Wednesday, March 21, 2018

మనుష్య జీవితం- పరమార్ధం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఏబంధాలు లేకుండా ఏకాకి గా తపమాచరించు
ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి
మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు. నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో... అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాటి హితవు ఒకటి ఉండాలి.
ఇంతకీ రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ...........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

దిష్టి మంత్రం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పల్లె ప్రజలు నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు.ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి....థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు.ఆటోలు, లారీల వెనకాల 'బురీ నజర్‌వాలా తెరా మూహ్‌ హో కాలా' (దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా!) లాంటి వాక్యాలు రాస్తారు.'ఎవరి చూపు పడిందో ? పాడు కళ్లు,పాపిష్టి కళ్ళు వామ్మోఅని భయపడతారు.షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని, అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట.దృష్టిదోషం ,చెడుచూపు ,దయ్యం చూపు ,దిష్టి కి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు,నల్ల తాడు, నిమ్మకాయల దండ,పసుపు, సున్నం కలిపిన నీళ్లు,ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ,తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ,కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ,చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క,పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క,మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు,ఈతాకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని ఏడుమార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు లిఖించిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలోకట్టటం లాంటివి చేస్తారు.

ఈ విధంగానే కాక పసిబిడ్డలకు విబూదిని నుదుట శరీరం పైన రాస్తూ కింద ఇచ్చిన మంత్రం చదువుతూవుంటే కూడా మంచి ఫలితం ఇస్తుంది అంటారు.

*వాసుదేవో, జగన్నాధో, పూతనాతర్జనో హరిః*
*రక్షతు త్వరితో బాలం ముంచముంచ కుమారకం.*
*కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన*
*ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయో.*

*మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన*
*యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి,*
*బాలగ్రహాన్విశేషణ ఛిందిఛింది మహా భయాన్*
*త్రాహిత్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం.*

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ .......

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరమాత్మ-జీవాత్మలకు భేదం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అజోపి సన్నవ్య యాత్నా భూతానా మీశ్వరోపి సన్
ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవా మ్యాత్మమాయయా
భావం: నేను నిర్వికార నిరంజనుడైనను, చావు పుట్టుకలు లేనివాడనైనను అన్ని భూతములకు అధికారినైనను, నా మాయను వశము చేసికొని నా మాయవలన పుట్టుచున్నాను.
దీనిని బట్టి భగవానులకు సాకార నిరాకారములు రెండును గలవని రూఢియగుచున్నది. ఒక నాణెమునకు రెండు ప్రక్కలున్నచో అట్లే భగవానులు రెండు స్థితులతో ఎప్పుడు ఉన్నట్లు తెలియబడుచున్నది.

