Wednesday, May 9, 2018

మన మహర్షులు అగస్త్య మహర్షి


అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు.

అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది.

వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను అగస్త్యుడే  రచించాడు.  అగస్త్యుణ్ణి  కలశజ, కుంభజ, కుంభసంభవ, మైత్రావరుణి అని కూడా అంటారు.

అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా, ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ గర్భస్థానం. ఈ కుండలోనే ఆగస్త్యుడు, తన కవల అయిన వశిష్ఠునితో కలసి పెరుగుతాడు.  అలా అగస్త్యునికి *కుంభసంభవుడు* అనే పేరు వచ్చింది.  అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్ధం.
( ఈ మట్టి కుండలో పుట్టడం ఏమిటి ? అనే సందేహం రావడం సహజం. భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం  అనేది నేడు మనం చూస్తున్నాం. దాన్నే *టెస్ట్ ట్యూబ్ బేబీ* అంటున్నాం.   పురాణంలో  చెప్పబడిన ఈ మట్టి కుండలో జననం అనేది టెస్ట్ ట్యూబ్   బేబీ    ని మించిన వైజ్ఞానిక చర్య.  పురాణాలు ఏవీ సైన్సు కు అంతు చిక్కనివి. అందువల్లే    నేటి  ఆధునికులు పురాణాలను నమ్మకపోవడం లేదా కొట్టి పారేయడం చేస్తుంటారు. పార్వతి నందునుడు గణేశునికి ఏనుగుతల చేర్చబడింది. తల నరక బడిన దక్షునికి మేకతల అతికించబడింది. అలాగే మృగ శీర్షంతో సహజంగా అవతరించిన దేవతలున్నారు. వారిలో నరశింహుని ముందుగా చెప్పుకోవాలి.  గుఱ్ఱం ముఖులు మనకు ఇద్దరు కన్పిస్తారు. ఒకరు గాన గంధర్వుడు తుంబురుడు, రెండవది సాక్షాత్తూ నారాయణావతారమైన హయగ్రీవుడు. ఇంకా భైరవుడు కుక్క మొఖం కలిగిన వాడు. వీటి వెనుక నేటి ఆధునిక వైద్యులకు శాస్త్రవేత్తలకు అంతుచిక్కనంత మహత్తరమైన సైన్సు దాగి ఉంది.మన వాంగ్మయం మన వైదికం *Beyond Science* . సూర్య కిరణంలో దాగున్న D విటమిన్ ఎలా అయితే కంటికి  కనబడదో మన ధార్మిక అంశాలూ అంతే  *త్వరలోనే మన వెబ్ సైట్ లో దీనిగురించి ఆధారాలతో రాస్తాను* )

*వివాహం -  సంతానం*

అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర. అగస్త్యునితో ఈమె వివాహం గురించిన కథ ఒకటి ఉంది.
    ఈవిధంగా జన్మించిన అగస్త్యుడు ఒకసారి ఒక అడవిలో వెడుతుండగా, ఆయనకు తన వంశంలోని పితృదేవతలు చెట్లకొమ్మల మీదనుంచి దిగువకు తలకిందులుగా వేళ్లాడుతూ కానవస్తారు.వారిని చూసి, వారి దురదృష్టానికి చాలా చింతిస్తాడు. వంశం కొనసాగని కారణంగా,  ధర్మనియమాల ప్రకారం తమకు ఉత్తమ లోకాలకు వెళ్లగల అవకాశం లేకపోతోందని వారు అగస్త్యునికి తెలియజేస్తారు. తమ పూర్వికులైన పితృదేవతలకు ఉత్తమగతుల ప్రాప్తి కలిగించటం తన బాధ్యత గనుక,   తాను మనుధర్మ నియమానుసారం వివాహం చేసుకుని, తండ్రి కావాలనే కోరికతో అగస్త్య మహర్షి, తన తపోశక్తితో, సకల గుణ సంపన్న కాగల ఆడపిల్ల అయ్యే విధంగా ఒక ఫలాన్ని రూపొందిస్తాడు. అప్పట్లో విదర్భ మహారాజు బిడ్డలకోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన అగస్త్యుడు, తను సృష్టించిన ఫలాన్ని విదర్భ రాజదంపతులకు ఇచ్చి, ఆమె విదర్భరాకుమార్తెగా పుట్టే ఏర్పాటు చేస్తాడు. ఆ బిడ్డ విదర్భ రాజుకు కుమార్తెగా లోపాముద్రగా జన్మిస్తుంది. తర్వాత, ఆమెకు యుక్తవయస్సు వచ్చాక, ఆమెనే అగస్త్య మహర్షి వివాహమాడుతాడు. అగస్త్య మహర్షి అంటే ఇష్టపడే లోపాముద్ర, తన రాజభోగాలను వదులుకుని, భర్తతో అడవికి వచ్చేస్తుంది. ఈ దంపతులకు భృంగి, అచ్యుత అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. 

