Thursday, May 17, 2018

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు

హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

జ్వాలా నరసింహ క్షేత్రము

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం  యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి
నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.
గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

శ్రీ మహాలక్ష్మీ అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తె మహాలక్ష్మీ నమోస్తుతే

నమస్తే గరుఢారుఢే ఢోలాసుర భయంకరీ
సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సర్వగ్నే సర్వ వరదే సర్వదుష్ట భయంకరీ
సర్వదుఖః హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

ఆద్యంత రహితే దేవి ఆది శక్తీ మహేశ్వరీ
యోగగ్నే యోగ సంభుతే మహాలక్ష్మీ నమోస్తుతే

స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తీ మహొదరే
మహాపాపా హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

పద్మాసన స్థితే దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ
పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే

శ్వేతాం భరధరే దేవీ నానాలంకార భుషితే
జగత స్థితే జగన్మాత మహా లక్ష్మీ నమోస్తుతే

మహా లక్ష్మ్యస్టకం స్తోత్రం యః పఠేద్భక్తి మాన్నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఏకకాలే పఠేన్నిత్యం మహా పాప వినాశనం ,
ద్వికాలం యః పఠే న్నిత్యం ధన ధాన్య సమన్వితం
త్రికాలం యః పఠేన్నిత్యం మహా శత్రువినాశనం
      
మహా లక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఇతీంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణం.

Wednesday, May 16, 2018

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత


అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనకు జూచుట) మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.

4. పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

అధిక మాసం


భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ మాస వివరాలున్నాయి.

హిందూ కేలండర్‌ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా మల మాసమని,లేదా పురుషోత్తమ మాసం వస్తుంది.

కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా అందరూ వాడే మాటలు ''అసలే కరువు, అందులో అధిక మాసం' అని సాధారణంగా సంవత్సరానికి 12 మాసాలే కానీ ఈ అధిక మాసం ఏమిటని అంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

ఓసారి భగవాన్‌ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారయణుడు అధిక మాసాన్ని సృష్టిం చాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటంలేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట.

1. సౌరమానం 2. చంద్రమానం. తెలుగువారు చాంద్రమానం ప్రకారం పండుగలను జరుపు కుంటారు. చాంద్రమానం అంటే శుక్లపక్ష పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ఒక చాంద్ర మాసం అవుతుంది.

సౌరమాన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు, ప్రతిమాసం ఒక్కొక్క రాశియందు సంచరిస్తూ పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో సంచరించడం వలన ఒక సంవత్సర కాలం పూర్తి అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 365.2622 రోజులు సౌరమానం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తుంటాయి. అంటే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది ఆయన సంక్రాంతి అవుతుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అవుతుంది.

ఒక అమావాస్య నుండి తిరిగి అమావాస్య ఏర్పడుటకు 29.53 రోజులు పట్టును. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు. సౌరమానానికి సంవత్సరానికి 365.24రోజులు. ఈ రెండు మాసాల మధ్య గల వ్యత్యాసాన్ని భర్తీ చేయుటకు భారతీయ కాల గణనలో ప్రతిరెండున్నర సంవత్స రాల తర్వాత ఒక అధిక మాసముగా ఏర్పాటు చేశారు. అంటే రెండు అమావాస్యల మధ్య ఎప్పుడయితే సంక్రమణం ఉండదో అదే అధిక మాసం ఇది సుమారు 32 మాసాల పదహారు రోజులకు ఒకసారి వస్తుంది.

పంచమే పంచమే వర్షే ద్వౌమాసే ఉదజాయత: అని శాస్త్రవచనం, అనగా ప్రతి ఐదు సంవత్సర ములలో రెండు అధిక మాసములు వచ్చునని అర్థం.

సూర్య సంక్రమణం లేని చాంద్రమాసమునే అధిక మాసంగా పరిగణిస్తున్నాం.
ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది.

సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయవ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుప్ఫలితాలుండవు.

అధిక మాసంలో చేసిన జప, దానాదులకు అధిక ఫలం వస్తుందని శాస్త్రవచనం పురుషోత్తమ మాసంలో చేసే పురాణ పారాయణ మునకు, శ్రవణమునకు, విష్ణుపూజకు అధిక ఫలం లభిస్తుంది.

ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు. ముహూర్తాలతో ప్రమేయం లేని నిత్యం చేసే పూజ పునస్కారాలు, యధావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. శాస్త్ర ప్రకారం మరణించిన పితరులను తలచుకొని కనీసం అన్నదానం చేయాలి.

మన మతానికి లక్ష్యం

మన దేశంలో ఏన్నో మతాలున్నవి. శైవసిద్ధాతమొకటి. వైష్ణవుల పాంచరాత్ర మొకటి. మాధ్వసిద్ధాంతమొకటి. ఇట్లు పరస్పర వైరుధ్యం ఉన్నట్లుకన్పించే సిద్ధాంతాలూ మతాలూ ఏన్నో ఉన్నవి. మరి చూడబోతే ఇవన్నీ హిందూ మతానికి చెందినవే. వీనిలో ఏది గొప్ప, ఏది చిన్న అన్న విషయం కాదు ప్రస్తుతం. పోగా హిందూమతమంటే ఏమి? ఇన్నిసిద్ధాంతాలకున్నూ ఉమ్మడియైన విషయమేమిటి? అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా, సరియైన జవాబు రావడం కష్టం. చక్కనిపాండిత్యమున్న వారుకూడా సిద్ధాంతాలలోని వ్యత్యాసాలనే మరింత ఎక్కువచేస్తున్నారు. వీని కన్నిటికీ సామాన్యమైన ఒకే లక్ష్యం ఉంటేకాని, హైందవాన్ని ఒక్క మతం అని చెప్పలేము. మరి ఆ లక్ష్యం ఏమిటి?

అనుదినం కొందరు రామాయణ పారాయణ చేస్తుంటారు. పారాయణ ప్రారంభమందూ అవసానమందూ ఈక్రింది శ్లోకం పఠిస్తారు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహింమహీశాః,
గోబ్రాహ్మణేభ్యః శుభ మస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు||

జనులు సౌఖ్యంగా ఉందురుగాక. రాజులు భూమిని న్యాయమార్గంలో పరిపాలింతురుగాక. పశువులకూ, బ్రాహ్మణులకూ మంగళమగునుగాక. సమస్తలోకాలూ సుఖంగాఉండునుగాక అని దీని అర్థం.

ఈశ్లోకంలో జనులనూ రాజులనూ గూర్చి ఉమ్మడిగా చెప్పి. తర్వాత ప్రత్యేకంగా గోబ్రాహ్మణులనుగూర్చి చెప్పబడినది. ఈ బ్రాహ్మాణప్రశంస ప్రత్యేకంగా దేనికి వచ్చింది? వీళ్ళు లోకంలోవారే కాదా? మరి వీరి విశిష్టత ఏమిటి? బ్రాహ్మణులకు మంగళమగుగాక అనటం బ్రాహ్మణపక్షపాతంకాదా? ఇట్లు చెప్పవలసిన అవసర మేమిటి.