శ్రీరామకృష్ణ పరమహంస గురువునకు ఎరుక పడజేయదలచెను. తోతాపురి తన ఇష్టం వచ్చినప్పుడు సమాధిలో నుండగల స్థితిని సంపాదించి యుండెను. సమాధిలో ఉన్నప్పుడు అతడు బాహ్య ప్రపంచమును మఱచు చుండెను. ఒకనాటి రాత్రి తోతాపురి అమితముగా బాధపడుచుండెను. కూర్చుండినను, మరల లేచి నిలువబడినను, మరల పరుండి ఉన్నను అతని బాధ పోలేదు. ఆ సమయమున తన మనస్సును బ్రహ్మముపై ఏకాగ్రత పరచి దేహబాధను మరచుటకు తలపోసికొనియెను. కానీ మనస్సును ఆ స్థితికి తీసికొని వచ్చుటకు ముందే, మనస్సు జారి, దేహబాధను మరపించలేక పోయెను. ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను నిష్ఫలమయ్యెను. దేహమును గురించి విసుగుపడి ‘‘ఈ పాడు దేహ సంబంధముచేత మనస్సు కూడ వశము కాకున్నది. ఈ దేహముతో సహవాసము చేసి నేనేల బాధపడవలయును? ఈ దేహమును మోయుట వలన నేమి ప్రయోజనము? కావున దీనిని గంగానది కర్పించి, బాధలను తుదముట్టజేసెదను’’ అని రూఢి పరచుకొని, తోతాపురి మనస్సును పరబ్రహ్మయందు చేర్చి గంగానదిలో దిగుటకు జొరబడెను. ఏమి ఆశ్చర్యము? ఎంత దూరము నడిచినను, గంగానది జలములు మోకాళ్ల నైనను తడుపలేదు. అవతలి ఒడ్డుకు చేరెను. ఆ రాత్రి గంగ ఎండి పోయినదా ఏమి? అర్ధరాత్రి సమయము. అవతలి ఒడ్డున ఇండ్లు, చెట్లు నీడల వలె నిలువబడి ఉండుట చూచెను. చకితుడై అతడిట్లు తలచెను. ‘‘ఈ రోజున నేను మున్గుటకు కావలసినంత జలమైనను లేకపోయెనేమాయాబల మింతయని చెప్పగలమా? భగవంతుని లీలచెంత చిత్రములు’’ అంతలోనే తన చుట్టుపక్కల ఎటు చూచిననూ జగన్మాద యగుకాళీ స్వరూపమే కనపడుచుండెను. ఆ జ్యోతిర్మయి ముఖమండలము చేతనే దిగంతరాళములు నిండి యుండెను. తన జీవిత కాలమంతయు బ్రహ్మమును గురించి ధ్యానించుచుండెనో ఆ బ్రహ్మమే ఈనాడు జగన్మాత అయ్యెను. మరల యథాస్థానమునకు చేరి తోతాపురి అగ్ని రగిల్చి చలికాచుకొనుచు కాళీ ధ్యానానంద నిమగ్నుడై యుండెను. ప్రాతఃకాలమయ్యెను. ఈ జరిగినదంతయు సవిస్తరముగా పరమహంస గారికి తెలియజేసెను. శ్రీరామకృష్ణ పరమహంస గారు చిరునవ్వు నవ్వి ఆ మా అమ్మను విశ్వసింపుమని చెప్పగా నీవు నమ్మనంటేనే నన్ను కూడా నమ్మవలదని చెప్పితివే ఇప్పుడు చూచితిమా? మాయమ్మ నిజమో! అబద్ధమో! బ్రహ్మము, శక్తి ఈ రెండును వేరుచేయబడునని కాననియు, అగ్ని, దాని యుష్ణమువలె ఉండుననియు మా యమ్మ చాలాకాలము నాడే బోధించినదిలే’’ యని తోతాపురికి చెప్పెను. కావున సాకార నిరాకారములు వేరుచేయబడనివని ఊహింపవలెను.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ............

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

హృదయార్పణం

🕉🕉🕉🕉🕉🕉🕉✡🕉🕉🕉🕉🕉🕉🕉
*మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.*
*పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.*
*ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?*
*ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.*
*భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.*
*కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.*
*పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.*
*అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.*
*పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!*
*నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?*
*అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?*
*నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?*
*పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?*
*నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?*
*ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?*
*గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా?*
*ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి?*
*నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు?*
*మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?*
*నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా?*
*జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?*
*నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు?*
*విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా?*
*అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?*
*అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి?*
*వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'*
*ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు.*
*భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే.*
*వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.*
*అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.*
*నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.*
*వస్తువులు అంతకన్నా కావు.*
*ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు.*
*భక్తితో స్మరిస్తే చాలునంటాడు.*
*కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు.*
*లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.*
*అందుకే....... శంకరభగవత్పాదులు-*
*'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది.*
*అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.*
*భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.*
*క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.*
*అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.*
*దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.*
*సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.*
*'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు.*
*కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి.*
*షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.*
*సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది.*
*కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.*
*నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!'*
*అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.*
*అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.*
*భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.*
*అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.*
*హృదయార్పణమే పూజ.*
*నిశ్చల ధ్యానమే భక్తి*
*అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!
Written by _
గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !


