Thursday, February 22, 2018

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.
మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి. ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను. అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది. నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోఅలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమె కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను మరిన్ని పనులు చెయ్యగలను. అదే విధంగా కేవలం మంత్రోచ్చ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతనధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు 108 నామాలు జపించమని, లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని కండిషన్ విధిస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతనం.

!! ఓం నమః శివాయ !!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...