మధురానగరం ఒకప్పుడు కూన్ పాండ్యన్ అన్న రాజు పాలించేవాడు. అతడు శ్రమణుల మతంలో కలసిపోయాడు. శ్రమణమతం స్వీకరించి అతడు 'ఎవ్వరూ విభూతి పూయరాదు. రుద్రాక్షలు వేసుకోరాదు' అన్న కట్టడిచేశాడు. రాజుగారి భార్య, రాజుగారిమంత్రీ పరమశివ-ఏకాంతభక్తులు. ఐనప్పటికిన్నీ రాజాజ్ఞ ఏవిధంగా అతిక్రమించడం? రాజు మళ్ళా బుద్ధిమారి శైవమార్గంలోకి ఎప్పుడు వస్తాడా అని బాధపడేవారు. ఇతడు మళ్ళా శివారాధన ఎప్పుడు చేయబోతాడా అని కలవరపడేవారు. ఇట్లా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి జ్ఞానసంబంధులు విజయంచేశారు. వారు శైవాచార్యులు అనబడే నలువురిలో ఒక్కరు. సుబ్రహ్మణ్యస్వామి అపరావతారం. తమ భక్తకోటితో ఒక్కొక్క క్షేత్రమే దర్శిస్తూ మధురానగరానికి వచ్చారు. ఇట్టి శుభసమయానికి ప్రతీక్షిస్తూ కూచున్న రాజమంత్రీ, రాజపత్నీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. వారు సంబంధులకు వార్తపంపి, ఎట్లాగైనా రాజుగారి బుద్ధినిమార్చవలెనని ప్రాధేయపడ్డారు.

సంబంధులు మధురలో ఒకచోట విడిదిచేశారు. వారి రాక ఇష్టపడని శ్రమణులు, వారి విడిదికి అగ్గిపెట్టారు. దీనిని గమనించి సంబంధులు 'ఈ మంట ఇచ్చటనుండి, రాజుగారి దేహంలో ప్రవేశించనీ' అని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా, ఈశ్వర సంకల్పం మేరకు రాజుకు ఉగ్రమైన జ్వరంవచ్చింది. శ్రమణులు ఎంత శ్రమించినా రాజుగారి జ్వరం తగ్గలేదు. అప్పుడు మంత్రి రాజుగారికి సంబంధుల గొప్పతనం వర్ణించి, వారిని పిలిపిస్తే జ్వరం ఆగిపోతుందని నచ్చజెప్పారు. లోకంలో ఎంత పిడివాదం చేసేవాడయినా, వ్యాధి పరాక్రమం భరించలేని సమయంలో, తన పిడివాదాన్ని కొంతకొంత మార్చుకోవడం వాడుకే. అట్లే వ్యాధి తీవ్రత తాళుకోలేని కూన్ పాండ్యుడుకూడా, రుద్రాక్షలవారినీ బూడిద బుస్సన్నలనూ చూడనన్న తన పట్టును కొంత సడలించి సంబంధులను చూడడానికి సమ్మతించాడు. మంత్రి పరమానందం పొంది సంబంధులను మహా గొప్పగా ఆహ్వానించాడు.

రాజసమక్షంలో శ్రమణులకున్నూ జ్ఞానసంబంధులకున్నూ వాగ్వాదం ఆరంభమైంది. సంబంధులవారు శ్రమణులను చూచి ''మీరు రాజుగారి కుడిభాగంలోని జ్వరం పోగొట్టండి. నేను ఎడమవైపు పోగొటతాను. కానివ్వండి, మీ మంత్రశక్తిని చూపండి అని అన్నారు. మీరు పోగొట్టలేకపోతే మీరోడిపోయినట్లు; నేను పోగొట్టలేకపోతే నేనోడిపోయినట్లు'' అని పన్నిదంచరచి సంబంధులవారు పదికంపాడి రాజుగారి ఎడమభాగానికి విభూతి పూశారు. అంతటితో అభాగములో జ్వరం నిలిచిపోయింది. కాని శ్రమణులు ఎంత శ్రమించినా పని జరగకపోయింది. అంతటితో శ్రమణులు 'మీరుకుడితట్టుబాగుచేయండి; మేము ఎడమతట్టు బాగుచేస్తాం' అనిమళ్ళా సంబంధులతో పందెం వేశారు. సంబంధులవారు సరే అనగా, కుదిరిన ఎడమభాగంలోనికి జ్వరం పునఃప్రవేశం చేసింది. కుడిభాగంలో జ్వరం పోయింది.