    అయితే, అగస్త్య లోపాముద్ర దంపతులకు ఒక్కడే కుమారుడు జన్మించాడనే కథ వేరొకటి ఉంది. ఒకసారి, లోపాముద్ర తన భర్త అయిన అగస్త్యుని చేరి, తనకు కుమారుడు కావాలని కోరుతుంది. దానికి అగస్త్యుడు 'నీకు వెయ్యిమంది కొడుకులు కావాలా? లేదా వెయ్యిమంది శక్తితో వంద మంది కుమారులు కావాలా? లేదా వందమంది శక్తితో పదిమంది కుమారులు కావాలా? లేక పదిమంది శక్తితో ఒక్క కుమారుడే కావాలా?' అని అడుగుతాడు. దీనికి జవాబుగా తనకు ఒక్క కుమారుడు చాలని లోపాముద్ర జవాబు ఇస్తుంది. ఆయన ఆవిధంగానే అనుగ్రహిస్తాడు. దానితో, వారికి 'దృహదశ్యుడు' అనే కుమారుడు జన్మించాడనేది ఈ కథ. ఈ కుమారునికే 'ఇద్మావహుడు' అని మరొక పేరుందని అంటారు.

అగస్త్యుడు రచించి మనకు అందించిన సోత్రాలు  ఎన్నో ఉన్నాయి. 
జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే I. జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి II 1 II. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి I. హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే II 2 II. అనే మహాలక్ష్మి స్తోత్రం,  అలాగే...

రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి *ఆదిత్య హృదయం* అనే  మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.

🔥 *పురాణ కథలలో అగస్త్యుని ప్రస్తావన* 🔥

వాతాపి, ఇల్వలుల కథ
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారి మేకమాంసానని పెట్టేవాడు. మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను ఛేదించుకొని బయటకు వచ్చేవాడు.
ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తుండగా ఈ రాక్షసులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం జపిస్తాడు. కానీ వాతాపి మాత్రం ఎంతకీ తిరిగి రాడు. ఎందుకంటే వీరి విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేస్తాడు.
కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తపస్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగస్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణాలకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవతలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ.
వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనంతరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగానికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృదయాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలువగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే.

🔥 వింధ్యుని గర్వ మణచుట 🔥

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్యపర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. 'అగస్త్య' అనే మాటకు పర్వతాలను పడదోయగలిగినవాడు అని అర్థం. 'అగ' అంటే కదలలేనిది, పర్వతం అని అర్థం కాగా, 'అస్తి' అంటే ఉండుట అర్థం, 'న' అంటే లేదు, అని అర్థం. మొత్తంమీద పర్వతాలను ఉండనీయకుండా చేయుట లేదా పడగొట్టడం అని అర్థం. వింధ్యపర్వతగర్వభంగం చేసిన కారణంగా ఈయనకు ఈ పేరు వచ్చిఉండవచ్చు.

