Saturday, November 22, 2014

నేటి ప్రేమ-పెళ్లి


    ఈరోజుల్లో అందరికీ మంచి చదువు, ఉద్యోగాలు ఉండటంతో చాలా మంది తమ స్వంత అభిప్రాయాలకే ఓటు వేస్తున్నారు. ఇలా సొంత అభిప్రాయం అన్నది ఎక్కువగా పెళ్లి అనే విషయంలో చూపిస్తున్నారు.
                 ఈ పెళ్లి అనే విషయంలో అమ్మాయిలు అబ్బాయిలని ఎలా ఎంచుకుంటారు అంటే ఎక్కువగా వాళ్ల క్లాస్మేట్స్ అయ్యుంటారు. వాళ్లతో గౌరవంగా మాట్లాడేవారు, సౌమ్యులు అయిన వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అదే అబ్బాయిలు అయితే మొదట అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇది నేను తప్పు అని
చెప్పను. ఎందుకంటే మొదటి చూపులోనే కంటికి కనిపించేది అందమే కాని మనసు కాదు కాబట్టి. అబ్బాయిలకి వాళ్ల క్లాసు అమ్మాయిలతో పాటు ఇంకా వాళ్ల కన్నా తక్కువ క్లాసు అమ్మాయిలని ఎంచుకునే అవకాశం ఉంటుంది.ఈ మధ్యకాలంలో కాలేజీలో చేరిన వెంటనే జూనియర్స్ కోసం సీనియర్స్ ఒక వెల్కం పార్టీ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటిలో ఎవరికి ఎవరు అని నిశ్చయం చేసుకుంటారు సీనియర్స్. వీటిలో కడదాకా మిగిలే బంధాలు కొన్నే ఉంటాయి. అప్పటికప్పుడు జీవితం గురించి ఎటువంటి అవగాహన, ప్రణాళికా లేకుండా వేసే మొదటి తప్పటడుగు. అన్నీ తప్పటడుగులే ఉండకపోవచ్చు.. ఏడడుగులు వేసే ప్రేమలు ఉండొచ్చు.
            అందరికి ఒక "అదర్ సైడ్" ఉంటుంది. ఇది పరిచయం మొదట్లో అంతగా బయటపడదు, కాబట్టి పరిచయంలో కొత్తగా ఇద్దరి వైపు నుంచి సర్దుకుపోయే తత్త్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. పరిచయం పెరిగిన తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి కనపడతాయి. ఇద్దరు ఎప్పుడూ వాటి గురించే గొడవ పడటం ప్రారంభమవుతుంది.  బొమ్మరిల్లు సినిమాలో లాగా ఇది వరకు మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు కేవలం తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు అని జెనిలియా బాధపడుతుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరగడం వల్ల ఒకరి  లోపాలు ఇంకొకరికి తెలియడం వల్ల గొడవలు పెరుగుతాయా? తగ్గుతాయా?
                  ఈ మధ్యకాలంలో ప్రేమ అనే మాట అందరి నోళ్లలో నానుతోంది. కాలేజిలో ఈ ప్రేమ అనేది మొదలై అది జీవితాంతం తోడుగా ఉండే బంధంగా మారడానికి ఎన్నో అడ్డంకులు. చదువుకునేటప్పుడు దూరం తెలియకపోవడం వల్ల కొంతమంది ఉద్యోగాలు వచ్చి వేరు వేరు ఊర్లలో ఉండాల్సివస్తే ఆ ఉద్యోగం మానలేరు, అలా అని ఈ బంధాన్ని వదులుకోనూలేరు. ఇక్కడ వాళ్లు పడే మానసిక సంఘర్షణ అంత,ఇంతా కాదు. కొంతమందికి దానిని స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు సాగే మానసిక పరిణతి ఉండదు.     