                ఓం గం గణపతయే నమః

    పరమ శివుని పూజలందుకున్న మహా గణపతి

వినాయక చవితి ప్రతీ ఏటా మనం హిందూ పంచాజ్ఞం ప్రకారం భాద్రపద శుక్ల చవితి నాడు జరుపు కోడం అనాదిగా హిందువులకు వస్తున్న ఆచారం . వినాయక చవితిని భారత దేశ వాసులు జాతి మత  బేధాలు లేకుండా జరుపుకుంటారు అంటే అతిశయోక్తి కాదు . పెద్ద బొజ్జ , ఏనుగు తల , గుజ్జురూపం , ఎలుక వాహనం గా గల  వినాయకుడు భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పూజలందు కుంటున్నాడు . విదేశాలలో ఎలిఫెంట్ హెడ్ గాడ్ అని హిందూ బుద్ధ అని పిలుస్తూ వుంటారు . పరమేశ్వరుడు గణాసురుని తపస్సుకి మెచ్చి అతనికి సత్వ , తమో , రజో , గుణాల వలన జన్మించిన వారినుండి మరణము లేనట్లు వరం పొందుతాడు . గణాసురుని వధించేందుకు వినాయకుని పార్వతీ దేవి నలుగు పిండితో తయారు చెయ్యడం , తరువాత శివుని కోపానికి గురై శిరస్సు ఖండించబడి పార్వతీ దేవి అభ్యర్ధన మేరకు శివుడు గజాసురుని తలను వినాయకునికి అతికించి ప్రాణం పోయడం మనకందరికీ తెలిసినదే .

విద్యకి , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు . ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజ లందుకోనేది వినాయకుడే అనడంలో అతిశయోక్తి కాదు . మనస్సులో తలచుకున్నంత మాత్రాన విఘ్నాలు తొలగించి విజయాన్ని చేకూర్చే దేముడు అనడం లో తప్పులేదు . వినాయకుని పుజించేవారికి అనేక శక్తులు సిద్ధిస్తాయి .

వినాయకుని అధీనం లో తంత్ర విద్యలైన అభిసార విద్యలో ఆరు రకాల దుష్ఠ శక్తులు కుడా వున్నాయి . అందుకే వసీకరణం  , చిల్లంగి మొదలయిన దుష్ఠ శక్తుల ఉపాసకులు వినాయకుని పూజించి  యీ శక్తులను పొందుతారు  .  వినాయకునిది చిన్నపిల్లల మనస్తత్వం గా వర్ణిస్తారు .

భరత ఖండం లో శైవం , వైష్ణవం , బౌద్ధం వీటితో పాటు భ్రామ్యం ( భ్రహ్మ ని మాత్రమే పూజించేవారు ) , గణపత్యం ( గణపతి ని మాత్రమే పూజించే వారు )  కుడా ప్రాచుర్యం లో ఉండేవి . ఆరవ శతాబ్దం లో యీ గణపత్యం ప్రాచుర్యంలోకి వచ్చి తొమ్మిదవ శతాబ్దం లో రాజుల ప్రాపకం సంపాదించిందని శ్రీ ఆనందగిరి గారు తన  ' శంకర దిగ్విజయం ' లో రచించేరు . పదవ శతాబ్దంలో వినాయకుని ప్రత్యేకంగా కోవెల నిర్మాణాలు జరిగేయి . అలా నిర్మితమైన   మందిరాలలో ముఖ్యం గా చెప్పుకోతగ్గవి మహారాష్ట్ర లోని అష్ఠ గణపతుల మందిరాలు , తిరుచురాపల్లి లో వున్న ' ఉచ్చి పిళియార్  ( ఉచ్ఛ వినాయకుడు ) ' .  గణపత్యం అవలభించేవారు మహా గణపతి సృష్ఠికి ముందు నుండి ప్రళయాంతం తరవాత కుడా వుండే మహా శక్తి అని నమ్ముతారు .

