Friday, August 23, 2013

నాయకుని ఎదురుగా గుంజీలు ఎందుకు తీస్తారు?



విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది. 

 ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే  ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే! 

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

దీక్షలు స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.

 దీక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత భవానీ దీక్ష కూడా చాలా మందికి పరిచయం. ప్రతీ ఒక్క భక్తుడూ ఏదో ఒకసందర్భంలో దీక్ష తీసుకోవాలని అనుకుంటాడు. దీక్షలు చాలా మంది పడుతూ ఉంటారు. కానీ దీక్షా ఫలాన్ని ఏకొందరో మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఎందువల్ల?

నెలరోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మానేయగలరా? ఈ నెల రోజులూ జీతం ఇవ్వం, ఉచితంగా మీ సేవలు అందించండి అంటే ఎంత బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది మన జీవన ఉపాధి కనుక. మనమీద కుటుంబ బాధ్యతలు ఉంటాయి కనుక. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అందుకే కంపెనీ ఎంత లాసులో ఉన్నా కనీసం సగం జీతమైనా పొందే వరకూ పోరాడతాం. అలాగే ఈ దీక్షను రోజుల తరబడి చేస్తాము. మరి ఫలితం పొందకుండా ఎలా? పొందితీరాలి. అటువంటి దీక్ష ఎలా స్వీకరించాలి? ఏమి నియమాలు పాఠించాలి? అసలు ఏదీక్ష ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది?

మీరు అయ్యప్ప దీక్ష విని ఉంటారు. దుర్గా దీక్ష విని ఉంటారు. శివ దీక్ష విని ఉంటారు. హనుమత్ దీక్షలు తెలుసు. బ్రహ్మచర్య దీక్ష గురించి కొందరు విని ఉంటారు. విద్యా దీక్ష ఎప్పుడైనా విన్నారా? ఉద్యోగ దీక్ష తెలుసా? మరి మౌన దీక్ష? ఇలా అనేక రకాల దీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు తెలిసి, కావాలనుకుని స్వీకరిస్తాం. మరికొన్ని ఇది దీక్ష అని తెలియకుండానే స్వీకరిస్తాం.

ఉదాహరణకు : బ్రహ్మచర్య దీక్ష. ఉపనయనము అయినప్పటి [ పిల్లవాడిని స్కూలులో చేర్చిన దగ్గర ]నుండీ, స్నాతక మహోత్సవం [ డిగ్రీనో, పీజీనో పూర్తి చేసి పట్టా పుచ్చుకునే ] వరకూ మనం బ్రహ్మచర్య దీక్ష అంటాము. ఇది తెలిసినా తెలియక పోయినా మనం దీక్షను పాటిస్తున్నట్టే.

అలాగే మనం ఒక్కో సారి ఓ నెలరోజులలో ఈ ఇంగ్లీషు గ్రామరు పై పట్టు సాధించాలి అని అనుకుని గంటల తరబడి సాధన చేసి ఇంగ్లీషుపై పట్టు సాధిస్తాం. అది కూడా దీక్షే! విద్యా దీక్ష అనవచ్చు.

ఇక ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేవి దైవ దీక్షలు. ఏదో ఒక దైవం మీద నమ్మకంతో ౪౦ రోజులు దీక్షపూని, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. వీటివలన ఆధ్యాత్మిక ఉన్నతి తద్వారా విద్యా ఉద్యోగ ఉన్నతులు కూడా కలగుతాయి. ఇంకా అనేక కోరికలు తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు.

అటువంటి ఉన్నతి మనకు కలగాలంటే ఎలా?

 మనం ఎంతో ఎదిగాము అనుకుంటాం. చాలా నాగరికులం అనుకుంటాము. కానీ ఒక్కోసారి సంతలో గొర్రెలలా ప్రవర్తిస్తాం. పక్కింటి వాళ్ల అబ్బాయి ఇంజనీరుంగు చేస్తున్నాడని మన వాడూ ఇంజనీరైపోవాలి అని పెద్దలు, మన స్నేహితులు అందరూ ఇంజనీరింగే కనుక మనమూ ఇంజనీరై పోవాలి అని పిల్లలు. ఎంసెట్ లో ఎంత రాంకు వచ్చినా ఫర్వాలేదు. ఏదో మారుమూల కాలేజీ లోనైనా ఫర్వాలేదు. మొదట ఓ గొప్ప బ్రాంచ్ అనుకుంటాం. మన రాంక్ చూసి ఇది చాలు లే అనుకుంటాం. తీరా కౌన్సిలింగ్ లో అది కూడా రాదని తెలిసి వాడు ఏదిస్తే దానికి ( మొక్కలకు పందిరెయ్యడం నేర్పే కోర్స్ ఒకటి పెట్టి, దానికి ‘పందిరి బ్రాంచ్’ అని పేరు పెట్టి అందులో సీట్లున్నాయి అంటే దానికి కూడా ) సిద్ధమే మనం. ఏ బ్రాంచ్ అయితే నేముంది. నాలుగుసార్లు తప్పినా ఫర్వాలేదు. చివరికి ఇంజనీరింగ్ అయింది అనిపించుకుంటే చాలు. తరువాత మళ్లీ ఏ కంప్యూటర్ కోర్సో చేసి ఎలాగోలా బి.పి.ఓ. జాబ్ సంపదించకపోతామా... ఇదే మన ఆలోచన, కాదు కాదు ధోరణి అనాలేమో.? ఎందుకంటే అసలు ఆలోచన అనేది ఉంటేగా..? చుట్టూ నలుగురూ చేస్తున్నారు. బాగా సంపాదించొచ్చు. నలుగురితో పాటు నరాయణా!

ఏమి చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదువుతాం. అదీ ఒక చదువేనా..?

 అంటే ఇంజనీరింగ్ ఎందుకూ పనికి రాని చదువని కాదు నా ఉద్దేశం. అది చాలా గొప్పది. అసలు నిరర్ధకమైన విద్య అనేది లేదు. మనం చదివే తీరే అలా ఉంది. ఇంజనీరింగ్ రాయాలంటే ఎవరో అన్నట్టు గట్స్ కావాలి. నేను ఫలానా కాలేజీలో, ఫలానా బ్రాంచ్ లో మాత్రమే చేరతాను. అని నిర్ణయించుకుని దానికి తగిన కృషి చేసి అక్కడే సీట్ సంపాదించి చదవాలంటే చాలా తెగువ, పట్టుదల ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చదివింది చదువు అని నలుగురి ముందూ ఒప్పుకోవచ్చు. అలా లేని నాడు అది చదువే కాదు. అలా భ్రమ పడుతున్నారంతే!

 సరిగ్గా దీక్షలు స్వీకరించే విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలామంది స్వీకరించి ఉంటారు. కానీ ఎంతమంది నియమాలు సరిగ్గా పాటించారు? ఇక్కడా మనం గొర్రెల్లా మరొకరిని అనుసరిస్తున్నామే తప్ప కాస్త ఆలోచించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాం. తిరుగుతాం. కొందరు ధూమపానం కూడా చేస్తారు. మరి తాగే వారు నాకు ఇంకా కనపడలేదు భగవంతుడి దయవలన. తోటి స్వామి పడి పూజ వెయ్యిమందిని పిలిచి చేస్తే , మనం రెండువేలమందిని పిలుస్తాము. రేపటి నుండి దీక్ష కనుక ఈ రోజు ఫుల్లుగా పట్టించేసి రేపు ఆ మందు దిగకుండానే మాలను ధరించాలి. (ఇది నా స్నేహితులైన స్వాములకు స్వీయ అనుభవం. తోటి స్వాములు కొందరు అలా ఉండే వారుట.) సాయంత్రం అల్పాహారం పేరుతో అరవై రకాలు ఆరగించాలి. చుట్టూ ఉన్న స్వాములు అలా చేస్తే మనమూ అలా ఎందుకు చేయాలి? కాస్తైనా ఆలోచన ఉండదా? "మాలధారణం నియమాల తోరణం" అంటూ రోజూ పాడుకుంటాం కానీ, నియమాలు పాటించడం అబ్బో అన్ని నియమాలు పాటించడం కొంచెం కష్టమే. అందుకే మన వీలును బట్టి కుదిరినవి పాటిస్తాం. ఇంకెందుకండీ దీక్ష? దీనివలన వచ్చే పుణ్యమేమో కానీ, పాపం మూట కట్టుకుంటున్నాం. నలుగురికోసం కాదు మనకోసం మనం దీక్షపూనుతున్నాం. నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి. మనలో అహం కారాన్ని పెంచే దీక్షలు వేలసార్లు పూనినా ఏమిటి లాభం? జీవితాన్ని తరింప చేయగల దీక్ష జన్మానికి ఒక్క సారి స్వీకరించినా చాలు.

