి తన స్వస్థలాలకు బయలుదేరాదు. అసమాన కీర్తిప్రతిష్టలతో ఒకనాడు అవమానించిన రాజమండ్రిలో అడుగుపెట్టాడు. అక్కడి రాజు వీరభద్రారెడ్డి అక్కున చేర్చుకొన్నాడు శ్రీనాధుణ్ణి. ‘కాశీఖండం’ రచించి వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు శ్రీనాథుడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ‘శివరాత్రీమాహాత్మ్యం’ రచించాడు.

అవసానదశలో అష్టకష్టాలు పడ్డాడు శ్రీనాఽథుడు. కావ్యం రాసే ఓపిక లేదు. అంకితం తీసుకొనే రాజులేడు. ఆదరించే నాథుడు లేడు. భోగాలందించే ప్రభువు లేడు. పూటగడిచే పరిస్థితి లేదు. అయినా మరణిస్తూ శ్రీనాథుడు పలికిన మాటలు -‘‘ అదిగో స్వర్గంలోని కవులు కంగారుపడిపోతున్నారు- శ్రీనాధుడు వచ్చేస్తున్నాడని’’.
అదీ సంగతి!

వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, ప్రౌడ దేవరాయలు, సాంపరాయని మైలారురెడ్డి, తెలుగు రాయలు మొదలైన వారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందిన వారు శ్రీనాథుడు.

కవిత్వంలో వ్యకిత్వ వికాసం:
--------------------------------------
శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇంతా అంతా కాదు. బోలెడంత ఉంది. అతని వ్యక్తిత్వం, జీవితం నేర్పే గుణపాఠాలు ఎన్నో. బ్రతికితే శ్రీనాథుడిలా బతకాలి - మరణించినా శ్రీనాథుడిలాగే మరణించాలి.
"పనివడి నారికేళ ఫలపాకమునంజవియైన భట్టహ

ర్షుని కవితాను గుంభములు సోమరిపోతులు కొందఱయ్యకౌ

నని కొనియాడనేరదియట్టిద, వేజవరాలు చెక్కుగీ

టిన వసవల్చు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే?"

శ్రీనాథుడు శృంగారనైషధంలో ఈ పద్యం రాశాడు. సంస్కృతంలో భట్టుహర్షుడు నైషధ కావ్యం రాశాడు. అది విద్వదౌషధం వంటిది అన్నారు. 'నారికేళపాకంలా ఉందండి బాబూ' అన్నారు. కొరుకుడు పడదని ఈసడించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిందే పై పద్యం. కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కృషి అవసరం. ప్రయత్నం అవసరం. సోమరితనం పనికిరాదు. విశ్వనాథ మరొకసారి ఇలా అన్నారు - "కవిత్వం అర్థం కాదంటారు. అర్థం చేసుకోడానికి నువ్వేం ప్రయత్నం చేశావ్. జువాలజీ అర్థం చేసుకోవాలంటే జువాలజీకి సంబంధించినవన్నీ చదువుతావా? మేథమాటిక్స్ అర్థం చేసుకోవాలంటే ఎంత కృషి చేస్తావ్? మరి కవిత్వం అర్థం చేసుకోవటానికి కృషి అక్కరలేదా?". శ్రీనాథుడు "అర్థం కాదు - కొరకరాని కొయ్య " అనే వారిని చూసి చిరాకు పడిఉంటాడు. కాబట్టి మంచి ఉపమానంతో ఇలా అన్నాడు - "మాంచి వయసులో ఉన్న కన్య చిన్నపిల్లాడి చెక్కు గీటితే ఆ పిల్లాడిలో ఏ భావం ఉంటుంది?". అంటే సరసానికైనా విరసానికైనా ఒక స్థాయి ఉండాలి. లేకపోతే అపాత్రదానంలా, అరసికుని కవిత్వంలా వ్యర్థమై పోతుంది. కాబట్టి ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్థాయి లేకుండా విమర్శించేవారు - అదిగో ఆ బాలుని వంటి వారే - అని భావం. ఇది కవిత్వానికే చెప్పినా అన్ని చోట్ల, అన్ని రంగాలకూ వర్తిస్తుది.