యీ గణపత్యం దక్షిణ భారత దేశం నుంచి పశ్చిమ భారత దేశం వరకు ప్రాకి పేష్వాల పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం వున్నప్పుడు , పెష్వాలు వినాయకుడిని యిష్ఠ దైవం , కుల దైవంగా పూజించేవారు .

మహారాష్ట్ర లో వినాయక చవితి పూజలు దేశ విదేశాలలో ప్రసిద్ది అని మనందరికీ  తెలిసినదే .  అలాంటి మహారాష్ట్ర లో అష్ఠ గణపతులు కొలువై వున్నారు .  యీ అష్ఠ గణపతులు స్వయంభూగా వలిసినవే . ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్ఠాదశ శక్తి పీఠాలు లాగే  అష్ఠ గణపతులు కుడా  .

అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద ధేయూర్, ఒజార్ వద్ద విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలు. ఈ ఎనిమిది అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలంనాటివి. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంధాలైన గణేష మరియు ముద్గాల పురాణాలలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల శిల్ఫశైలి ఎంతో అందంగా ఉంటుంది. ప్రతి హిందూ మతస్తుడు తన జీవితంలో ఆనందాలను అదృష్టాలను పొందేందుకు కనీసం ఒకసారైనా ఈ అష్టవినాయకుల ఎనిమది దేవాలయాలు దర్శించి తరించవలసిందే. ఈ దేవాలయాలన్నింటికి ఒక ఉమ్మడి అంశం ఏమంటే, వాటిలో ప్రతి ఒక్కటి స్వయంభూ దేవాలయమే.

🌹 *1. సిద్ధి వినాయక దేవాలయం* 🌹

గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము కూడి వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్ధాటెక్ వద్దగల సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనపడుతుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత అంటే, ప్రదక్షిణం. పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది.

🌹 *2. మయూరేశ్వర దేవాలయం* 🌹

మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. సమీపంలో పెద్ద దీపమాల అంటే ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

🌹 *3. బల్లలేశ్వర దేవాలయం* 🌹

బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అన్ని దేవాలయాల వలే కాక ఈ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.

🌹 *4. గిరిజాత్మజ దేవాలయం* 🌹

గిరిజాత్మక దేవాలయం గుహలు కల ఒక కొండ పైభాగాన కలదు. దీనిని దర్శించాలంటే 300 మెట్లు ఎక్కాలి. కష్టమైనప్పటికి పైకి వెళితే అక్కడి అందచందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.

🌹 *5. చింతామణి దేవాలయం* 🌹

చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి రూపం కలిగి ఉంటాడు.

🌹 *6. విఘ్నేశ్వర దేవాలయం* 🌹

ఓజార్ వద్ద గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరం బంగారంతో తయారు చేయబడ్డాయి. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగాంవ్ మరియు జున్నార్ ల నుండి ఓజార్ 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలలో చేరవచ్చు.

🌹 *7. మహాగణపతి దేవాలయం* 🌹

మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దదిగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇది రంజన్ గాంవ్ లో కలదు.

🌹 *8. వినాయక దేవాలయం* 🌹

చివరగా, మహాడ్ గ్రామంలో వరద వినాయక దేవాలయం కలదు. ఈ దేవాలయ విగ్రహం ఒక సరస్సు ఒడ్డున లభిస్తే దానిని దేవాలయంలోపల ప్రతిష్టించారు. నేడు మనం చూసే వరద వినాయక దేవాలయం వాస్తవానికి పేష్వా పాలకులచే పునరుద్ధరించబడిన దేవాలయం.

🕉🕉🕉🕉🕉🕉

Saturday, March 17, 2018

ఆడవారు బయట ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకోవచ్చా?

