Tuesday, April 24, 2018

దిక్కుల ప్రాదాన్యత

మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.

విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.

1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధలు ఉంటాయి.

2) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం,అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.

3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం

5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.

6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.

7) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.

8) ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.

ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవు లను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

వాస్తు పురుషుని స్ధితి


వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం కృత్తికా నక్షత్రం నందు వ్యతీపాత యోగం నడుచుచుండగా భద్ర కరణముల యొక్క మధ్యభాగమున వాస్తు పురుషుని ఉద్భవం జరిగింది.

స్దిర వాస్తు పురుషుడు:- వాస్తు పురుషుడు అధోముఖంగా శయనిస్తూ ఈశాన్యంలో తల ఉంచి (వాస్తు పురుషుని శిరస్సు) పాదాలు నైరుతి భాగంలో ఉంటాయి. వాయువ్య, ఆగ్నేయ దిక్కులలో భుజాలు, మధ్యభాగంలో వక్ష స్ధలం, హస్తాలు ఉంటాయి. ఈ వాస్తు పురుషున్ని స్ధిర వాస్తు పురుషుడు అంటారు.

చర వాస్తు పురుషుడు:- స్దిర వాస్తు పురుషుడే సూర్య సంచారాన్ని బట్టి చర వాస్తు పురుషునిగా సంచరిస్తాడు. ఈశాన్య దిక్కు నుండి తూర్పుకి సంచరిస్తాడు. వాస్తుపురుషుని ఎడమభాగం అంటే ఎడమవైపుగా తిరిగి శయనించి సూర్యుడున్న రాశిలో పాదాలు ఉంచి దానికి సప్తమరాశిలో తల ఉంచి నాలుగు దిక్కులకు పరిభ్రమిస్తాడు. కన్య,తుల, వృశ్చిక రాశులలో సంచరించేటప్పుడు తూర్పు శిరస్కుడుగాను, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో సంచరిస్తాడు.

తూర్పు శిరస్కుడు:- భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో వాస్తు పురుషుడు తూర్పున శిరస్సు, పడమర పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. కాబట్టి వాస్తుపురుషుని పూర్ణదృష్టి దక్షిణ దిశ యందు, పాదదృష్టి పడమర దిక్కున పడును. అందుచే భాద్రపద, ఆశ్వయుజ, కార్తీకమాసాలలో దక్షిణ, పడమర సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.

దక్షిణ శిరస్కుడు:- మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో వాస్తుపురుషుడు దక్షిణదిశలో శిరస్సును, ఉత్తరాన పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి పడమర దిశలోను, పాదదృష్టి ఉత్తర దిశ గాను ప్రసరిస్తుంది. కాబట్టి మార్గశిర, పుష్య, మాఘమాసాలలో పడమర, ఉత్తర సింహద్వారం కల ఇల్లు కట్టటం మంచిది.

పశ్చిమ శిరస్కుడు :- ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో వాస్తుపురుషుడు పడమర దిశలో శిరస్సును, తూర్పు దిశలో పాదాలు ఉంచి ఎడమపక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి ఉత్తర దిక్కునందు, పాదదృష్టి తూర్పుదిక్కునందు ప్రసరిస్తుంది. కాబట్టి ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో ఉత్తర, తూర్పు సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.

ఉత్తర శిరస్కుడు :- జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలో వాస్తు పురుషుడు ఉత్తర దిశయందు శిరస్సును, దక్షిణ దిశయందు పాదాలను ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణ దృష్టి తూర్పుదిశలోను, పాదదృష్టి దక్షిణ దిశలోను ప్రసరిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలోతూర్పు, దక్షిణ సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

కర్తరీ

భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించి నప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్ర నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు. సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు. అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి.

సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది.

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).

సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ”ప్రారంభమవుతుంది.దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది.సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.

కర్తరీ లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయద్దన్నారు. నాటిరోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి నుంచి, వడగాడ్పు నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి పని వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు.భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు దొల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరనమాట. వేసవిలో మే నెలలో 4,5 తారీకులమొదలు మే 27,28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

కర్తరీలో చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెఱువులు, బావులు, కొలనులు త్రవ్వటం చేయరాదు. మట్టి, కట్టె రాయి పనులు పాడవుతాయి.