శ్రీనాథుడ్ని పండితులు - సంస్కృత పండితులు ఈసడించారు. 'డుమువుల కవి ' అని వెక్కిరించారు. "నీది ఏం భాషయ్యా బాబూ - సంస్కృతమా? తెలుగా?" అన్నారు.

"ఎవ్వరేమండ్రు గాక నాకేల కొఱత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష"

అని ధైర్యంగా రాశాడు.

"కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి? ... శత్రువుడొకడు దనంతటివాడు గల్గినన్" అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు.

"డంబు సూపి భూతలంబుపై తిరుగాడు

    కవిమీదగాని నాకవచమేయ

దుష్ప్రయోగంబుల దొరకని చెప్పెడు

    కవి శిరస్సున గాని కాలుచాప

సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు

    కవుల రొమ్ముల గాని కాల్చివిడువ

చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు

    కవినోరు గాని వ్రక్కలుగ తన్న"

అని ఎదిరించి నిలిచాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి గదా అన్న భావం చెప్పక చెప్పాడు.

"బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము"

అని భీమఖండంలో నూతిలో కప్పలవంటి వదరుబోతు పండితులపై కన్నెర్రజేశాడు.

అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -
"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం  బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి.

జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు.

జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

    పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

    నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

    వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

    తగిలియుండెను గదా నిగళయుగము "

శ్రీనాథుడు ఏడువందల టంకాలా సుంకం చెల్లించక పోవటంవల్ల పై శిక్షలు అనుభవించాడు. కాని అంత కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నప్పుడు కోపం రాలేదు - తిట్లు రాలేదు. కష్టాలను 'స్పోర్టివ్'గా తీసుకొనే తత్వం కనిపిస్తుంది. ముళ్ళకాయల దండ మెడలో గుచ్చుకొని బాధిస్తుంటే - "ఈ పొగడ దండ ఎంత అదృష్టవంతురాలు - కవిరాజు కంఠాన్ని కౌగిలించుకొంది. ఈ పెద్ద బండరాయి - ఊరు చివర పడి ఉండేది - ఇప్పుడో, కవిసార్వభౌముని భుజం మీద కులుకుతోంది. వీరభద్రారెడ్డి ఆస్థానకవి చేతిలో ఈ వెదురు గడియ (చేతికి వేసే శిక్ష) వియ్యం అందుకుంటోంది. ఈ సంకెళ్ళు శృంగారనైషధం రాసిన కాలిని అలంకరించాయి" - అంటూ ఒకపక్క బాధపడుతున్నా కవిత్వం చెప్పాడు. ఏడుస్తూ కూర్చోలేదు. 'అదీ వ్యకిత్వ వికాసం అంటే!'.

శ్రీనాథుడు గత భోగాల్ని తలచుకొని దిగులు చెందినా మరణానికి జంక లేదు. ఎంత 'ఖలేజా' ఉందో పరిశీలించండి:

"కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి

    రత్నాంబరంబు లేరాయుడిచ్చు?

కైలాసగిరి పంట మైలారు విభుడండే

    దినవెచ్చ మేరాజు దీర్చగలడు?

రంభగూడే దెనుంగు రాయరాహత్తుండు

    కస్తూరికేరాజు ప్రస్తుతించు?

సర్వస్థుడయ్యె విస్సన్న మంత్రి మఱి హేమ

    పత్రన్న మెవ్వని పంక్తి గలదు?"