ఈమధ్యకాలంలో ఇది సాధారణ విషయం అయిపొయింది కానీ ఎన్నో ఏళ్ళ నుండి మన సాంప్రదాయం తప్పని చెబుతోంది. ఇందుకు సంబంధించిన వివరణ.
శ్రీమద్భాగవతంలో ఆరవ స్కంధంలో వివరింపబడిన ప్రకారం పూర్వం ఒకసారి ఇంద్రుడు త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని చంపినప్పుడు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. అప్పుడు ఇంద్రుని పాపాన్ని నలుగురు పంచుకుంటామని ముందుకు వచ్చి అతడిని బ్రహ్మహత్యాపాతకాన్నుండి విముక్తి కలిగించారు. స్త్రీ-భూ -జల- ద్రుమైర్ వలన తనకు విముక్తి కలిగిందని చెప్పుకుంటాడు. ఇందుకు ఈ నలుగురికి కొన్ని వరాలను ఇస్తాడు. ఇవే వివరాలను గరుడ పురాణం, దేవీభాగవతం, తైత్తరీయం ఇంకా మరెన్నో పురాణ వాన్గ్మయాలలో చెప్పి వున్నారు.
1. తాను తీసుకున్న బ్రహ్మహత్యాపాతకం వలన భూమి లో కొన్ని ప్రదేశాలలో జీవరాశి ఉండదు. భూమి బీటలు వారడం, ఎడారులు తయారు అవడం అనేవి భూమి తీసుకున్న దోషం వలన సంప్రాప్తిమ్చాయి. దానికి బదులుగా ఇంద్రుని దగ్గరనుండి తవ్విన చోట మరల పూడుకునేలా వరం పుచ్చుకుంది భూమి.
2. నీటిలో నురగ బుడగలు జలం తీసుకున్నపాపం వలన వస్తుంది అని, దానికి ప్రతిగా దేనిలో అయితే జలం కలపబడుతోందో దాని పరిణామము పెరుగుతుంది అని వరం తీసుకుంది. అందుకుని బుడగలు, నురగతో ఉన్న నీటిని పవిత్రకార్యాలకు ఉపయోగించరు.
3. చెట్లు తాము తీసుకున్న పాపం వలన వాటిలో పాలు స్రవిస్తూ ఉంటాయి, ఏ చెట్టు కొమ్మ అయినా చిన్నగా చిదిమి చూస్తె ఈ పాలు వస్తూ ఉంటాయి, వారిని పుచ్చుకోవడం మానవులకు నిషేధం. ఈ పాపానికి ప్రతిగా ఎప్పుడు తమని తరిగినా మరల ఆ చెట్టు చిగురించాలి అన్న వరం పుచ్చుకున్నాయి వృక్షాలు.
4. స్త్రీలకు తాము తీసుకున్న పాపం వలన నెలలో మూడురోజులు ఆ పాప భారాన్ని భరిస్తామని, అందుకు ప్రతిగా తమకు తమ పతితో స్వర్గసుఖాలు అనుభవించేలా వరాన్ని, అలాగే సంతతిని తాము భరించి వృద్ధి చెయ్యాలన్నా వరాన్ని పుచ్చుకుంటారు.

ఇందువలన ఆ మూడు రోజులు వారు బ్రహ్మహత్యాపాతకాన్ని భరిస్తున్న కాలం కనుక వారికి వంట, పూజా గదులలో ప్రవేశం నిషిద్ధం. మన ఇళ్ళలో వంట చేస్తున్నారంటే అదొక యజ్ఞంగా తీసుకునేవారు. అగ్నిభాట్టారకుడు సాక్షాత్తు అగ్ని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనం పెట్టిన పదార్ధాలను పక్వం చేస్తున్నాడు. ఇదే తలంపుతో రోజు కూడా వంట స్నానం చేస్తే కానీ మొదలు పెట్టారు. మన కడుపులో ఉన్న వైశ్వారనునికి ఇచ్చే హవిస్సును తయారు చేసే అన్నం, ఇత్యాది భక్ష్యభోజ్యాల తయారీ కూడా ఒక యజ్ఞమే. ఇంటి ఇల్లాలు స్నానం చేసి మడి కట్టుకుని ఒక పూజా కార్యక్రమంగా చేసే వంట వలన ఆ ఇళ్ళలో ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉండేవి, ఉంటున్నాయి. కాబట్టి వంట కార్యక్రమం కూడా పూజావిధానంలో ఒక భాగంగా వుంటుంది. దేవునికి నివేదించి కానీ పుచ్చుకునే సాంప్రదాయం లేని సంస్కారం మనది. ఈ కారణం వలన ఆ మూడు రోజులు ఆడవారికి వంటిల్లు, వంట నిషేధం.