నేడు మనం స్వీకరిస్తున్న భగవత్ దీక్షల నియమాలు బ్రహ్మచర్య దీక్షనుండి స్వీకరించినవి అయి ఉండవచ్చు. ఉపనయనమయిన బ్రహ్మచారి ఎటువంటి నియమాలు పాఠించాలో మన పెద్దలు చెప్పారు. దాదాపు అటువంటి నియమాలే నేడు స్వామి దీక్షలకూ విధించుకున్నాము.

దీక్ష - నియమాలు

౧.సూర్యోదయాత్ పూర్వం లేవాలి.

౨.సూర్యోదయానికల్లా పూజను ప్రారంభించాలి.

౩.రోజుకు కనీసం ౧౦౦౦ సార్లు నామాన్ని స్మరించాలి. ఏ పని చేస్తున్నా మన నాలుకపై భగవన్నామం ఆడుతూ ఉండాలి.

౪.వార్తా పత్రికలు, టీవీ, ఇంటర్ నెట్ వంటివి ముట్టుకో కూడదు. ఉద్యోగ విషయమై అవసరమైతే తప్ప.

౫.ధూమ పానం, మద్య పానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.

౬.శాఖాహరం ,సాత్వికాహారం తీసుకోవాలి.

౭.కోపం పూర్తిగా వీడాలి. వివేకం పని చేయాలి.

౮.సత్యం మాట్లాడడం చాలా అవసరం.

౯. ఈ దీక్ష మానసిక, వాచిక, కాయికములను మూడింటి ద్వారా జరగాలి.

౧౦.మూడు కాలాలూ భగవంతుని ఉపాసన చేయాలి. ఉద్యోగస్తులు కనీసం ౨ కాలాలు(ఉదయం,సాయంత్రం) అయినా పూజించాలి.

౧౧.నోటితో అసభ్య పదాలు పలకూడదు.

౧౨.చేతితో చెడు చేయకూడదు.

౧౩.మనసుతో చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది చాలా కష్టమైనది. కానీ అమ్మమీద భారం వేసి మొదలు పెడితే అంతా శుభం జరుగుతుంది.

౧౪. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ఉండకూడదు.ఎల్లప్పుడూ విబూధి ధరించి, ఎర్రని తిలకాన్ని ధరించాలి. ఉదయం పూజానంతరం గంధాన్ని ధరించాలి. తెల్లని స్ఫటిక పూసలు దీక్షా మాలగా ధరించాలి. శిఖను ధరించాలి. మొలత్రాడు తప్పక ఉండాలి. పూజా సమయంలో పంచె, కండువాలు మాత్రమే ధరించాలి. చేతికి దీక్షా కంకణమును రక్షగా కట్టుకోవాలి.

౧౫. నేలమీద శయనించాలి. నేలమీద కూర్చుని భుజించాలి. నీటిని కూడా కూర్చుని స్వీకరించాలి. ఏక భుక్తము చేయాలి. భోజనము కొరకు కాక, శక్తి కొరకు మాత్రమే అన్నట్లు భుజించాలి.

౧౬. భగవంతుని చిత్రపటమును, కలశమును పెట్టి ఈ దీక్షాసమయంలో పూజించాలి. పూజా ప్రదేశము నిత్యము శుభ్రముగా ఉంచాలి. దీపం వెలుగుతూ ఉండాలి. భజనలు వంటివి జరుపుట శ్రేష్ఠము. నిత్యము ధ్యానము కనీసం ౧౫ నిమిషాలు చేయాలి. ఏపని చేస్తున్నా ఆంతరింగిక పరిశీలన చేయాలి. లోపలి వ్యక్తిని గమనించాలి.

౧౭. మనం మన జీవితంలో ఎటువంటి పురొగతి కోరుకుంటున్నామో, ఆ పనిని ఈ నలభై రొజులలో సాధన చేయడం మొదలు పెట్టాలి. మన ఆశయ సాధనకు మొదటి అడుగును వేయాలి. తరువాతి అడుగులు భగవత్కృపచే వాటంతట అవే పడతాయి.

౧౮. పూజ, ధ్యానం, ఉద్యోగం, లక్ష్య సాధన వీటితో ప్రధానంగా నిండినదై మన దిన చర్య ఉండాలి. మిగిలిన వ్యసనాలు సమయాన్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం వంటివి చేయాలి. రోజంతా భగవత్ చింతనలో గడపాలి.

 మీరు స్వీకరించే దీక్ష ఎటువంటి దైనా నియమాలు లేకుండా ఫలించదు. సరదాగా ఆడే క్రికెట్ ఆడాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాట్ విసురుతాను నువ్వు బాలుతో తన్నాలి అంటే కుదరదు. బ్యాటుతో బాలుని మాత్రమే తన్నాలి. మరి అలాంటిది మన జీవితానికి ఎన్ని నియమాలు ఉండాలి? నియమాలు లేని జీవితం అందగా ఉండదు. అర్థరహితంగా ఉంటుంది. ఆ నియమాల విలువను తెలిపేందుకే ఇటువంటి దీక్షలు అవసరమౌతాయి.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు|

బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ||

ఇన్ద్రియాణి హయనాహు ర్విషయాస్తేషు గోచరాన్|  - కఠోపనిషత్తు.

ఆత్మ రథికుడు, శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. ఇంద్రియాలు గుర్రాలు, అవి నడిచే దారులు విషయ వస్తువులు.

నేర్పరి అయిన సారథి అనేక వైపులకు పరుగులు తీసే గుర్రాలను కళ్లెంతో అదుపు చేసి, ఒకే గమ్యం దిశగా పయనింప చేస్తాడు. అలాగే బుద్ధి శాలి అయిన వాడు అనేక విషయ వాసనలతో పరి పరి విధాల ఆకర్షింప బడు ఇంద్రియాలను, మనసు అనే కళ్లెంతో అదిలించి, అంతర్ముఖం చేసి, ఒకే దారికి మళ్లించి గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే మనకు మనమే కొన్ని నియమాలను విధించుకుని మంచి మార్గం వైపుకు ఇంద్రియాలను మళ్లించుకున్న నాడు మన గమ్యాన్ని చేరగలుగుతాము.

 ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?


బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.

అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె 

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

మాంసాహారం తినడం అధర్మమా?

మాంసాహారం తినడం అధర్మమా?

నేడు శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మాంసాహారులు అనారోగ్యం పేరుతో శాకాహారులవుతున్నారు.

శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా మరుతోంది. ఎక్కడ చూసినా మాంసాహార శాలలే కనిపిస్తున్నాయి. కాలేజీ ర్యాగింగులలో శాకాహారి అనేవాడు కనబడితే వాడు మాంసం ముట్టేదాకా వెధిస్తారు. ( ఈ స్థితి ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు మందు, సిగరెట్, అమ్మాయిలు ఈ విషయాలలో సీనియర్స్ జూనియర్స్ కి వద్దుమొర్రో అన్నా నెర్పిస్తున్నారు. ) మనసులో శాకాహరిగా ఉందామని ఉన్నా చుట్టూ ఉన్న అనేక పరిస్థుతుల వల్లో, చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది మాంసాహారులే ఉండడం వల్లో, జిహ్వ చాపల్యం వల్లో, ప్రలోభం వల్లో నేడు శాకాహారులందరూ మాంసాహారులవుతున్నారు. గుడ్డు మాంసాహారం కాదని దానిని శాకాహారంలో కలిపెసిన వారూ ఉన్నారు.

ఇటువంటి సందర్భంలో శాకాహారిగా జీవించడం ప్రశ్నార్థకమవుతున్నది.అసలు ఇంత కష్ట పడి శకాహారిగా జీవించడం అవసరమా? అసలెందుకు శాకా హారిగా జీవించాలి? మాంసాహారం తింటే ఏమిటి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అలాగే మాంసాహారులు కూడా శాకాహారుల ప్రభావంతో ఆలోచనలో పడుతున్నారు. మాంసాహారులుగా ఉండడం మంచిదా? శాకాహారులుగా ఉండడం మంచిదా? అనే ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో రాకమానవు. మాంసాహారం మానలేక శాకాహారానికి రాలేక తాముచేసేది తప్పు అనే ఉద్దేశంలో సతమత మయ్యే వారూ ఉండవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో శాకాహారులకు, మాంసాహారులకు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అని. ఇదే విషయం నేనాలోచిస్తే ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచిస్తాను. రెండిటికీ తేడా ఏమిటీ? అనుకోకండి. చాలా తేడా ఉంది. మొదటి రకంగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ ధర్మాధర్మ విచక్షణ ద్వారా చాలా సులభంగా దొరుకుతుంది.

