Friday, August 23, 2013

గోవులను కష్టపెట్టే పూజలు ఆపండి

పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసిగానీ మొదలు పెట్టేవారు కాదు. నేడు ప్రతీ పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజలలో మనం  కూడా గోపూజ చేస్తున్నాం. కానీ నాటికీ నేటికీ గోపూజలో హస్తిమశకాంతరం ఉంది. పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు. ప్రతీ వారికీ గోవులు ఉండేవి. ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది.నేడు మనలో నూటికి తొంభైతొమ్మిది మందికి గోవులు లేవు. మనకు ఆ పూజ ఆచారమూ పోయింది. సరే అంతవరకూ బాగానే ఉంది.


 గృహప్రవేశాలప్పుడు ఇంటిలోనికి ముందుగా తాముపెంచుకునే గోవుని పంపి తాము ప్రవేశించడం ఆచారంగాఉండేది. నేటికీ ఆ ఆచారం ఉంది. కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు. ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం. ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం. పూర్వం ఇళ్లన్నీ మట్టి నేలలతో ఉండేవి. ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు. చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి. ఆ నేలమీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం. అలాంటిది అలవాటు లేని ఆవూ,దూడలను మెట్లు ఎక్కించి, ఆ ఇంట్లో కాళ్లు జారుతూన్నా ఇల్లంతా తిప్పించి, భజంత్రీలు, బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడ వేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా!?

 దానికంటే చక్కగా ఓ వెండి గోవును పళ్లెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి. గోవు చాలా పవిత్రమైనది. దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలూ పెడుతున్నాం. ఇదంతా తెలిసి చేస్తున్నాం అనికాదు. ఎవరూ ఆలోచించడం లేదు అంటున్నాను. గోవు బాధ పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడివాతావరణం సహజంగా ఉండాలి. కొత్త వాతావరణంలో కొత్తవారిని చూస్తే అవి బెదురుతాయి. పైగా భజంత్రీలు, బంధువులు ఉంటారు. ఇంత మందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి. ఇక ఆ గ్రానైట్ నేలమీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి. కొంతమంది అపార్ట్ మెంట్లు కూడా ఎక్కించేస్తున్నారు. దయచేసి ఆపని చేయకండి. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవలసి వస్తుంది. ఒక వేళ పెద్దలు, పురోహితులు ఎవరైనా అదేంటి గోవులేకుండా ఎలా ? అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి. నాకు తెలిసి పురోహితులు చాలా మందికి ఈ స్పృహ ఇప్పటికే కలిగింది. యజమానులు కూడా అర్థం చేసుకో గలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది.

 ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు. గృహప్రవేశమప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి. కానీ ఇల్లంతా తిప్పే పని మాత్రం మానండి. చక్కగా గోవును పూజించండి. ఈ పూజా క్రమంలో కూడా ఆ గోవు ఒళ్లంతా పసుపు,కుంకుమ చల్లకుండా పాదాలకు, నుదుటివద్ద, తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి. మనం కూడా పసుపు మంచిదని ఒళ్లంతా చల్లుకోం కదా!? పాదాలకు రాసుకుంటారు. అలాగే ఆవుకు కూడా.

ఇక ఆవుకు బిడ్డపుట్టేటప్పుడు ప్రదక్షణాలు కూడా దానిని భయపెట్టేవిధంగా ఉంటున్నాయి. కాస్త ఆవిషయంలో కూడా ఆలోచించండి. ఈ మధ్య మరీ మూర్ఖంగా ఆవుకు ఆరుపాదాలు ఉన్నాయి అంటూ వాటిని ఇల్లిల్లూ తిప్పి దానిపేరుతో డబ్బులు దండుకునే వారు తయారయ్యారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. చేతనైతే నాలుగు చివాట్లు పెట్టండి. ఆ ఆవులను పూజ పెరుతో ఒక చిన్న లారీ లాంటి దానిలో పెట్టుకుని తిప్పడం ఎక్కడో చూశాను. రెండు చేతులున్న మనకే లారీలో నుంచుని ప్రయాణించడం కష్టమైన పని. ఆ లారీ దూకుడుకు నుంచోలేక క్రింద కూర్చుంటాం. అలాంటిది చేతులు లేని ఆవులకు ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. దాని ప్రాణం ఎంత హడలిపోయి ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. అలా వాహనాలలొ తిప్పి డబ్బులడిగే వారిని తప్పకుండా ఖండించాలి. కావాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని బెదిరించాలి.

ఆవుకు ఆరు కాళ్లు ఉంటే చాలా మంచిదని, దానికి పూజించడం చాలా విషేషమని మన నమ్మకం. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానివెనుక కారణాలు ఆలోచించాలి మనం. నోరులేని, మనకంటే నిమ్న స్థాయిలోని ప్రతీ జీవినీ మనం దాదాపుగా పూజిస్తాం. ఆఖరికి కుక్కను కూడా కాల భైరవుడంటూ పూజిస్తాం. అలా ఎందుకంటే వాటికి రక్షణ కల్పించాలని. వాటికి కూడా జీవించే హక్కును కల్పించాలని. మనం భక్తి పేరుతో నైనా వాటిని రక్షిస్తామని. గోవు ఎవరికీ హాని చెయ్యని సాధుజంతువు. పైగా అది తినేది గడ్డి, ఇచ్చేది తియ్యటి పాలు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు మూత్రం, పేడ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ ఈ ఐదింటిని గో పంచకము అంటారు. విషేష పూజలలో వీటిని పూజించి సేవించడం నేటికీ ఉంది. అటువంటి ఆవును రక్షించాలని దానికి పూజలలో ప్రథమ స్థానం ఇచ్చారు. ఏదైనా ప్రయోజనం ఉన్నంత సేపే మనం దానిని రక్షిస్తాం. మన స్వార్థ గుణంతో ఏ ఉపయోగం లేదని, అంగవైకల్యంతో జన్మించిన ఆవులను సంరక్షించడం కష్టమని వాటిని ఎక్కడ వదిలేస్తామో అన్న చింతనతో అటువంటి వాటిని విషేషంగా పూజించాలన్న నియమం పెట్టి ఉండవచ్చు. అలాంటిది వాటిని పూజపేరుతో ఊరూరూ తిప్పుతూ మరింత బాధ పెట్టడం చాలావిచారకరం. అందరూ ఈ విధానాలను ఖండించాలి.

 గోవులను బాధపెట్టకుండా పూజించే వీలులేకపోతే ఆ పూజలు మానండి. నష్టమేమీ లేదు. వాటిని తెలిసికానీ తెలియక కానీ ఏవిధంగానూ బాధ పెట్టడం మంచిదికాదు.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...