Monday, February 26, 2018

ఆది పర్వము ప్రథమాశ్వాసము -2


పూర్వం భృగువు అనే మహాముని వుండేవాడు. అతడి భార్య పేరు పులోమ. ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసాడు. అతడికి పులోమ మీద మోహం కలిగింది. అతడు అగ్ని దేవునితో ఆమె ఎవరని అడిగారు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు. అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేసాడు. ఇప్పడు నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు. అదీ కాక భృగువుకు కూడా తన మీద కోపం రావడంమేగాక తనను శపించవచ్చు. కాని నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంట వచ్చు. అనగ సందిగ్ధంలో పడినా ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు. అనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అది వినగానే పులోముడు పులోమను గుర్తు పట్టాడు. వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు. ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు. ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు. కింద పడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చింది. చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు.

*అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట*

తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది. ఆ తరుణంలో పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించ సాగింది. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేసాడు. నదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూసాడు. అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది. భృగువు భార్యతో " నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. పులోమ " నాధా ! ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు. వరాహరూపంలో అతడు నన్ను తీసుకు పోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు " అని చెప్పింది. అది విని భృగువు కోపించి అగ్నితో " ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు. అందు వలన నీవు సర్వ భక్షకుడివి అయిపో " అగ్నిదేవుని శపించాడు.

*అగ్నిహోత్రుడి అలక*

అగ్నిదేవుడు " మహర్షీ ! అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా. నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను. కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా ! నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావు. నేనూ నీకు ప్రతిశాపం ఇవ్వగలను. అయినా పరుషోక్తులు పలికిలా, కొట్టినా, తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే ! నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించను. సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేసావు. నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను, హవిస్సులను తీసుకు వెళ్ళి దేవతలకు, పితరులకు ఇస్తాను. అందు వలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు. నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని ఔతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు, పితరులకు అందజేయలేను. నేనా పని చేయకున్న లోకాలు స్థంభిస్తాయి " అని చెప్పాడు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్ని దేవుడు సర్వ భక్షుకుడైన తాను పితృ కార్యానికి, దేవ కార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు. లోకంలో దేవక్రతువులు, యజ్ఞయాగములు, ఔపోసనాది కార్యములు ఆగి పోయాయి. దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి. పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగి పోయాయి. అగ్ని కార్యాలు ఆగి పోయాయి. ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్ళారు. వారంతా దేవతల వద్దకు వెళ్ళారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి " అగ్ని దేవా ! నీవు సమస్త భూతములకు నీవు యజమానివి, చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు, సమస్త దేవతలకు నీవు ముఖం వంటి వాడిని. లోకోపావకుడివి అయిన నీవు ఇలా చెయ్యడం ధర్మం కాదు. భృగువు వాక్కు అసత్యం కాదు. సర్వభక్షకుడివి అయినా నీవు సర్వ కార్యాలలో ప్రధముడివి. నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివి, పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు " అని అర్ధించాడు. అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు.
*సశేషం*
*రేపు రురుడు ప్రమద్వరల వృత్తాంతం*
*సర్పముల మీద రురుడి పగ*
*ఖగముని వృత్తాంతం తెలుసుకుందాం*

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...