Wednesday, May 16, 2018

మన మతానికి లక్ష్యం

మన దేశంలో ఏన్నో మతాలున్నవి. శైవసిద్ధాతమొకటి. వైష్ణవుల పాంచరాత్ర మొకటి. మాధ్వసిద్ధాంతమొకటి. ఇట్లు పరస్పర వైరుధ్యం ఉన్నట్లుకన్పించే సిద్ధాంతాలూ మతాలూ ఏన్నో ఉన్నవి. మరి చూడబోతే ఇవన్నీ హిందూ మతానికి చెందినవే. వీనిలో ఏది గొప్ప, ఏది చిన్న అన్న విషయం కాదు ప్రస్తుతం. పోగా హిందూమతమంటే ఏమి? ఇన్నిసిద్ధాంతాలకున్నూ ఉమ్మడియైన విషయమేమిటి? అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా, సరియైన జవాబు రావడం కష్టం. చక్కనిపాండిత్యమున్న వారుకూడా సిద్ధాంతాలలోని వ్యత్యాసాలనే మరింత ఎక్కువచేస్తున్నారు. వీని కన్నిటికీ సామాన్యమైన ఒకే లక్ష్యం ఉంటేకాని, హైందవాన్ని ఒక్క మతం అని చెప్పలేము. మరి ఆ లక్ష్యం ఏమిటి?

అనుదినం కొందరు రామాయణ పారాయణ చేస్తుంటారు. పారాయణ ప్రారంభమందూ అవసానమందూ ఈక్రింది శ్లోకం పఠిస్తారు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహింమహీశాః,
గోబ్రాహ్మణేభ్యః శుభ మస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు||

జనులు సౌఖ్యంగా ఉందురుగాక. రాజులు భూమిని న్యాయమార్గంలో పరిపాలింతురుగాక. పశువులకూ, బ్రాహ్మణులకూ మంగళమగునుగాక. సమస్తలోకాలూ సుఖంగాఉండునుగాక అని దీని అర్థం.

ఈశ్లోకంలో జనులనూ రాజులనూ గూర్చి ఉమ్మడిగా చెప్పి. తర్వాత ప్రత్యేకంగా గోబ్రాహ్మణులనుగూర్చి చెప్పబడినది. ఈ బ్రాహ్మాణప్రశంస ప్రత్యేకంగా దేనికి వచ్చింది? వీళ్ళు లోకంలోవారే కాదా? మరి వీరి విశిష్టత ఏమిటి? బ్రాహ్మణులకు మంగళమగుగాక అనటం బ్రాహ్మణపక్షపాతంకాదా? ఇట్లు చెప్పవలసిన అవసర మేమిటి.

మధురానగరం ఒకప్పుడు కూన్ పాండ్యన్ అన్న రాజు పాలించేవాడు. అతడు శ్రమణుల మతంలో కలసిపోయాడు. శ్రమణమతం స్వీకరించి అతడు 'ఎవ్వరూ విభూతి పూయరాదు. రుద్రాక్షలు వేసుకోరాదు' అన్న కట్టడిచేశాడు. రాజుగారి భార్య, రాజుగారిమంత్రీ పరమశివ-ఏకాంతభక్తులు. ఐనప్పటికిన్నీ రాజాజ్ఞ ఏవిధంగా అతిక్రమించడం? రాజు మళ్ళా బుద్ధిమారి శైవమార్గంలోకి ఎప్పుడు వస్తాడా అని బాధపడేవారు. ఇతడు మళ్ళా శివారాధన ఎప్పుడు చేయబోతాడా అని కలవరపడేవారు. ఇట్లా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి జ్ఞానసంబంధులు విజయంచేశారు. వారు శైవాచార్యులు అనబడే నలువురిలో ఒక్కరు. సుబ్రహ్మణ్యస్వామి అపరావతారం. తమ భక్తకోటితో ఒక్కొక్క క్షేత్రమే దర్శిస్తూ మధురానగరానికి వచ్చారు. ఇట్టి శుభసమయానికి ప్రతీక్షిస్తూ కూచున్న రాజమంత్రీ, రాజపత్నీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. వారు సంబంధులకు వార్తపంపి, ఎట్లాగైనా రాజుగారి బుద్ధినిమార్చవలెనని ప్రాధేయపడ్డారు.

