‘అహం భక్త పరాధీనో, హ్య స్వతంత్ర ఇవ ద్విజ
సాధుభిర్ గ్రస్త హృదయో, భక్తైర్ భక్త జనప్రియ’’
అని భాగవతంలో చెప్పబడినట్లుగా, సుదర్శన చక్ర బాధితుడై దుర్వాస మహర్షి విష్ణువును శరణువేడినపుడు విష్ణువే స్వయంగా.. ‘నేను భక్తుల విషయంలో పరాధీనుడను. ఎంత స్వతంత్రుడనైనా, సాధువుల సందర్భం వచ్చేసరికి వారికి స్వాధీనుడనే, అస్వతంత్రుడనే. భక్తులైన సాధు పురుషులు నాహృదయాన్ని స్వాధీనపరచుకొని ఉంటారు. వారే నా ఆత్మీయులు. నేను భక్త జన ప్రియుడను’’ అన్నాడు. భక్తుని ప్రయత్నాలేవీ ఫలించనపుడు భగవంతునికి తన్ను తాను అర్పించుకుని, ఆయన సహాయాన్ని అర్థించడమే ‘శరణాగతి’.
‘‘త్వమేవ మాతాచ, పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ, సఖా త్వమేవ
త్వమేవ విద్యా, ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ’’ అనే విశ్వాసం కలిగి ఉంటే చాలు, ఆయన కృష్ణుడా, రాముడా, గౌరాంగుడా.. ఎవరైననేమి నమ్మిన వారికి, ‘త్వమేవ శరణం మమ, అన్యథా శరణం నాస్తి’.. అంటూ ఆశ్రయించిన వారికి ఆయన మిత్రుడు, హితుడు, బంధువు, ఆప్తుడు, మార్గదర్శి. భక్తుడు భగవంతుని శరణుజొచ్చినపుడు ఇక తాను ప్రత్యేకంగా ఉండడు. అందుకే శరణాగతి అద్వైతాన్ని ప్రకటిస్తుంది. ఇదే శరణాగతి తత్వం. భగవద్గీతలోని ‘మోక్ష సన్యాస యోగంలో’..
‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజశ్రీ
అహంత్వా సర్వపాపేభ్యో, మోక్షయిష్యామి మాశుచః’’శ్రీశ్రీ
‘‘ధర్మాలన్నింటినీ పరిత్యజించు- నన్నొక్కడినే శరణుకోరుకో. నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను. చింతించకు’’ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన బోధించిన సమస్త సాధనాల సారాంశమూ అనన్యశరణాగతియే. భక్తుడు తన సమస్త భారమును భగవంతునికి సమర్పించుటే శరణాగతిలోని ముఖ్య రహస్యం....
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....
No comments:
Post a Comment