రాజుగారి జ్వరం సామాన్యమైనది కాదు. అది ఈశ్వర సంకల్పమూలంగా వచ్చిన జ్వరం. అందుచేతనే శ్రమణులకు చెందిన రాజుగారి శరీరభాగం మళ్ళా జ్వరగ్రస్తమైంది. శ్రమణుల చేతకానితనం రూఢి ఐనపిదప సంబంధులు రాజుగారిపై జాలితలచి జ్వరం పూర్తిగా నిమ్మళించేటట్టు చేశారు.

అప్పటికీ శ్రమణులు తమ వోటమిని ఒప్పుకోలేదు. రాజుగారికిన్నీ పూర్ణమైన నమ్మక మేర్పడలేదు. వాదం మళ్ళా ప్రారంభమయింది. సంబంధులు వాదాని కుపక్రమించేముందు శివాలయానికి వెళ్ళి 'ఈ వేదనిందనూ, యాగనిందనూ చేసే శ్రమణులను జయించి నీ ప్రతిభ సర్వవ్యాప్తమయ్యేటట్లు అనుగ్రహించు' అని ఈశ్వరుణ్ణి వేడుకొన్నారు.

వాదం మళ్ళా ప్రారంభమైంది. సంబంధులవారన్నారు; ''మీసిద్ధాంతాన్ని ఒక తాటాకుమీద వ్రాసి వైఘానదిలో వేయండి. నా సిద్ధాంతాన్ని వ్రాసి నేనూ వేస్తాను. ఇందులో ఏది ప్రవాహానికి ఎదురీత ఈదగలదో అదే సత్యమైనసిద్ధాంతం'' అని. ఇందులోనూ సంబంధులవారిదే జయం. ఐనప్పటికీ శ్రమణులు ఒప్పుకోలేదు. అదేరీతిని తాటాకులమీద తమతమ సిద్ధాంతాలు వ్రాసి పరీక్షార్థం అగ్నిలో వేశారు. శ్రమణుల తాళపత్రం అగ్నిలో దగ్ధమైపోయింది.  జ్ఞాన సంబంధులు ఈ క్రింది అర్థం కల తమ సిద్ధాంతాన్ని ఆ తాటాకుమీద వ్రాశారు.

''బ్రాహ్మణుల సౌఖ్యంగా వర్థిల్లాలి. దేవతలూ, పశువులూ సుఖంగా ఉండాలి చల్లగా ఉండాలి"               

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Tuesday, May 15, 2018

ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

పూర్వం సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికి సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు. అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సగంలోనే భోజనాన్ని వదిలెసి వెళ్ళసాగాడు.

సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం. ఆ దంపతలు యతీశ్వరుని కాళ్ళపై బడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తన చెల్లెలు ఘశ్మకు పెళ్ళి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికి, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్ళి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతయైన ఘశ్మ, అక్క సుదేహను తల్లిల్లా, భర్త్నను దైవసమానునిగా భావించి సేవిస్తుండెది. అచిరకాలంలోనే ఘశ్మ గర్భవతి అయింది.

ఒక శుభదినంలో ఘశ్మ మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగడు. అయితే, సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగిది. ఒకరోజు రాత్రి సుదేఅ, పసివాని గొతుకోసి, తలను మొండేన్ని వేరువేరుగ చెరువులోకి విసిరివేసింది. ఇదంతా తెలియని ఘశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలను తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటువచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది’. అని చెప్పాడు.

కొడుకు చెప్పిన సంగతిని విన్నఘశ్మ దిగ్ర్భమజెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలొచించసాగింది. అలా ఆమె దీర్ఘాలొచనలోనుండగా, శివుడు ప్రత్యక్షమై, సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. అప్పుడు శివుని కాళ్ళపై బదిన ఘశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఇకపై నేను ఘృష్నేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళివై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోకాన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...