అంటూ గతవైభవాన్ని నెమరు వేసుకొన్నా - మరణం సమీపిస్తున్నా దిగులు చెందడం కన్న పరిస్థితిని ఎదుర్కొనే స్థైర్యం కలవాడు శ్రీనాథుడు. జీవితం ఒక సవాలు - దాన్ని స్వీకరించాలి అన్నదే శ్రీనాథుడు ఇచ్చే సందేశం. దీనికి ఈ రెండు పాదాలు నిలువెత్తు సాక్ష్యాలు:

"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి "

-స్వర్గలోకంలో తనకంటే ముందు వెళ్ళిన మహాకవులున్నారు. వాళ్ళ గుండెలు గుభేలుమనేలా - అమ్మో, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు అని భయం కలిగేలా - నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాను " అని ఠీవీగా పలికాడు. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని స్వీకరించాలి - దానికి గుండె ధైర్యం కావాలి. ఈ విధంగా శ్రీనాథుడి జీవితం, పద్యాలు మనకి కావలిసినంత 'పెర్సనాలిటీ డెవలెప్ మెంట్' ను బోధిస్తాయి.

పెదకోమటి వేముడి ఆస్థానంలో విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు రాజభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు శ్రీనాధుడు. అతడు మరణించాకా, శ్రీనాధుడు 1424 ప్రాంతాల్లో పల్నాటి సీమకు రాజాశ్రయం కోసం వెళ్ళాడు. పల్నాడు వెనుకబడిన రాజ్యం. కొండవీటిలో రాజభోగాలు అనుభవించిన శ్రీనాధుడికి ఈ ప్రాంతం రుచించలేదు.

అది ఈ పద్యం వల్ల తెలుస్తుంది.

చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు- నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జజోన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు- పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

తక్కువ తెలిసి ఉండి, గర్వంతో ఎక్కువ మాట్లాడే కుకవుల గురించి శ్రీనాథుడు వ్రాసిన పద్యం...

బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు
శాంతి నిప్పుచ్చరంబు మచ్చరము ఘనము
కూపమండూకములుబోలె గొంచె మెరిగి
పండితంమన్యులైన వైతండికులకు. (భీమ ఖండం -1 -13 )

తనకు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోతాడు వ్యాసుడు. అతడిని శర్వాణి వారించే పద్యాలు...

భిక్ష లేదని ఇంత కోపింతురయ్య
కాశికాపట్టణముమీద గాని నేయ !
నీమనశ్శుద్ది తెలియంగ నీలకంఠు
డింత చేసేనుగాక కూడేమి బ్రాతి? (భీమ ఖండం 2-114 )

శివుడు నిన్ను శోధించడానికి భిక్ష పుట్టకుండా చేసాడని చెప్పేసింది.

తెలుగు భాష గొప్పతనాన్ని మొదట చాటిన వాడు శ్రీనాధుడే ! క్రీడాభిరామం లోని ఈ పద్యం చూడండి...

జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు దెనుగులెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ?

కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు.

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...

అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.

బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.

సన్నన్నం తినే అతనికి ఆ ప్రాంతం లోని జొన్న కూడు రుచించలేదు. దానికి తోడు, చింత కూర, బచ్చలి కూర కలిపి వండిన ఉడుకు పులుసు ఒకటి! ఆ చేదు శ్రీనాధుడు భరించలేకపోయాడు. తానేమిటి, తనను పుట్టించిన జేజమ్మ కూడా తినలేడు...శ్రీనాధుడు శ్రీకృష్ణుడిని ఇలా సవాలు చేసాడు.

" ఫుల్లసరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావినా

నల్ల దావాగ్ని మ్రింగితి నటంచును నిక్కేదవేల?

పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జోన్నకూటితో

మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీపస గానవాచ్చేడిన్ "

భావము: చిన్న నాడు పూతన ఇచ్చిన విషపు చేదు పాలు తాగానని గర్వంగా చెప్పు కుంటావే ... కృష్ణా, బచ్చలి ఆకులతో చేసిన ఈ జొన్న కూడు ఒక్క ముద్ద దిగ మింగి చూడు, నీ సత్తా తెలుస్తుంది.

భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడు శ్రీనాథుడు. ఈ పద్యం చూడండి -

గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్‌
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్‌
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌
తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్‌
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా"

పల్నాట తనకు ప్రియమైనవి ఏమీ లేవంటూ వ్రాసిన ఈ పద్యం చూడండి...
" అంగడి యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే

దంగన లిమ్పులేరు ప్రియమయిన వనంబులు లేవు, నీటికి

భంగాపడంగా బాల్పడు క్రుపావరు లేవ్వరులేరు దాతలె

న్నంగాను సున్నా, గాన బలనాటికి మాటికి బోవనేటికిన్?

రాసికుడుపోవాడు పాలనా- దేనగంగా రంభయైన నేకులేవడకున్

వసుధేసుడైన దున్నును- గుసుమాసృన్ డైన జొన్నకూడె కుడుచున్..."

ఇలా పల్నాటికి వీడ్కోలు పలికి, గోదావరీ తీరానికి వెళ్ళాడు.

ఆ ప్రాంతాన్ని ఇంత తేలిగ్గా చెప్పిన శ్రీనాథుడు.. చివరకు అక్కడి పల్నాటి వీరచరిత్రను గ్రంథంగా రాశారు. అదంతా ఆ చెన్నకేశవుడి మహిమే అని చెబుతారు. పల్నాటి మీద పలు మాటలు తూలినందుకు అక్కడి వీరుల చరిత్రను రాసి తన తప్పును దిద్దుకోమని చెన్నుడే... ఆ మహాకవికి చెప్పాడని నమ్మిక. నిజమే లేదంటే... ఆ ప్రాంతం మీద అంత హేళనగా పద్యాలు రాసిన మహాకవి... అక్కడి వీరుల చరిత్రను రాయడం విశేషమే మరి. పల్నాటి వీరచరిత్రను... మంజరీ ద్విపద కావ్యంగా రాశారు. ఇదే ఆయన చివరి రచన కూడా అని చెబుతారు.

శ్రీనాధ కవిసార్వభౌముడు అనగానే సంస్కృత పద భూయిష్టమైన శైలి మెదలక మానదు మన మనసులో.. కానీ తీయతీయని తెలుగుపదాలతోకరుణ రసం తొణికిసలాడే ఈ పద్యాన్ని చూద్దామా.. నైషధం లో తనని నలుడు పట్టుకున్నప్పుడు హంస నలుడితో ఇలాఅంటుంది

"తల్లిమదేకపుత్రక పెద్ద కన్నులు,
గానదిప్పుడు మూ(డుకాళ్ళముసలి
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెరుగదు ,
పరమపాతివ్రత్యభవ్యచరిత
వెనకముందర లేరు నెనరైన చుట్టాలు ,
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
,జీవనస్థితి కేన తావలంబు
కృప దలంప(గదయ్య యో నృపవరేణ్య ,
యభయమీవయ్య యో తుహినాంశువంశ
కావగదవయ్య యర్దార్ది కల్పశాఖి
నిగ్రహింపకుమయ్య యోనిశధ రాజ!"

పద్యం చదువుతుండగానే మనకళ్ళెదుట చక్కని దృశ్యం రూపు కడుతుంది. ఒక్కడే కొడుకు మీద పంచప్రాణాలూ నిల్పుకున్న మూడుకాళ్ళ ముసలి తల్లి,వ్యవహార జ్ఞానం లేని అమాయకురాలు, ఉత్తమురాలు, పరమ పతివ్రత అయిన భార్య,లేక లేక కలిగిన పసిబిడ్దలు.. నిరాధారమైన ఒక సామాన్యుడి వ్యధ మెదులుతుంది.