నాకో సందేహం ఈ శాకాహరం అనేది మనమే పాటిస్తున్నామా? మొదటి నుడీ శాకాహారాన్నే నియమంగా పెట్టుకుని ఉన్న శాఖలు/తెగలు ఇతర దేశాలలో ఏమైనా ఉన్నాయా?

ఇక మన విషయానికి వస్తే ఆహారం కోసం ఒక దానిపై మరికటి ఆధార పడడం ప్రకృతి ధర్మం. ఆహారం కోసం చెట్లపై ఆధారపడడం ఎంత సహజమో, జంతువులపై ఆధారపడడమూ అంతే సహజం. పూర్వ కాలంలో అందరూ మాంసాహారం తినేవారని పూరాణేతిహాసాల వలన తెలుస్తోంది. వశిష్టుడు మొదలైన వారికి శ్రాద్ధాది క్రతువులలో మధువు, మాంసాహారం ( మేక మాంసం ) పెట్టేవారు. సోమయాగంలో( ఆ సోమయాగం చేసినవారిని మత్రమే సోమయజి అనే వారు. ఇప్పుడు అందరూ అపేరు పెట్టుకుంటున్నారు. ) ఆ విధంగా చూస్తే మాంసాహారం తినడం అధర్మమేమీ కాదు.

అయితే మాంసాహరం తినవచ్చా? అంటే తినవచ్చు. మరి కొందరు ఎందుకు నిషద్ధం చేశారు?
ఇదే అందరూ ఆలొచించ వలసిన విషయం. మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అని ప్రశ్నించుకుంటే ఆ మాంసాహారాన్ని తినడం వలన రజో గుణం ఎక్కువ అవుతుంది. ( ఇదే కారణంతో కలియుగంలో బాహ్మలు, గురువులు మధుమాంసాలు తినరాదని శుక్రాచార్యుడు శపించాడు. ) శాకాహారం సాత్విక లక్షణాలు పెరుగుతాయి. ఈ రజోగుణం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత చేటు. సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి ఙ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.

అంటే మాంసం తినేవారికి ఈ సాత్విక గుణం లేదనా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. కానీ దాని పాళ్ల ( levels ) లో తేడా ఉంటుంది. అలాగే శాకాహారం తినే వారిలో పూర్తిగా సాత్విక గుణాలు ఉంటాయనుకోవడం కూడా అపోహే అవుతుంది. ఎందుకంటే వారు రజోగుణానికి ఇతర కారకాలైన మద్యము, గుట్కా, జరదా, గంజాయి, ఉల్లిపాయలు ఇంకా అనేకమైనవి సేవిస్తూ ఉండవచ్చు. కనుక ఈ రజోగుణం ఎక్కువగా కలగకుండా ఉండటం కోసం మాత్రమే ఇటువంటివి మానేయవలసిన అవసరం ఉంది.

బ్రాహ్మలు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండే వారు. నలుగురికీ ఙ్ఞాన మార్గం బోధించ వలెను కనుక వారికి ఇటువంటివి నిషేధించడమైనది. అందువలన వారు ఎక్కువ సాత్విక ప్రవృత్తి ( positive attitude ) కలిగి ఉండి ఙ్ఞానాన్వేషకులై జీవించేవారు. ఇప్పటికీ సాత్వికాహారం తినేవారు చాలా మంచి గుణాలు కలిగి ఉండడం మీరు గమనించ వచ్చు.

ఇది నా దృష్టి కోణం మాత్రమే. ఇంకా చాలా విషయాలు వ్యాఖ్యల రూపంలో వస్తాయి. అవన్నీ చదివి ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి. 

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

ఆత్మలతో మాట్లాడవచ్చు

ఆత్మలతో మాట్లాడవచ్చు.!



కొన్ని కంటితో చూసి నోటితో చదివినంత మాత్రాన అర్థం కావు. మనసుతో అనుభవించి చూడవలసినదే వాటి లోతు. కొన్ని సాధారణ విషయాలలోనే అసాధారణమైన రహస్యాలు దాగుంటాయి.

నాకు చిన్నప్పటి నుండీ ఓ విచిత్రమైన కోరిక ఉంది. గాలిలో ఎగరాలని. " రావణ బ్రహ్మ రోజూ తెల్లవారుతూనే ఆకాశమార్గాన వెళ్లి కోటి శివలింగాలకు అర్చన చేసి వచ్చే వాడని " ఓసారి ఎవరో నాకు చెప్పారు. అప్పటి నుండీ అనుకుంటా గాలిలో ఎగరాలని బలమైన కోరిక. ఎంత బలమైనది అంటే నిజంగా ఈ దేహంతో ఎగరడం సాధ్యం కాదు కనుక కనీసం కలలో నైనా ఎగరాలని నా సంకల్పమో ఏమో.. సరిగా గుర్తులేదు కానీ నాకు వచ్చే కలలో చాలా వరకూ నేను ఎగురుతున్న ఎరుక నాకు తెలిసేది. ఓ సారి అర్జునుడు పాశుపతాన్ని పొందే సందర్భంలో శివుడితో యుద్ధం చేసే కథను విన్నాను. కొన్నాళ్లకు నాకు ఓ కల వచ్చింది. ఎదురుగా ఎవరో ధనుర్బాణాలతో ఉన్నారు. నేను అవే ఆయుధాలతో ఉన్నాను. ఇద్దరం గాలిలో నేలకు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పెద్ధ యుద్ధం చేసుకున్నాం. అద్భుతమైన దివ్యాస్త్రాలు.

నాకోరికలు అలా కలలలో తీరుతున్నాయని అనుకునే వాడిని. ఒక్కటి మాత్రం నాకర్థమైంది. మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని. అలా నాకొచ్చే విచిత్రమైన కలలు మిగిల్చిన అనుభవాలు ఎప్పుడు తలుచుకున్నా చాలా బలం వచ్చి నట్లు అనిపించేది. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు.

కలలు గుర్తుంచుకో గలిగితే అందరూ ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆ కలలను గుర్తుంచుకోవడం ఎలాగ అని అడుగుతారేమో!? మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. రాత్రి పడుకునే ముందు నాకు వచ్చిన కలలను నేను గుర్తుంచుకోవాలి అని స్థిరంగా 4,5 సార్లు సంకల్పించుకుని పడుకోండి. క్రమ క్రమంగా మీ కలలు మెలకువ తరువాత కూడా గుర్తుకు వస్తుండడం మీరే గమనిస్తారు. అలా మీ సంకల్ప బలం, కోరిక, నమ్మకం వీటిని బట్టి మీకు గుర్తుండే శాతం ఉంటుంది.

ఇంతకీ కలలను గుర్తుంచుంకుంటే ఆత్మలతో ఎలా మాట్లాడవచ్చూ..!? అని అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నాను.

మీకెప్పుడైనా అద్భుతమైన,వింత ఐన కలలు వస్తాయా? మీకలలలో మీరు అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్నట్టు, మీతో దేవతలు- చనిపోయిన వారు - యోగులు మాట్లాడినట్లు, మీరు గాలిలో ఎగిరినట్లు, కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్టు, లేదా లోకాలన్నీ తిరిగినట్టు కనిపించిందా.!?

అయితే మీకు కలల ద్వారా ఏవో సందేశాలు వస్తున్నట్టు తెలుసుకోండి. అవును కలల ద్వారానే. కలల ద్వారా మీకు సాధ్యమవ్వని దంటూ ఏమీ లేదు. మీరు కలవలానుకున్న వారిని కలవ వచ్చు. ఎంత దూరంలో ఉన్నా, అసలు భూమిమీదే లేకున్నా,ఏడేడు పధ్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా. మీరు కలిసి వారితో పంచుకున్న అనుభవాలను నిద్రనుండి మేల్కొన్న తరువాత కూడా గుర్తుకు ఉంచుకోవచ్చు. కాక పోతే కొంత సాధన ద్వారా.

ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ రచయిత "శ్రీ శార్వరి" చెప్తున్న మాటలు ఇవి. ఈయన మాష్టర్ సి.వి.వి. ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై, తద్వారా ధ్యానం,యోగం,ఆత్మ యాత్రలు ( astral travel ) మొదలైన అనేక విషయాలగురించి అనేక భాషలలో పలువురు రాసిన రచనలను చదువుతూ,సాధన చేయడం మొదలు పెట్టారు. అలాగే వీటి గురించి తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో నేను ఈ మధ్య అనుకోకుండా " పరావిద్య " అనే పుస్తకం కొనిచదివాను. నేను ఇంతకు పూర్వం వీరి రచనలు ఎప్పుడూ చదవలేదు. నాకు వారి గురించి పెద్దగా తెలియదు. కానీ పుస్తకం కొద్దిగా చదివితే ఏదో ఆసక్తిగా అనిపించి కొన్నాను. ఇంటికి వచ్చి తెరచి చదివితే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా ఆసక్తికి సరిగ్గా తగిన పుస్తకం అనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలకు కొన్ని కొత్త పార్శ్వాలు కనిపించాయి. నా ఆధ్యాత్మిక సాధనకు కొన్ని కొత్త దారులు కూడా గోచరించాయి. పుస్తకం తెరచిన దగ్గరనుండీ పూర్తయ్యే వరకు ఆపకుండా దాదాపు ఏకబిగిన చదివాను.


మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలున్నాయి. ఈధర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావశరీరం,ప్రాణ శరీరం, ఆత్మ శరీరం ఇలా కంటికి కనిపించని అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు. మనసుతోదర్శించాలి.

" కనిపించడం అన్నది కంటికి పరిమితం. కనిపించని దానిని దర్శించడం మనస్సు పరిధి లోనిది. అలా దర్శింప చేసే సామర్ధ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే."

" ఇవ్వాళ మనం టన్నుల కొద్దీ విఙ్ఞానం,నాగరికత ఉందని సంబరపడి పోతున్నాంగానీ, ఇంతకు వేయిరెట్లు 'వివిఙ్ఞానం' ఆ (పూర్వం)రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మనవాళ్లు హాయిగా పరలోకాలకు విహార యాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. "

" ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే అక్కడి చారిత్రక అవశేషాల్ని గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్లు,ప్పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విఙ్ఞానం, ఆత్మల అవగాహన నేటికీ ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్యదూరాలు ఎలా కొలవగలిగారు. ఎవరూ భౌతిక శరీరాలతో వెళ్లి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా! వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింక్ చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరచి, అశరీరులుగా విశ్వసంచారం చేయడం వారికి తెలుసు."

" ఏదేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏజాతి చరిత్రలోకి తొంగిచూసినా ఆకాలం వారికి 'అశరీర పరిఙ్ఞానం' పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కధలు, ఇతిహాసాలు, లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు,ఋషులు యధేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్స్ వేస్తుండే వారు. అక్కడిదేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి, సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశమార్గాన హిమాలయాల పైకి వెళ్లేవారు. నదులు,సముద్రాలు అలవోకగా దాటి వెళ్లే వారు. ఇంద్రసభకు వెళ్లడం,నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడడం,ముచ్చటతీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది. " అంటారు మాష్టర్ శ్రీశార్వరి.

అయితే ఈపుస్తకం చదవక మునుపు కూడా నాకు ఇవన్నీ ఉన్నాయని, ఇంకా నేటికీ అనేకులు ఈ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తున్నారనీ తెలుసు. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదనే అభిప్రాయం ఉండేది. ఎంతో యోగ సాధన చేస్తే గానీ ఈ సూక్ష్మశరీర ప్రయాణం అనేది అనుభవంలోకి రాదని అనిపించేది. రోజూ ఉద్యోగాలు చేసుకునే వారికీ, సంసార బంధంలో ఉన్న వారికీ కొంత కష్ట తరమైన సాధన అనుకునేవాడిని. కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా తప్పని తేలింది. మనసుంటే మార్గముంటుందని మరోసారి ఋజువైంది. మాష్టర్ శ్రీశార్వరి గారు ఎంతో కష్ట తరమైన అనుభవాన్ని చాలా తేలికగా తన రచన ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా ఇది ఇంత సులువైన సాధనా అనిపిస్తుంది.

వారు చెప్పిన సాధన ఏమిటంటే రోజూ ప్రశాంతంగా నిద్ర పోవడమె.. చక్కటి కలలు కనడమే.. ఆ కలలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసుకుని భద్రపరచుకోవడమే... ఇంతే మీరు చేయవలసింది. దీని వలన మీరు పొందేది ఏమిటో తెలుసా..!? మీరు ఎవరిని కావాలనుకుంటే వారిని కలవగలరు. భవిష్యత్తులో జరిగే వాటిని తెలుసుకో గలరు. ఎంత దూరమైనా సూక్ష్మశరీరంతో సునాయాసంగా ప్రయాణించగలరు.

రోజూ రాత్రిపూట కలలు వస్తాయి కదా. కలలకు తలా తోకా లేదు అనుకుంటాం మనం. అప్పటిదాకా చెట్టుక్రింద ఉన్న మనం ఉన్నట్టుండి ఏ ఇంట్లోనో టీవీ చూస్తున్నట్టు, ఓ కోతిగానో, దేముడిగానో, రాక్షసుడిగానో మారినట్టు అర్థం పర్థం లేని కలలు వస్తున్నాయి అని అందరూ అనుకోవడం సహజం. కానీ వీటికి అర్థం ఉంది అని మరోసారి నిరూపిస్తుంది "పరావిద్య" పుస్తకం.

" మనకు మంచి కలలు వస్తే అవి ఇంకాఇంకా సాగాలని కోరుకుంటాం. అయ్యో అనవసరంగా మెలకువ వచ్చిందే ఇంకొంత సేపు మెలకువ రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అలాగే చెడు కలవస్తే భయంతో ఒణికి పోతాం. కానీ రెండూ మనకు సంకేతాలే. అవి చెరుపు చెయ్యవు. ఓ దెయ్యమో,ఆత్మో మిమ్మల్ని వెంటాడినట్టో, ఓ గొప్ప సౌందర్యవతి కనిపించి కవ్వింనట్టో వస్తే అవి రెండూ మీ మనసులోని కోపతాపాలను, వ్యామోహాన్నీ తెలుపుతున్నట్టు గుర్తు. ఏ స్త్రీ వ్యామోహమూ మీకు లేదనుకోండీ.. ఏ అప్సరసా మీ కలల్లోకి రాదు, అలాగే మీ మనసులో కోపతాపాలు, ఏ మలినమూ లేకపోతే రాక్షసులు రారు. మనలో దాగిన వికృత భావాలకూ, అణచుకున్న ఉద్రేకాలకూ ఆ కలలు రూపాంతరాలు. మన గుణాలకు రూప కల్పనలే స్వప్నంలో కనిపిస్తాయి. ఏ కలా ఊరికే రాదు. వాటికో అర్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఓ సంకేతం ఉంటుంది. అందించ వలసిన సందేశం ఉంటుంది. ఎటువంటి కలలైనా సరే అవి మనకు చెడుపు చేయవు. ఇలలో మనకు సహాయపడేవే అయి ఉంటాయి. మన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కావచ్చు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. స్వప్నాలను విశ్లేషించడం ఒక కళ. కలలే గొప్ప పరిశోధనలకు ఆలంబనాలు. మహాజటిలమైన సమస్యలకు పరిష్కారాలు కలల్లోనే లభించాయి. మహర్షులు కలల ద్వారానే గొప్ప సత్యాలను ఆవిష్కరించారు. ఈ స్వప్న సందేశాలను ఆధారం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఒక్కో కల మీజీవితాన్నే మార్చేయ గలదు. ప్రఙ్ఞతో అశరీర సంచారం చేయగల యోగి విశ్వరహస్యాలు సత్యాలు ఆవిష్కరిస్తాడు. "

ఎంత చెప్పినా ఇది తరిగేది కాదు కానీ, నేను అసలు ఏమి చేయాలో చెప్తాను. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది. రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఓ ఐదునిమిషాలు మనసును ప్రశాంత పరచాలి. ముందుగా గురువులను ప్రార్థించాలి. మన చుట్టూ మనకంటికి కనిపించని గురువుల ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన సూక్ష్మ శరీర ప్రయాణంలో వారి సహాయాన్ని అర్థించాలి. మనసులో మీరు చూడాలనుకున్న ప్రదేశమో, కలవాలనుకున్న వ్యక్తినో సంకల్పించుకోవాలి. ( ఫలానా ప్రదేశానికి నేను వెళ్లాలి. అక్కడ నాకు ఎదురైన అనుభూతులను పదిలంగా భద్రపరచుకోవాలి. మెలకువ తరువాతకూడా అవి నాకు గుర్తుండాలి. ఇలా మనసులో గట్టి విశ్వాసంతో సంకల్పించు కోవాలి. ) మీకు ఈ ప్రక్రియమీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగే అనుభూతుల లోతు ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు కలల గుర్తుండక పోయినా త్వరలోనే అవి స్ఫురణకు రావడం, వాటి తాలూకా అనుభవాలు నిజ జీవితంలో ఎదురవడం మీరు చూచాయగా గమనించడం మొదలు పెడతారు.