*అగస్త్యుడి ద్వాదశ వర్ష యజ్ఞం* 

    అగస్త్యుడు ఒకసారి ద్వాదశ వార్షిక (12 సంవత్సరాలపాటు జరిగే) యజ్ఞం చేయాలని సంకల్పిస్తాడు. అయితే, ఈ యజ్ఞానికి వచ్చే వారికి అన్నపానాదులు సమకూర్చటం అంటే మాటలు కాదు. పైగా అప్పట్లో వర్షాభావంచేత తీవ్రమైన కరువు ఉండేది. ఈ సందేహాన్నే అనేకమంది మునులు, అగస్త్యుని ముందుంచారు. ఆయన నవ్వి, 'సకాలంలో వానలు కురిపించటం ఇంద్రుని పని. ఆయన ఆ పనిని సరిగ్గా చేయని పక్షంలో నేనే ఇంద్రపదవిని గ్రహించి, వానల్ని కురిపిస్తాను' అని అన్నాడు. ఈ సంగతి విన్న దేవగురువు బృహస్పతి వెంటనే, అగస్త్యుడిని చేరి, క్షమించమని కోరి, ఇంద్రుని పిలిపించి వర్షాలను కురిపించాడు. ఫలితంగా, అగస్త్యుడు, తాను అనుకున్నట్లుగా ద్వాదశ వార్షిక యజ్ఞాన్ని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాడని మహాభారతంలోనిదే మరొక కథ.

🔥 *మానవాళికి అగస్త్యుని వరాలు* 🔥

    అగస్త్య మహాముని మానవాళికి ప్రసాదించిన అపురూప వరాలు ఎన్నో ఉన్నాయి.

    మహాభారతంలోని శాంతి పర్వంలో అగస్త్య బోధ ఉంది. దీన్నే 'అగస్త్య గీత' అనీ అంటారు.

    'సంస్కృత వాచస్పత్యము' అనే గ్రంధం ప్రకారం, అగస్త్యుడు 'రామచంద్ర విష్ణునామాద్యవతార పూజా విధానము'ను కూడా శాస్త్రోక్తంగా తెలియజేశాడు. దీన్నే మనం 'అగస్త్య సంహిత' అని వ్యవహరిస్తున్నాం.
ఇక, శ్రీరామచంద్రుల వారికి అగస్త్యుడు బోధించిన 'ఆదిత్య హృదయం' సుప్రసిద్ధం. ఇది

    'రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌,
    పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌...'
అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అంతవరకూ యుద్ధం చేసినా, రావణుని తాను వధించలేకపోయానని బాధపడుతూ, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రుని కర్తవ్యపరాయణుని చేసిన మహా మంత్రమిది. ఈ 'ఆదిత్యహృదయం' పఠనంతో శ్రీరాముడు తిరిగి, సముజ్జ్వల శక్తితో యుద్ధరంగానికి చేరి రావణుని వధించాడు.

    అలాగే, అగస్త్యుడు, మానవాళిని అనుగ్రహిస్తూ అందించిన 'ఆదిత్య కవచము' కూడా మహామహిమాన్వితం. ఇది

    'జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం
    సిందూరాంబర మాల్యం చ రక్తగంధానులేపనమ్‌' 
అనే శ్లోకంతో ఆరంభం అవుతుంది.

    అలాగే, ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణుని స్తుతిస్తూ, అగస్త్యుడు 'ఆదిత్య స్తోత్రము'ను కూడా మానవాళికి ప్రసాదించాడు. 'ఆదిత్య స్తోత్రము' దిగువ పేర్కొన్న శ్లోకంతో ఆరంభం అవుతుంది:

    'ధ్యాయేత్సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం
    భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్‌'.

*అగస్త్యునికి అర్ఘప్రదానం*

భాద్రపద మాసంలో ఆకాశవీధిలో అగస్త్య నక్షత్రం మనకు ఎంతో తేజోమయమై కానవస్తుంది. ఈ అగస్త్య నక్షత్రం కానవచ్చిన తర్వాత, ఆగస్త్యుని ప్రతిమకు కాశపుష్పాలతో పూజ చేసి, ఆ రాత్రి జాగరణ చేయటం సంప్రదాయం. ఇలా చేయటం మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ఇది ఇప్పటికీ అనేక ప్రాంతాలలో మనకు కానవస్తున్న పూజావిధానం.

    అగస్త్యాయ సమస్తేస్తు అగస్త్యేస్మిన్‌ ఘటేస్థితః
    అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః
    అగస్త్యస్సప్తజన్మాఘం నాశయిత్వా వయోరయం
    అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్ఛతు మహామునిః 

                                    గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...