మన శరీరంలో మలం ఎన్నో రకాలుగా పోతూ వుంటుంది. కటి ప్రదేశం పైన ఉన్న రంధ్రాల ద్వారా పోయే మలాన్నుండి ఆ భాగాలను కాళ్ళను కడుక్కోవడం వలన పోతున్నాయి. కానీ కటిప్రదేశం నుండి కాళ్ళ వరకు పోయే మలాన్ని శుద్ధిపొందాలంటే మలాపకర్షణ స్నానం చేస్తే తీరుతుంది. ఈ మూడు రోజులు వారు నిత్యం అదే స్థితిలో ఉంటారు, అందువలన శారీరకంగా నీరసంగా ఉంటారు కావున వారికి ఆ మూడు రోజులు విరామం చెప్పింది. ఇన్నాళ్ళు మనకు అన్నీ చేసి పెట్టె వారికి ఆ మూడు రోజులు విరామం తప్పకుండా ఇవ్వాలి. శారీరకంగా నీరసంగా ఉన్నవారికి విరామం, ప్రశాంతత ఇవ్వడం మన కనీస కర్తవ్యం. అందుకు ఆ ఇంటి యజమాని కొంత పూజ అయినా మానేసినా సరే ఇంటి పనులు చేసుకోవాలి. దీపం వెలిగించి గోవిందా గోవింద అనుకున్నా సరిపోతుంది  అంటారు పెద్దలు. రోజు చేసే విధంగా అంతంత సేపు పూజ చెయ్యక్కర్లేదు, కేవలం వంట పని, ఇంటి పని చేసుకుని అందరినీ చూసుకుంటే సరిపోతుందని హితవాక్యం. మాకు కుదరదు అంటూ ఇళ్ళలో కలుపుకుంటే మనకు తెలియని ఎన్నో నెగటివ్ విబ్రేషన్స్ ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. మనం పవిత్రం, మన పూజ పవిత్రం, మనం తీసుకునే అన్న పవిత్రం, దేవుని ప్రసాదం అనుకున్న వారికి ఇవన్నీను. అలాంటివి లేవు ఇది నా సంపాదన, ఈ తిండి నా గొప్పదనం, ఇది నా ప్రసాదం అనుకున్న వారికి ఇటువంటి విషయాలు వర్తించవు లెండి.
ఇందుకే కొందరు ఆచారవంతులు పెద్దలు బయట వండిన వంట కూడా తినరు. కొన్ని చోట్ల బయట తినడం మానలేని పరిస్థితి ఉన్నవారికి కనీసం ఇంట్లోనైనా శౌచం పాటిద్దాం. తరిద్దాం.

ఇంకో విశేషం చెప్పనా...కొందరు సైంటిస్ట్ లు...భోజనంతయారు చేసన కొంతమంది వంటవారి యొక్క మానసిక స్థితి తెలుసుకోగోరి...ఆ వండిన పదార్థాలు magnetic resonance images తీసి చూడగా...శాంతచిత్తంతో వండిన పదార్ధం లో అణువుల అమరిక కీ...అశాంతి తో చేసిన వంట లోని అణువుల అమరికకీ చాలా తేడా ఉందని  తేల్చి చెప్పారు.కనుక మహిళలు వత్తిడి కిలోనయ్యే ఆ సమయంలో వంట మొ.వి చేయకపోవడం ఇంటిలో మిగతావారి ఆరోగ్యానికి మంచిది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...