అలా సంకల్పించుకుని మూసుకున్న కను గుడ్లను గుండ్రంగా త్రిప్పుతూ ఉండాలి. అందువలన త్వరగా నిద్ర వస్తుంది. మీ మనస్సును సూక్ష్మ శరీర ప్రయాణానికి సన్నద్ధం చేసుకోవాలి. మీరు క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. మీరు నిద్ర పోయారు అంటే మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి విడి వడింది అని అర్థం. అలా భౌతిక శరీరం నుండి విడి వడినా భౌతిక శరీరానికీ - సూక్ష్మ శరీరానికీ ఒక దారం వంటి లింక్ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆబంధం తెగిపోతుంది. నిద్రించి నప్పుడు ఎంత దూరం వెళ్లినా అది ఉంటుంది. కొందరు గొప్పగొప్ప వారికి ఆ దారం వంటి బంధం కలలలో దర్శించిన అనుభవాలు ఎదురయ్యాయి. అలా ప్రయాణానికి సిద్ధమైన సూక్ష్మ శరీరానికి ఒక స్నేహ హస్తం అందుతుంది. వారి మార్గదర్శకంలో మీరు కోరుకున్న చోటికి వెళ్తారు. వారే మీ ఆధ్యాత్మిక గురువులు.

కొన్ని సూచనలు : నేలమీద చాప వేసుకుని నిద్రించడం మంచిది. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. నిద్రించే గదిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. కొద్దిగా తగుమాత్రంగా వెలుతురు ఉండవచ్చు. గుండెల మీద చేతులు వేయకూడదు. అలా వేస్తే మన సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటకు వెళ్లడం కష్టం అవుతుంది. చేతులను కూడా వెల్లకిలా చాపి ఉంచాలి. శరీరం నుండి ఆత్మ విడివడడమేమిటి? మన ఆత్మ ప్రయాణం చేయడమేమిటి? అని కొందరికి వింత గొలపవచ్చు. మరికొందరికి కాస్త భయం కూడా వేయ వచ్చు. కానీ కంగారు పడనవసరం లేదు. ఈ విషయం మీకు తెలిసి నిద్రించినా, తెలియక నిద్రించినా ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు రావడం అనేది ఖాయం. అలా ప్రయాణించినపుడు కలిగే అనుభవాలే కలలుగా మనకు కొంత గుర్తులో ఉంటాయి. వాటిని మరింత గుర్తుంచుకోవడానికీ, అలాగే మనకు అర్థం పర్థం లేకుండా వచ్చే కలలను ఒక క్రమ బద్ధంగా మన కోరిక ప్రకారం వచ్చేటట్లు మలచుకోవడానికీ మనమీ సాధన చేస్తున్నాము. అలాగే మనకు గురువులైన ఆత్మలు ఆ సూక్ష్మ లోకాలలో ఎదురు చూస్తూ ఉంటాయి. వారే స్వయంగా మనల్ని శిష్యులుగా ఎంచుకుంటారు. మన పుట్టుక తోనే ఆ ఎన్నిక అయిపోతుంది. కానీ ఆ విషయాలు మనకు తెలియవు. వారు అడుగడుగునా ఈ ప్రయాణంలో మనకు తోడ్పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మీరు నిద్రలో మీకాలో చెయ్యో అసంకల్పితంగా అంతెత్తున లేపి దబ్బున క్రిందపడేస్తారు. ఉలిక్కి పడి, శరీరం ఎగిరి పడుతుంది. ఈ సాధన చేసే వారికైనా, చేయని వారికైనా ఇది సహజంగా అప్పుడప్పుడూ జరిగే విషయమే. అంటే మీ సూక్ష్మ శరీరం బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఇబ్బంది రావడం వలన అలా జరుగుతోంది. మీరు సరిగ్గా వెల్లకిలా పడుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కో సారి మీరు నిద్రలో ఉండగానే మీ చెయ్యో కాలో కదపాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎంత కదిపినా అవి కదలవు. అలా ఎందుకవుతుందంటే బయట తిరిగే ఆత్మలేవో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఆత్మలకు అలా చేయడం సరదా. అందుకు మీరు భయపడనవసరం లేదు. అవి అంతకన్నా ఏమీ చేయలేవు. మీకు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (సూక్ష్మ శరీర ప్రయాణం) లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మీ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి భౌతిక శరీరంలో చేరిపోతుంది. మీకు వెంటనే మెలకువ వస్తుంది. కనుక భయం అవసరంలేదు. ఎటువంటి భయాలు లేకుండా ఈ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ సాధన సక్రమంగా సాగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు గురువులు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో 99.99...% ఏటువంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. ఇది సహజమైన ప్రక్రియే. కాకపోతే కాస్త ఎరుకతో చేయలనుకునే ప్రయత్నం. మీకు గల నమ్మకం, ఉత్సాహం ఈ ప్రయాణంలో అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. మీరు మీ వంశీకులను, దేవతలను, మీ ఇష్టులను కలవవచ్చు - స్వర్గం, హిమాలయాలు, పవిత్ర ప్రదేశాలు, ఏడేడు పధ్నాలుగు లోకాలు, బ్రహ్మాండాలు వేటినైనా దర్శించ వచ్చు. ముఖ్యంగా ఎటువంటి వారికైనా చావు అంటే భయం పోతుంది. రోజూ వెళ్లి వచ్చే ప్రయాణమే, కాకపోతే కాస్త దీర్ఘ ప్రయాణం అన్న ధీమాతో ఉంటారు. మన కంటికి కనిపించేది కాక వేరే లోకాలు ఉన్నాయని, అవి ఈ లోకాల కంటే అందమైనవి, సుఖవంతమైనవి, అమిత ఆనందాన్నిచ్చేవి అని తెలియడం వల్ల - నసించేది నేను కాదు, నా శరీరం, ఇది లేక పోయినా నేను మరింత ఆనందంగా ఉండగలను అని అర్థమవ్వడం వల్ల సులభంగా మరణాన్ని సమ్మతించ గలుగుతారు.

నాకు చిన్నప్పటి నుండీ ఓ సందేహం ఉండేది. "యోగము ద్వారా చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవడం అనేది అందరికీ సాధ్యమేనా? " అని. దానికి చిన్నప్పటి నుండీ యోగ సాధన బాగా చేస్తే అది సాధ్యమే అని తెలుసు. కానీ దానికి ఇంత సులువైన ప్రారంభముంటుందని మాత్రం ఈ పుస్తకం చదివిన తరువాత తెలిసింది. విద్వత్తు ఎవరి వద్దనైనా ఉంటుంది. దానిని నలుగురి మంచి కోసం వినియోగించగల ప్రఙ్ఞ కొందరికి మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రఙ్ఞతో రాసిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ చదవవలసినది. శ్రీ శార్వరి గారు నేటికీ మాష్టర్ గా అనేకులకి ఈ యోగ విద్యను నేర్పుతున్నారు. పూజాదికాలు అవసరం లేదని వీరి అభిమతం. మాష్టర్ సి.వి.వి. గారికి మరో అనుయాయులు ఎక్కిరాల క్రిష్ణమాచార్య గారు. వీరు సాంప్రదాయాలను, పూజాదికాలను ప్రోత్సహిస్తూనే తద్వారా యోగ జీవితానికి బాటను చూపారు. ఎవరి మార్గం వారిది అయినా చేరే గమ్యం ఒక్కటే.

నిద్రపోవడం ఎవరికి మాత్రం కష్టం చెప్పండి. అందుకే ఇది సులవైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు. పైగా కలిగే ఫలితం అమేఘం, అద్భుతం. సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశం, కంటికి కనిపించని దివ్యలోక సందర్శనం మొదలైన వాటిగురించి తెలుస్తుంది. మనం సాధించవలసినది ఏమిటో ఎఱుకలోకి వస్తుంది. వీటితోనే ఆనందపడిపోయి ఇదే సర్వమనుకుని అక్కడే నిలచే వారూ ఉన్నారు. కలిగిన ఎఱుక ద్వారా మరింత ముందుకు వెళ్లవలసి ఉన్నదని గుర్తెరిగి మరింత సాధన చేసే వారున్నారు. ఇదే పరమావధి కాదు అని స్ఫురణలో ఉంచుకోవాలి మనం. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి ఆత్మ స్వయంగా ప్రకాశించ గలగడం మన లక్ష్యం. అది అందరికీ సాధ్యపడదు. సత్యలోక దర్శనం కోసం ఎంతో యోగ సాధన చేయాలి. మనం నిద్రపోయి ఏమీ తెలియని స్థితిలో దర్శించే ఈ లోకాలన్నీ ధ్యానముద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు అంతర్ముఖులమై శరీరాన్ని విడచి ప్రయాణించ గల శక్తిని సముపార్జించడానికి ఈ అనుభవం ఎంతో ప్రేరణనిస్తుంది.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ

పూజ అంటే ఏమిటి? పూజను ఎందుకు చేయాలి?

