అశ్వినీ నక్షత్రం మరియు పూర్ణిమ కలసివచ్చేమాసమే ఆశ్వియుజమాసం. ఈ మాసంలో శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజు దేవీనవరాత్రులను వైభవంగా నిర్వహిస్తారు. వీటినే శరన్నవరాత్రులని పిలుస్తారు. చివరి మూడు రోజులకు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ప్రత్యేక విశిష్టత ఉంది.
పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభులతో ఐదువేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోయాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీమహావిష్ణువును మెచ్చుకుని గర్వంతో నీకు ఏవరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు. తమకు ఇకమరణము తప్పదని నిర్ణయించుకుని తమను నీరులేనిచోట చంపమనికోరతారు రాక్షసులు. శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన మహామాయ పదితలలతో, పదికాళ్ళతో, నల్లని రూపంతో ‘‘మహకాళి’’ గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.
అనంతరం ‘‘సింహవాహిని’యై మహిషాసురుని సంహరించింది. ‘‘మహామాయా`మహాసరస్వతి’’ రూపంలో శుంభ, నిశుంభులను వధించింది. చండ, ముండులను సంహరించి ‘‘చాముండి’’ అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై ‘‘నంద’’ అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. రాక్షసంహార సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవల్ల ‘‘రక్తదంతి’’ అయినది. మునిజనులందరూ వందకన్నులతో ఎదురుచూడగా వారి ప్రార్థన మేరకు ఆవిర్భవించిన తల్లి ‘‘శతాక్షి’’ అని పిలువబడింది. కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధను చూడలేక ‘‘శాకంబరి’’గా వారికి శాకాలు, ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. దుర్గముడను రాక్షసుని సంహరించి ‘దుర్గ’’అను పేరుగాంచింది. ‘‘భీమాదేవిగా ఆవిర్భవించి తననువేడినవారి మనోభీష్టాలను నెరవేర్చింది. తుమ్మెద రూపంతో అరుణుడను రాక్షసుని హతమార్చి ‘‘భ్రామరి’’ అను పేరు తెచ్చుకుంది.
ఆ విధంగా క్రూరులై లోకాలను భయభ్రాంతుకు గురిచేస్తున్న రాక్షసులను సంహరించి అందరికీ ఆనందాన్ని అందించింది. అందువ్ల ఈ దేవిని ఎవరికివారు తమకు తోచిన రూపంతో ఆరాధిస్తారు. అయితే వీటన్నింటిలో ‘‘నవవిధ రూపాలు’’ అత్యంత ప్రాముఖ్యతను పొందాయి. నవరాత్రు సందర్భంగా ఈ తొమ్మిదిరూపాతో దేవిని అంకరించి ఆనందాన్ని పొందుతారు భక్తులు.
‘‘నవరాత్రులు’’ అంటే తొమ్మిది రాత్రులని అర్థం. తొమ్మిదిరాత్రులపాటు దేవిని ఆరాధించడమే దీనిలోని అంతరార్థం. దేవీనవరాత్రులు జరిగే తొమ్మిదిరోజులూ ప్రత్యేకమైనవే అయినా చివరి మూడురోజులకు ఎంతో విశిష్టత ఉన్నది. ఆ మూడురోజులే దుర్గాష్టమి, మహర్నవమి, దసరా. ఈమూడు రోజులూ భక్తులు విశేష ఆరాధనలు, ఉపవాసానలు, చండీహోమాలు మొదలైన కార్యక్రమాలతో యథాశక్తిగా దేవికి తమ భక్తిని నివేదిస్తారు.
విజయానిచ్చే విజయదశమి
దసరాకు మరోపేరు ‘దశహరా’’. అంటే పది పాపాలను హరించేది అని అర్థం. ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలో ‘‘దసరా’’ ఒకటి. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భం. అంతేగాదు.... పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై నుంచి తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. అందుకే ఈనాడు రావణవధ, జమ్మి చెట్టుకు పూజా చేయటం ఏనాటినుంచో పాటిస్తున్న సంప్రదాయం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. ఈనాటి సంధ్యాసమయంలో నక్షత్రాలు కనబడిన సమయంలో ‘‘విజయ’’ అనే ముహూర్తం ప్రారంభమవుతుందని జ్యోతిష్యశాస్త్రం వివరిస్తోంది. కొన్ని ప్రాంతాలలో విజయదశమిని ‘‘అపరాజితాదశమి’’ అనికూడా వ్యవహరిస్తారు.
ఈ రోజున ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని ‘‘ఆశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోజ్ఞేయః సర్వకార్యార్థసిద్ధయే’’ అంటూ ఈ విషయాన్ని శంకరుడు పార్వతికి చెప్పినట్లు మన ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍
No comments:
Post a Comment