సంబంధులు మధురలో ఒకచోట విడిదిచేశారు. వారి రాక ఇష్టపడని శ్రమణులు, వారి విడిదికి అగ్గిపెట్టారు. దీనిని గమనించి సంబంధులు 'ఈ మంట ఇచ్చటనుండి, రాజుగారి దేహంలో ప్రవేశించనీ' అని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా, ఈశ్వర సంకల్పం మేరకు రాజుకు ఉగ్రమైన జ్వరంవచ్చింది. శ్రమణులు ఎంత శ్రమించినా రాజుగారి జ్వరం తగ్గలేదు. అప్పుడు మంత్రి రాజుగారికి సంబంధుల గొప్పతనం వర్ణించి, వారిని పిలిపిస్తే జ్వరం ఆగిపోతుందని నచ్చజెప్పారు. లోకంలో ఎంత పిడివాదం చేసేవాడయినా, వ్యాధి పరాక్రమం భరించలేని సమయంలో, తన పిడివాదాన్ని కొంతకొంత మార్చుకోవడం వాడుకే. అట్లే వ్యాధి తీవ్రత తాళుకోలేని కూన్ పాండ్యుడుకూడా, రుద్రాక్షలవారినీ బూడిద బుస్సన్నలనూ చూడనన్న తన పట్టును కొంత సడలించి సంబంధులను చూడడానికి సమ్మతించాడు. మంత్రి పరమానందం పొంది సంబంధులను మహా గొప్పగా ఆహ్వానించాడు.

రాజసమక్షంలో శ్రమణులకున్నూ జ్ఞానసంబంధులకున్నూ వాగ్వాదం ఆరంభమైంది. సంబంధులవారు శ్రమణులను చూచి ''మీరు రాజుగారి కుడిభాగంలోని జ్వరం పోగొట్టండి. నేను ఎడమవైపు పోగొటతాను. కానివ్వండి, మీ మంత్రశక్తిని చూపండి అని అన్నారు. మీరు పోగొట్టలేకపోతే మీరోడిపోయినట్లు; నేను పోగొట్టలేకపోతే నేనోడిపోయినట్లు'' అని పన్నిదంచరచి సంబంధులవారు పదికంపాడి రాజుగారి ఎడమభాగానికి విభూతి పూశారు. అంతటితో అభాగములో జ్వరం నిలిచిపోయింది. కాని శ్రమణులు ఎంత శ్రమించినా పని జరగకపోయింది. అంతటితో శ్రమణులు 'మీరుకుడితట్టుబాగుచేయండి; మేము ఎడమతట్టు బాగుచేస్తాం' అనిమళ్ళా సంబంధులతో పందెం వేశారు. సంబంధులవారు సరే అనగా, కుదిరిన ఎడమభాగంలోనికి జ్వరం పునఃప్రవేశం చేసింది. కుడిభాగంలో జ్వరం పోయింది.

రాజుగారి జ్వరం సామాన్యమైనది కాదు. అది ఈశ్వర సంకల్పమూలంగా వచ్చిన జ్వరం. అందుచేతనే శ్రమణులకు చెందిన రాజుగారి శరీరభాగం మళ్ళా జ్వరగ్రస్తమైంది. శ్రమణుల చేతకానితనం రూఢి ఐనపిదప సంబంధులు రాజుగారిపై జాలితలచి జ్వరం పూర్తిగా నిమ్మళించేటట్టు చేశారు.

అప్పటికీ శ్రమణులు తమ వోటమిని ఒప్పుకోలేదు. రాజుగారికిన్నీ పూర్ణమైన నమ్మక మేర్పడలేదు. వాదం మళ్ళా ప్రారంభమయింది. సంబంధులు వాదాని కుపక్రమించేముందు శివాలయానికి వెళ్ళి 'ఈ వేదనిందనూ, యాగనిందనూ చేసే శ్రమణులను జయించి నీ ప్రతిభ సర్వవ్యాప్తమయ్యేటట్లు అనుగ్రహించు' అని ఈశ్వరుణ్ణి వేడుకొన్నారు.

వాదం మళ్ళా ప్రారంభమైంది. సంబంధులవారన్నారు; ''మీసిద్ధాంతాన్ని ఒక తాటాకుమీద వ్రాసి వైఘానదిలో వేయండి. నా సిద్ధాంతాన్ని వ్రాసి నేనూ వేస్తాను. ఇందులో ఏది ప్రవాహానికి ఎదురీత ఈదగలదో అదే సత్యమైనసిద్ధాంతం'' అని. ఇందులోనూ సంబంధులవారిదే జయం. ఐనప్పటికీ శ్రమణులు ఒప్పుకోలేదు. అదేరీతిని తాటాకులమీద తమతమ సిద్ధాంతాలు వ్రాసి పరీక్షార్థం అగ్నిలో వేశారు. శ్రమణుల తాళపత్రం అగ్నిలో దగ్ధమైపోయింది.  జ్ఞాన సంబంధులు ఈ క్రింది అర్థం కల తమ సిద్ధాంతాన్ని ఆ తాటాకుమీద వ్రాశారు.

''బ్రాహ్మణుల సౌఖ్యంగా వర్థిల్లాలి. దేవతలూ, పశువులూ సుఖంగా ఉండాలి చల్లగా ఉండాలి"               

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...