పూజ అంటే ఏమిటి? పూజను ఎందుకు చేయాలి?


భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా లేదా `అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి... ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు. ఈ 16 రకాల సేవలనూ పూజావిధానం అనే టపాలో విపులంగా వివరిస్తాను.


అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి




ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి జాబితాను jpg రూపంలో పొందుపరచాను. ఆ చిత్రం పై క్లిక్ చేస్తే పెద్ద చిత్రం కనిపిస్తుంది. లేదా save చేసుకొని చూడండి.




సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )


ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )


పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

చివరగా: మీరు భాగ్యనగరంలో ఉండి శ్రద్ధతో వ్రతం చేసుకోవాలనుకుంటుంటే ఒక్కసారి నన్ను పిలవండి. నేను తప్పక రాడానికి ప్రయత్నిస్తాను. చక్కగా వ్రతంచేసుకుందాం. మిగతా పూజలన్నిటికన్నా ఈ వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో వ్రతం అనగానే ఖాళీ చేసుకుని మరీ వెళ్తుంటాను. :)
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

గోవులను కష్టపెట్టే పూజలు ఆపండి

పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసిగానీ మొదలు పెట్టేవారు కాదు. నేడు ప్రతీ పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజలలో మనం  కూడా గోపూజ చేస్తున్నాం. కానీ నాటికీ నేటికీ గోపూజలో హస్తిమశకాంతరం ఉంది. పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు. ప్రతీ వారికీ గోవులు ఉండేవి. ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది.నేడు మనలో నూటికి తొంభైతొమ్మిది మందికి గోవులు లేవు. మనకు ఆ పూజ ఆచారమూ పోయింది. సరే అంతవరకూ బాగానే ఉంది.


 గృహప్రవేశాలప్పుడు ఇంటిలోనికి ముందుగా తాముపెంచుకునే గోవుని పంపి తాము ప్రవేశించడం ఆచారంగాఉండేది. నేటికీ ఆ ఆచారం ఉంది. కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు. ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం. ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం. పూర్వం ఇళ్లన్నీ మట్టి నేలలతో ఉండేవి. ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు. చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి. ఆ నేలమీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం. అలాంటిది అలవాటు లేని ఆవూ,దూడలను మెట్లు ఎక్కించి, ఆ ఇంట్లో కాళ్లు జారుతూన్నా ఇల్లంతా తిప్పించి, భజంత్రీలు, బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడ వేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా!?

 దానికంటే చక్కగా ఓ వెండి గోవును పళ్లెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి. గోవు చాలా పవిత్రమైనది. దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలూ పెడుతున్నాం. ఇదంతా తెలిసి చేస్తున్నాం అనికాదు. ఎవరూ ఆలోచించడం లేదు అంటున్నాను. గోవు బాధ పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడివాతావరణం సహజంగా ఉండాలి. కొత్త వాతావరణంలో కొత్తవారిని చూస్తే అవి బెదురుతాయి. పైగా భజంత్రీలు, బంధువులు ఉంటారు. ఇంత మందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి. ఇక ఆ గ్రానైట్ నేలమీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి. కొంతమంది అపార్ట్ మెంట్లు కూడా ఎక్కించేస్తున్నారు. దయచేసి ఆపని చేయకండి. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవలసి వస్తుంది. ఒక వేళ పెద్దలు, పురోహితులు ఎవరైనా అదేంటి గోవులేకుండా ఎలా ? అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి. నాకు తెలిసి పురోహితులు చాలా మందికి ఈ స్పృహ ఇప్పటికే కలిగింది. యజమానులు కూడా అర్థం చేసుకో గలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది.

 ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు. గృహప్రవేశమప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి. కానీ ఇల్లంతా తిప్పే పని మాత్రం మానండి. చక్కగా గోవును పూజించండి. ఈ పూజా క్రమంలో కూడా ఆ గోవు ఒళ్లంతా పసుపు,కుంకుమ చల్లకుండా పాదాలకు, నుదుటివద్ద, తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి. మనం కూడా పసుపు మంచిదని ఒళ్లంతా చల్లుకోం కదా!? పాదాలకు రాసుకుంటారు. అలాగే ఆవుకు కూడా.

ఇక ఆవుకు బిడ్డపుట్టేటప్పుడు ప్రదక్షణాలు కూడా దానిని భయపెట్టేవిధంగా ఉంటున్నాయి. కాస్త ఆవిషయంలో కూడా ఆలోచించండి. ఈ మధ్య మరీ మూర్ఖంగా ఆవుకు ఆరుపాదాలు ఉన్నాయి అంటూ వాటిని ఇల్లిల్లూ తిప్పి దానిపేరుతో డబ్బులు దండుకునే వారు తయారయ్యారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. చేతనైతే నాలుగు చివాట్లు పెట్టండి. ఆ ఆవులను పూజ పెరుతో ఒక చిన్న లారీ లాంటి దానిలో పెట్టుకుని తిప్పడం ఎక్కడో చూశాను. రెండు చేతులున్న మనకే లారీలో నుంచుని ప్రయాణించడం కష్టమైన పని. ఆ లారీ దూకుడుకు నుంచోలేక క్రింద కూర్చుంటాం. అలాంటిది చేతులు లేని ఆవులకు ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. దాని ప్రాణం ఎంత హడలిపోయి ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. అలా వాహనాలలొ తిప్పి డబ్బులడిగే వారిని తప్పకుండా ఖండించాలి. కావాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని బెదిరించాలి.

ఆవుకు ఆరు కాళ్లు ఉంటే చాలా మంచిదని, దానికి పూజించడం చాలా విషేషమని మన నమ్మకం. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానివెనుక కారణాలు ఆలోచించాలి మనం. నోరులేని, మనకంటే నిమ్న స్థాయిలోని ప్రతీ జీవినీ మనం దాదాపుగా పూజిస్తాం. ఆఖరికి కుక్కను కూడా కాల భైరవుడంటూ పూజిస్తాం. అలా ఎందుకంటే వాటికి రక్షణ కల్పించాలని. వాటికి కూడా జీవించే హక్కును కల్పించాలని. మనం భక్తి పేరుతో నైనా వాటిని రక్షిస్తామని. గోవు ఎవరికీ హాని చెయ్యని సాధుజంతువు. పైగా అది తినేది గడ్డి, ఇచ్చేది తియ్యటి పాలు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు మూత్రం, పేడ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ ఈ ఐదింటిని గో పంచకము అంటారు. విషేష పూజలలో వీటిని పూజించి సేవించడం నేటికీ ఉంది. అటువంటి ఆవును రక్షించాలని దానికి పూజలలో ప్రథమ స్థానం ఇచ్చారు. ఏదైనా ప్రయోజనం ఉన్నంత సేపే మనం దానిని రక్షిస్తాం. మన స్వార్థ గుణంతో ఏ ఉపయోగం లేదని, అంగవైకల్యంతో జన్మించిన ఆవులను సంరక్షించడం కష్టమని వాటిని ఎక్కడ వదిలేస్తామో అన్న చింతనతో అటువంటి వాటిని విషేషంగా పూజించాలన్న నియమం పెట్టి ఉండవచ్చు. అలాంటిది వాటిని పూజపేరుతో ఊరూరూ తిప్పుతూ మరింత బాధ పెట్టడం చాలావిచారకరం. అందరూ ఈ విధానాలను ఖండించాలి.

 గోవులను బాధపెట్టకుండా పూజించే వీలులేకపోతే ఆ పూజలు మానండి. నష్టమేమీ లేదు. వాటిని తెలిసికానీ తెలియక కానీ ఏవిధంగానూ బాధ పెట్టడం మంచిదికాదు.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

మంత్ర జప సాధన లో తలెత్తే కొన్ని సందేహాలు - సమాధానాలు

     ఒక్కొక్క సారి గాయత్రీ జపము లో కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేసుకోవడం కుదురుట లేదు. మనస్స్సు కుదురు గా ఉంచాలంటే ఏమి చేయాలి? ఈ ధ్యానములో, గాయత్రీ మాతను ఊహ చేసుకొని జపం చేయ వచ్చా? లేక ఇతర దేవత లేదా గురు స్వరూపములను ఊహ చేయవచ్చా? ఇది కూడా మనసు ఎక్కువ సేపు నిలబడదు. కొంత సేపు ఒక దేవత, తరువాత కొంత సేపు ఇంకొక దేవత లేదా గురు స్వరూపము  తో జపము చేయవచ్చా? అసలు గాయత్రీ మంత్రం ఎలా చేయాలి? 

  మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "   పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది  మంత్రము అన్నారు.  గాయత్రీ లేదా మరో దేవతా  జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. వీటిగురించి మరో టపాలో తెలియజేస్తాను. ) ప్రస్థుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.

౧) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం.   ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో  ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు.  ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సంతలు  చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం  బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా  కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు  రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ  మెట్టుకి వెళ్లాలి. 

౨) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి .   ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.

౩) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం.  పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి. ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా  మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.

అ) మరో ఆలోచనలో పడడంఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. ( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి )  ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.

ఆ) మనసు తొందర పడడం :    నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు  లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం".  అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.

పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి  త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.

౪) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి.  కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది.  ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి. అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి.  వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు. వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.

మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.

పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.

౧) మొదట గురువు వద్ద  మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.

౨) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి.  క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.

౩) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత  స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.

ఇంకనూ అనేక విషయాలు ఉన్నవి. కానీ కొన్ని మాత్రమే తెలపగలం. కొన్ని ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. 

సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

మీరూ పురోహితులుగా మారండి

   హిందూ మతం లోని ఆనందం, ఔన్నత్యం మీకు పూర్తగా తెలియాలంటే మీరు పురోహితులుగా మారాలి. ఏకులం వారైనా ఏమతం వారైనా ఈ పురోహితం చేయవచ్చు. నేను ఓ పురోహితుడిని కనుక ఆ ఆనందమేమిటో దానిరుచేమిటో ఎరిగిన వాడిని కనుక ఆ ఆనందం మీకూ పంచుదామని ఈ ప్రయత్నం. పురోహితులుగా మారాలంటే దానికి ప్రత్యేకమైన యోగ్యతలేవో కావాలి,  మనకి పొద్దున  లేచింది మొదలు ఉద్యోగం చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదు, మళ్లీ ఈ పురోహితం ఎక్కడ వెలగబెట్టగలం, ఇది మనకి కుదరదు అనుకొంటున్నారేమో! అలా అనేముందు దీనిని ప్రయత్నించి అప్పుడు ఆ మాట చెప్పండి. నేనూ ఒప్పుకుంటాను. కనీస ప్రయత్నం లేకుండా ఓ మంచి ఆలోచనని కాదనకండి.  పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది

౧. పురోహితులుగా ఏమి చేయాలి?

 ఏముంది సమాజ హితం.

౨. దానికి నేనెటువంటి గుణాలు కలిగి ఉండాలి?

 కాస్త సాధన -పూర్తి స్థాయి నిజాయతీ- కాస్త సాటిమనిషి పట్ల , సమాజం పట్ల ప్రేమ - తెలియనిది తెలుసుకోవాలనే తపన ఇవి ఉంటే మీరు పురోహితులుగా రాణించేస్తారు.

౩. అంటే ఇవి లేక పోతే పనికి రామా?

ఎందుకు పనికి రారు పనికొస్తారు. మీకు కనక శ్రద్ధ - తప్పును ఒప్పుకుని మార్పును స్వీకరించే గుణం  ఉంటే పై విషయాలు అలవరచుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. పైగా మనలో చాలా మందికి నా సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన చాలా ఉంది. కాకపోతే అది ఎలా చేయాలో తెలియదు.

౪. సరే అయితే ఇప్పుడు మేము కూడా పంచ,కండువా కట్టుకుని పూజలూ అవీ చేస్తూ ఉద్యోగాలు మానేసి మీకూడా తిరగాలా ఏమిటి?

అబ్బే అవేవీ అవసరం లేదు. మీమీ ఉద్యోగాలు  నిరభ్యంతరంగా చేస్తూనే పురోహితమూ చేయవచ్చు. పైగా దీనికోసం మీకు ఇష్టంలేకుండా ఏత్యాగమూ చేయనవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఎవరికి మీరు పురోహితంద్వారా మేలు చేయాలనుకుంటున్నారో వారిని వెతుక్కోవడం, పురోహితం ప్రారంభిచడం.  పురోహితుడవ్వాలంటే బ్రాహ్మణుడు మాత్రమే అవ్వాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఆసక్తి ఉన్న ఎవరైనా అవ్వొచ్చు. నిజానికి ఇప్పటికే చాలామంది తమకు తెలియకుండానే పురోహితం చేస్తున్నారు.

౫. అర్థకాలేదు. పూర్తిగా వివరంగా చెప్పండి.

 అదీ అలాఅడిగారుకనుక చెప్తున్నాను. :)

మనం ముందర పురోహితులుగా అవడానికి మానసికంగా సిద్ధపడాలి అంటే ముందు పురోహితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నాదృష్టిలో "ఆధ్యాత్మిక లేమితో బాధపడేవారి హృదయాలను ఆధ్యాత్మికతతో నింపడమే పురోహితం"    అంటే ఓ డాక్టరు వ్యాధిగ్రస్థునికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చినట్లు, మనమూ సమస్యలో ఉన్నవారికి ఆసమస్యకు మూలకారణం వివరించి ఆనందం రుచి చూపిస్తూ, తోటి వ్యక్తులను తద్వారా సమాజాన్ని ఆనందం వైపు నడిపించడమే పురోహితం అంటే.

ఇక మనం పురోహితులము అవ్వాలంటే మనకు కావలసిన అర్హత ఙ్ఞానం. వ్యాధికి సంబంధించిన సంపూర్ణ అవగాహన. వ్యాధి ఏమిటి?  ఆధ్యాత్మిక లేమి ఏ మానసిక సమస్యకైనా మూలకారణం ఇదే అనిగుర్తుంచుకోవాలి . ( అనేక భౌతిక విషయాలలో కూడా ఆధ్యాత్మిక సాధన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ) మరి దాని చికిత్స ఏమిటి? ఆధ్యాత్మిక సాధన. చికిత్స ద్వారా మనం వారికి అందించ గలిగినది ఏమిటి? ఆనంద జీవనం.

మన ఋషులు భారతీయ జీవన విధానాన్ని రూపొందించడంలో ఎంతో తపన చెందారు. ఆనందం ఎక్కడనుండి వస్తోంది? దానిని పరిపూర్ణంగా పొందడం ఎలా? కష్ట సుఖాలకు అతీతంగా నిశ్చల ఆనంద స్థితి ఏవిధంగా పొందగలం? మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వారి తపస్సు ద్వారా పొందారు. దానిని భవిష్యతరాలకు అందించడానికి తపించారు. వారి ప్రేమను తలచినప్పుడల్లా నాకళ్లు చమరుస్తాయి. భారతీయ జీవన విధానం వారు మనకు పెట్టిన భిక్ష. అది ఆనందం అనే పరమావధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించ బడింది. కానీ నేడు ధనం పరమావధి అని ప్రాకులాడడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి. మన పూర్వులకు ఎంత ప్రేమ ఉంటే నేటికీ మనం భారతీయ జీవన విధనాన్ని కళ్లారా చూడగలుగుతున్నాం!?  ఈ విధానం నలుగురూ అమలుపరచేలా చేయడంలో ఎంత తపించి ఉంటారు!? మన మీద ఎంత ప్రేమ ఉంది వారి హృదయాలలో!?   అదే మనకు స్ఫూర్తి కావాలి. మనకున్న బలహీనతలను తొలగించడంలో వేయింతల బలాన్ని ఇవ్వాలి. ఋషులు మనకు ఒక జీవన విధానాన్ని ప్రసాదించారు. దానికి ప్రాతి పదికగా వేదాన్ని వారసత్వంగా ఇచ్చారు. ఆ ఋషుల స్ఫూర్తితో తన ప్రతి చర్యలోనూ ప్రేమను నింపుకుని తాను తరిస్తూ చుట్టూ ఉన్న నలుగురినీ తరింప చేసేవాడే పురోహితుడు. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఙ్ఞానాన్ని, ఎంతో కొంత అఙ్ఞానాన్నీ కలిగి ఉంటారు. ఎవరూ పరిపూర్ణులు కారు. కానీ తమఙ్ఞానాన్ని నలుగురికీ పంచాలనుకునేవారు క్రమక్రమంగా కొత్త విషయాలను తెలుసుకుంటూ పరిపూర్ణ ఙ్ఞానం ( ఆనందం ) వైపు పయనిస్తారు. ముందు మనకుతెలిసినదెంతో మనం ఇంకా సాధించ వలసినదేమిటో విచారణ చేసుకోవాలి. ఆ తరువాత మనకు తెలిసిన పరిధిలో సాటివారికి తగు సహాయమందించాలి. అలా సాయమందించడంలో మననూ అనేక తెలియని విషయాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. వాటికి "సద్గ్రంధ పఠనం-సజ్జన సాంగత్యం- స్వీయ సాధన" మొదలైన వాటి ద్వారా సమాధానాలను రాబట్టుకోవచ్చు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలకు కారణం చాలావరకు ఆధ్యాత్మిక లేమి. ఆధ్యాత్మిక సాధన ఉన్నట్లైతే మనం, మన సమాజం నేడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అసలు సమస్యలే కావు. కనక ఆదిశగా మనం పయనిస్తూ తోటివారిని పయనింప చేసే ప్రయత్నమే పురోహితం అంటే. మీకు కష్టంలో ఎవరైనా కనపడితే చూస్తూ ఊరుకోకండి. దానికి తగిన తరుణోపాయం ఆధ్యాత్మిక సాధన అన్న విషయాన్ని వారికి నచ్చే, వారు మెచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ తపన, తోటి వారిపై గల ప్రేమ, మీకు భగవంతుడి పై గల నమ్మకం, మీ ప్రార్థనలో కల ఆర్తి, గురువుల ఆశీస్సులు మీకు దారి చూపుతాయి. ఇంకా  ఈ విషయంలో  సాధకులైన తోటి మిత్రుల సహకారాన్ని పొందండి. మీకవసరమనుకుంటే నా పూర్తి సహకారాన్ని నేనందిస్తాను.


ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 


వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం!

రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.

ఆదివారవ్రతం: చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం: ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

సోమవార వ్రతం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.

మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.

బుధవారవ్రతం: స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

గురువారవ్రతం: మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.

శుక్రవార వ్రతం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం

లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

శనివారవ్రతం: వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.

ఏ పూజ, వ్రతం చేసేటప్పుడయినా ఫలితం కోసం గాక శ్రద్ధాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మ చర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా ఉండాలి.

సంధ్యావందనం

సంధ్యావందనం

ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. సంధ్యావందనము కర్మలో సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, మరియు గాయత్రీ జపం కొన్ని అంశాలు.
సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము రాత్రి యెక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము. సూర్యోదయమము అయిన తరువాత 8 నుంచి 12 ఘడియలు మధ్య చేసిన మధ్యమము. సూర్యోదయమైన 19 నుంచి 24 ఘడియలు మధ్య చేయుట అధమము. సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండ చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. సంధ్యా వందనము పురుడు, మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనిచో మానసికముగా సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేవలెను.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

ఉపనయనము

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.

ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.

ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు. 

ఉపనయన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు మరియు వైశ్యులకు వేరు వేరుగా ఉంటాయి.

బ్రాహ్మణులకు 5 సంవత్సరాలవయసులో ఉపనయనం చేసినట్లు అయితే "బ్రహ్మ వర్చస కామం పంచమ వర్షే" అథవా గర్బాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి. గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి, తరువాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కానీ, సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు. ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం.

అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి. ముర్వ కసవుతో చేసిన మొలత్రాడును అది లభించని పక్షంలో నీటితో తడిపిన రెల్లుని మూడు ముడులు వేసి ధరించాలి. జనపనారతో చేసిన తొమ్మిది వరసలుగల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతానికి జంద్యం అనే మరో పేరుకూడా ఉంది తమిళనాట ప్రతి సంవత్సరం జంద్యాల పండుగ జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ఆవణి ఆవట్టం అంటారు. వివాహానంతరం మొదటిసారిగా ఈ పండుగ అత్తవారింట జరుపుకోవడం ఆనవాయితే. యజ్ఞోపవీతాన్ని భుజంపై నుండి రెండవ చేతి క్రిందిగా ధరించాలి. శుభకార్యాలకు సవ్యంగానూ కర్మక్రియలు లాంటి పితృ కార్యాలు జరిపేటప్పుడు అపసవ్యంగా ధరించడం ఆనవాయితీ. అలాగే మర్రి లేక చండ్ర కొమ్మను కానీ నొసటి వరకు ఉండేలా దండాన్ని ధరించాలి. తరువాత బిక్షాం భవతి దేహి అని యాచించాలి. యాచించే ముందు సూర్యోపాసన చేసి అగ్నికి ప్రదక్షిణ చేసి యాచించాలి. క్షత్రియులకు జ్యేష్ట ఆషాఢాలు ఉపనయము చేయడానికి ఉత్తమమని భావన.

అలాగే వైశ్యులు ఉన్ని బట్టను అంగవస్త్రంగా ధరించి గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. వైశ్యుడు జనపనారతో చేసినది అది లభ్యం కానిచో తుంగతో చేసిన మొలత్రాడును ముప్పేటగా చేసి అయిదు ముడులు వేసి ధరించాలి. మేక బొచ్చుతో చేసిన తొమ్మిది పేటల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. జమ్మి లేక మేడి కొమ్మను ముక్కు వరకు ఉండేలా ధరించాలి. దండం వంకర లేనిది అగ్నిలో కాలనిది పైపట్టతో కూడినదై ఉండాలి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు ఉత్తమ ఉపనయన కాలమని పెద్దల భావన.

 

ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో అన్నకు అదికూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రికులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడుగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్నోపవీత ధారణ సమయంలో అయిదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలను ఇవ్వడం ఆచారం. బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు మరియు ధర్మాచరణాధికారం ఇస్తుంది.

అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్టేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయివలెనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడవై ఉండాలని దీని అర్ధం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేయవలెను, దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్య వంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండునూరేళ్ళు జీవించమని ఆశ్వీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంత్రోపాసన చేయించాలి. వటువు ఆచార్యునకు గోదానం ఇచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణచేసి భిక్షాటనకు బయలు దేరాలి.

ఉపనయనము తరువాత వటువు కనీసం 12 సంవత్సరాలు ఒక వేదమునైనా అభ్యసించాలి. అలాగే ఒక్కో వేదానికి ఒక్కో 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించవచ్చు. కానీ అది తప్పని సరికాదు. కలియుగములో ఎక్కువకాలం బ్రహ్మచర్యం మంచిదికాదని ఋషి భావన. ఆ తరువాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్రసమ్మతం.

బ్రహ్మచారికి నియమ నిష్ఠలు అనేకం ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను వాడరాదు, పగటి నిద్ర పనికి రాదు, అలంకరణ చేసుకోరాదు, కామక్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి, స్త్రీలయందు మౌనం సాధించాలి, సంగీత నృత్య వాద్యాలకు దూరంగా ఉండాలి, దుర్జన సాంగత్యం చేయకూడదు, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వాహనాన్ని అదిరోహించకూడదు, వివేకం వీడకూడదు. దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు, అతిగా ఉద్రేకం, సంతోషం లాంటివి దరిచేరనీయకూడదు. అద్దములో ముఖమును చూడరాదు. మధువు, మాంసము తీసుకొనకూడదు. ఉప్పు, కారం లేని సాత్విక భోజనమే భుజించాలి. గురువు ఆజ్ఞను శిరసావహించాలి. ఇలా అనేక నియమ నిస్ఠలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం.

 ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ

చార్‌ ధామ్‌

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.

మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించారు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ, అవి శైవమతానికి మరియు వైష్ణవ శాఖలలో మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంలా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాధ్, కేదార్‌నాధ్, గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

శుక్లయజుర్వేదం

యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడినుండి నేర్చుకుని ప్రచారం చేసిన యజుర్వేదాన్నే శుక్లయజుర్వేదం అంటారు. ఉపనిషత్కాలపు ప్రాచీన భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు గొప్ప ఋషిగా, మహామేధావిగా, బ్రహ్మతత్వవేత్తగా గణనకెక్కాడు. అతని తండ్రి వాజసుడు. కనుక అతడు వాజసనేయుడయ్యాడు. వ్యాస శిష్యుడైన వైశంపాయన మహర్షికి అతడు శిష్యుడు. గురువు వద్ద యజుర్వేదం అభ్యసించాడు. ఒకసారి గురువుతో తగాదాపడగా గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యనంతా తిరిగి అప్పగించమన్నాడు. దానితో విద్యనంతా అప్పగించి సూర్యునికై తపస్సు చేసాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదమంతా తిరిగి నేర్పాడు. దానికే యజుర్వేద వాజసనేయ శాఖ అని, శుక్ల యజుర్వేదమని పేర్లు వచ్చాయి. యాజ్ఞవల్క్యుడు గురువుకు అప్పగించివేసిన దానికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

మహాన్యాసము

మహాన్యాసము 


నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది

౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది

౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది

౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది

౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.

తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...