                ఉద్యోగాల్లో చేరిన తర్వాత మళ్లీ కొత్త పరిచయాలు మొదలవుతాయి. ఇక అప్పుడు ఇప్పటిదాకా ఒకే కాలేజీ ప్రపంచంలో ఉన్నవాళ్లు రెండు రెండు వేర్వేరు ప్రపంచాల్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది పని వల్ల ఒకరు ఇంకొకర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని అనుకుంటారు.ఇంకొంతమంది అనుకుంటారు ఉద్యోగమే కదా ముఖ్యము ప్రేమ కన్నా అని. కాదని అనట్లేదు కానీ జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న వ్యక్తితో  రోజుకు రెండు నిముషాలు కూడా ఖర్చు చేసేంత తీరిక లేకుండా ఉంటారా? అయినా అంతకు ముందు ఎన్నో నిముషాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుని ఉంటారు. ఒకరి పట్ల నిర్లక్ష్యధోరణి వహించకూడదు."take for granted" అని అనుకోవడం తగదు. పెళ్లికి ముందే ఇలాంటి ధోరణి అసలు పనికిరాదు. పెళ్లికి తర్వాత ఉండొచ్చా??అంటే అది వారి అవగాహన మీద ఆధారపడుతుంది. ప్రేమలో విఫలమైనా ఆ ఇద్దరి వ్యక్తులకి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ పెళ్లిలో విఫలమైతే అది జీవితాంతం ఒక మచ్చగా మిగిలిపోతుంది.ప్రేమ స్థానంలో నిర్లక్ష్యం కనిపిస్తుందంటే ఆ బంధం కడదాకా కొనసాగుతుందనేనా??
                     అన్ని అడ్డంకులలోకి మొదటిది, ఇద్దరిని సులభంగా వేరు చేసేది అహం(ఇగో). ఇది ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్లలో ఆడ,మగ అని తేడా లేకుండా ఉంటుంది. లోకజ్ఞానానికి అనులోమానుపాతంగా(proportional) ఈ అహం అనేది పెరుగుతుందేమో అని నా అభిప్రాయం. ఏమీ చదువుకోని ఒక పల్లెపడుచు తన మగనితో నీ చేత నేను మాటలు ఎందుకు పడాలి అని అనగలదా?? అహాన్నీ మనం అదుపు చేయలేమా? ప్రతిదానికి ఇంకొకరు మన పైనే ఆధారపడి బతుకుతున్నారు అనే భావన ఉండకూడదు. ఒకసారి ఎవరో ఒకరు సర్దుకుని మొదట రాజీకి వస్తే, ఇక జీవితాంతం తనే రాజీకొస్తారులే అని ఆలోచించకూడదు. ఏది జరిగినా అంతా నీ తప్పు వల్లే జరిగింది అంటూ ప్రతిసారీ పరనింద తగదు. అప్పుడప్పుడూ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలి తప్పు మనవైపు ఉందా?లేదా? అని. ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడటం కన్నా మౌనం వహించడమే ఉత్తమం. మనకు ఒకరితో స్నేహమే ముఖ్యమైతే చొరవ తీసుకుని బంధం బీటలు వారకుండా చూసుకోవాలి.
                ఇద్దరూ కలిసి జీవించాలి అని అనుకున్నప్పుడు వాళ్ల కుటుంబం సహాయం లేకుండా పెళ్లి అనే
మధురఘట్టాన్ని చేరుకోవడానికి ఇప్పటి యువత సుముఖంగా లేదు. మొదట ఇక్కడ అడ్డంకి కులం. ఇప్పటికీ పల్లెటూర్లలో అగ్రకులాలవారు నిమ్నకులాలవారిని పెళ్లి చేసుకుంటే వాళ్లను వెలివేసి దూరంగా ఉంచుతారు.జీవితాంతం ఇద్దరు తోడుగా ఉండాలంటే కులమే ముఖ్యమా?ఒకవ్యక్తి తన కులంవాళ్లని పెళ్లిచేసుకుంటే తప్ప సంతోషంగా జీవించలేరా?? ఈ కట్టుబాట్లు అనేవి మనిషి మృగం రూపం దాల్చకుండా ఉండటానికి తప్ప జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడానికి కాదని  నా అభిప్రాయం. చాలామంది ఈ కులం బారినపడి విడిపోతున్నారు ఈ మధ్య కాలంలో.
                  అలా విడిపోయిన వారు జీవితాంతం తమ భాగస్వామితో ఎలాంటి అపరాధభావన లేకుండా ఉండగలరా? తరువాతి జీవితాన్ని సంతోషంగా గడపగలరా?? 
ఈ టపాలోని మాటలు కేవలం నా అభిప్రాయాలు మాత్రమే.. ఎవ్వరిని నొప్పించడానికి వ్రాసినవి కావు. ఎవ్వరూ దీనిని పర్సనల్ గా తీసుకోకూడదని మనవి. ఎవ్వరినైనా నొప్పిస్తే క్షమించాలి.
 
GSM 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...