రాయంచ యంచు (జీరకు జోక యగు(గాక
పచ్చియేనిక తోలుపచ్చడంబు
హరిచందనాస్పదంబగు హృదయము మీ(ద(
బట్టు ( జేకొను(గాక భసితధూళి
కమనీయ చరణలాక్షారాగలేఖచే
ముద్రితంబగు(గాక రుద్రభూమి
కలితముక్తాఫలగ్రైవేయకంబుతో (
దులదూ (గు(గాక పెంజిలువపేరు

శ్రీనాధుడి హరవిలాస కావ్యంలో కపట బ్రహ్మచారి రూపం లో వచ్చిన శివుడు శివుడ్ని వివాహమాడదలచింది అని విని పార్వతిని సందర్భం..." బాగుంది బాగుంది నీ రాజహంసలు ముద్రించబడిన పట్టుచీరకు దీటుగా వారి పచ్చిధనమైనా పోని యేనుగు తోలు వస్త్రం,ఘుమఘుమల గంధాన్ని అలదుకునే నీ హృదయం మీద విభూది కూడా ముద్రించబడుతుందిలే ... చక్కగా లత్తుక (పారాణి )పూయబడిన నీ పాదపద్మాలు శ్మశానం లోనా తల్లీ అడుగుబెట్టేది ?నువ్వేమో ముత్యాల హారాన్ని ధరించావు.. వారి మెడలో పెద్దపాము బాగుంది".. ... అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాట్లున్నా "

"కస్తూరికా కుంకుమ చర్చితాయై ,
చితారజః పుంజ విచార్చితాయ "

ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై
స్ఫురన్మహాపన్నగ భూశణాయ
శివాన్వితాయైచ శివాన్వితాయ "
అని ఆది శంకరుల వారిచేత స్తుతించబడిన అర్ధనారీశ్వర తత్వమే మనకి సాక్షాత్కరిస్తోంది కదా !--

సీ. వేదండ వదన శుండాదండ గండూష
కాండ సిక్తాప్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికా లగ్న షాణ్మాతురములు
నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక
తరళ విద్యాద్ధరీ స్తన భరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

తే. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధవళితాకాశ చర వనితా ముఖములు
శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయ వీధి

పై పద్యం కవిసార్వభౌముడైన శ్రీనాధుని హరవిలాస కావ్యం లోనిది. కావ్య ప్రారంభంలో, ఇష్ట దేవతా ప్రార్థన చేసే సందర్భంలో శివపార్వతులను సంభావిస్తూ రాసిన పద్యం. ఏ కవి అయినా దైవప్రార్థన చేసేటప్పుడు ఒక నమస్కారం పెట్టి ఊరుకోడు. ఆ దేవుడి ప్రభావాన్నీ, లీలలనూ ఉత్ప్రేక్షలతోనో, రూపకాలతోనో చమత్కారంగా వర్ణించి – అలాంటి దేవుడు నా కృతిభర్తనూ నన్నూ కాపాడుగాక అని వేడుకోవడం పరిపాటి. అలాంటిదే ఈ పద్యమున్నూ. ఇందులో కేవలం శివపార్వతులనే గాక శైవలోకం లోని ఇతర ప్రధాన పెత్తందార్లనూ, వారి చేష్ఠావిన్యాసాలనూ వివరిస్తూ పద్యాన్ని నడిపించాడు కవి. మొత్తం మీద ఒక సందర్భాన్నీ, సంఘటననూ ఈ దేవదేవులూ, వారి పరివారమూ ఎలా నిర్వహించుకున్నారో, ఆ సంబరాన్ని తెలిపేది ఈ పద్యం.

సందర్భం మధుకేళి. అంటే వసంతోత్సవం. హోలీ పండగన్నమాట. రంగులు పులుముకోవడం, పిచికారీలతో రంగునీళ్ళు చిలకరించుకోవడం ఈ పండగలోని ప్రధాన కార్యక్రమం. ఇలాంటి సందర్భాల్లో చిన్నా పెద్దా తేడాల్లేకుండా, ఉల్లాసంగా అందరూ కలిసిపోవడం ఆనవాయితీ. అంతే కాదు, మర్యాద కోసం మనసులోనే దాచి వుంచుకొని బైటికి తెలుపుకోలేని కోరికలనూ, ఆశలనూ కొంచెం బయట పెట్టుకునే అవకాశం లభించేది ఇలాంటి సందర్భాల్లోనే. ఈ ఉల్లాసాన్నంతా ఈ పద్యంలో చూపించాడు శ్రీనాధుడు.

హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌! (భీమ 1-11)

(ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!)

వక్రత కాఠిన్యం సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు.

ఉ. కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్

చదువుతుండగనే అర్థమైపోతూ ఏ వివరణ అక్కర్లేని పై పద్యం శ్రీనాధుడిది. కాశీఖండం అనే కావ్యం లోనిది.

కం. ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)

తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.

కం. నేమంబున నొక ప్రాణా
యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)

నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.

తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.

సీ! చక్రవాళ పరీత సర్వం సహా
పరమ తీర్ధములలో బెరువ కాశి
కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ
సమితి లో సారంబు జహ్ను కన్య
జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు
గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు
మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం
టెను విశ్వనాధు దర్శన మధికము.

తే!గీ! విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె
గాలకంఠుని కంటె ముక్కంటి కంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో..కాశీ పెరువ. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

ఈ విధమైన కాశీ మహాత్మ్యములు "శ్రీనాధ మహాకవి" ప్రణీతంబైన "శ్రీ కాశీ ఖండం"లో సప్తమాశ్వాసమునందు చెప్పబడెను. ఈ పద్యములు విన్నా,చదివినా సకల ఐశ్వర్యములు సిద్ధించును.

కవి సార్వభౌముని చాటువు

కొందరు భైరవాశ్వములు కొందరు పార్థుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు పార్థుని ఎక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసినవారాలు ఈ సదస్సు లో
అందరు నందరే మరియు నందరు నందరు నందరే గనన్

భావము : భైరవుని రథానికి పూన్చేది కుక్కలను, అర్జనుని రథ పతాకము పై గల గుర్తు 'కపి రాజు' ఆంజనేయుడు,సముద్రములో మునుగు భూమిని లేవనెత్తినది వరాహాహావతారములో విష్ణువు అంటే ఇక్కడ అన్వయములో మాత్రము పందులు, కృష్ణ జన్మ సమయమున కూసినవి గాడ్దెలు,(వసుదేవుడు-గాడ్దె కాళ్ళు), సభలో కూర్చున్నవారంతా ఈ జంతువులతో సమానమని నర్మగర్భంగా వంగ్య పూరితమైన ఈ పద్యాన్ని, ఒక రాజు,సభలో గల తన ఆస్థాన కవులను గూర్చి గొప్పగా చెప్పంటూ ఈ సమస్య ఇస్తే,శ్రీనాధులవవారు పై విధంగా తెలిపినారు .

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!
అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!
శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!

తీర్థ సంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యాన వాటికా మఠములార!
పోయివచ్చెద మీకాశిపురము విడిచి||

కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!
పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.

ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో శ్రీనాధుని "కాశీఖండము" నుండి.

నీకతంబునఁ గాదె లోకభీకరులైన, త్రిపుర దానవుల మర్ధింపఁ గలిగె
నీకతంబునఁ గాదె కాకోల విషవహ్ని, యలవోకయును బోలె నార్ప గలిగె
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి, నంధకాదుల గర్వ మడఁపఁగలిగె
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ, సంగమోత్సవ కేళి సలుపఁ గలిగె

నాత్మజుఁడవన్న మిత్త్రుండ వన్న భటుఁడ
వన్న సచివుండవన్న నాకెన్న నీవ
నిన్ను నెబ్భంగి వర్ణింప నేరవచ్చు?
కంఠపీఠాగ్ర కరైరాజ! డుంఠిరాజ!

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి.

కమలలోచన మనుజుఁ డొక్కటిఁదలంప
దైవమొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు
కాశిఁ బెడఁ బాయనని యేను గదలకుండఁ
గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణలేక

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...