కర్తరీలో గృహ ప్రవేశాలు, శంకుస్ధాపన, ఉపనయనం, వివాహం, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

దుష్టదూరా

దుష్టత్వమునకు, దుష్టత్వము కలవారికి దూరముగా నుండునదే శ్రీమాత అని అర్థము.

           లోకహాని కలిగించు పనులు, అట్టి పనులను చేయువారు శ్రీమాత అనుగ్రహము పొందలేరు. శ్రీమాత శిష్టులనెట్లనూ అభివృద్ధి గావించుచుండును. దుష్ట చేష్టల నరికట్టుచుండును. ఆమెకు పక్షపాత బుద్ధి లేదు. దుష్టులను అరికట్టును. శిష్ణులను రక్షించును. దుష్టు లింకనూ పతనము చెందకుండ కాచును.

          తమ వృద్ధికై తాము పాటుపడువారు శ్రీమాత అనుగ్రహ పాత్రులు. తమ వృద్ధికి, ఇతరుల వృద్ధికీ పాటుపడువారు విశేష అనుగ్రహమును పొందుదురు. తమ వృద్ధికై ఇతరులను దోచుకొను వారు, హింసించువారు, దుఃఖములను కలుగజేయువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రులు కాలేరు.

             దుష్టులు వేరు. దుర్బలులు  వేరు. దుర్బలురను  శ్రీమాత బ్రోచును. వారిది బలహీనతయే కాని దుష్టత్వము కాదు. జీవులు తమ తమ బలహీనతలను అధిగమించుటకే దైవారాధన. శ్రీమాత అట్టివారిని అనుగ్రహించుచుండును. పరిమితత్వమే బలహీనత అట్టి బలహీనత వలన ఏర్పడుచున్న దుఃఖములనుండి రక్షింపబడుటకు భక్తులు ఆరాధన చేయుదురు. వారికి చేయూత నిచ్చుట తన కర్తవ్యముగా శ్రీమాత భావించును.
     మదించి అతిక్రమించుచూ, ఇతరులకు కష్టము, నష్టము, దుఃఖము కలిగించుట దుష్టత్వము. అట్టివారు కూడ శ్రీమాత ఆరాధించుటకు ప్రయత్నింతురు. అట్టివారికి శ్రీమాత దూరముగ నుండును. అనగా వారియెడల సుప్తయై ఉండును. దుష్టులకైననూ బలము శక్తి స్వరూపిణియైన శ్రీమాతనుండి లభించును కదా! అట్టి శక్తితో వారు దుష్కార్యములు చేయుచున్నపుడు వారిని క్రమముగా శక్తిహీనులను చేయును. పదవియందున్నవారికి పదవీచ్యుతి కలుగును. ధనవంతులు దరిద్రులగుదురు. వారి శరీర ఆరోగ్యము నశించి తీరని రోగములకు గురియగుదురు. వారియందలి ఆమె శక్తి వారినుండి దూరము చేయుట ఈ నామమునకు అర్థము. మాట పడిపోవుట, కదల లేకుండుట, కళ్ళు పోవుట ఇత్యాదివన్నియూ వానికి తార్మాణము. అట్టి సమయమున జీవులు తక్షణమే శక్తిహీనులగుదురు. శ్రీమాత దూరమగుట సహింపరాని దురదృష్టము.

'కర్ణవేధ' చెవులు కుట్టించుకోవడం

చెవులం అనగా 'కర్ణవేధ' అను విశేషార్థం కలదు. కర్ణవేధ అనగా చెవులను పోటుతో వేధించడం. చెడు మాటలు విన్నప్పుడల్లా ఆ పోటు గుర్తుకు రావాలి అని అంతరార్థం. కర్ణవేధ చేయించినపుడు పురోహితుడు 'మాశృణు పాప్నానం, మాశ్రావయ పాప్నానం మోచ్ఛారయ పాప్నానం మాచర పాప్నానం మాపశ్య పాప్నానాం' అని చెవిలో చెప్పి బంగారుతీగను ఈ మంత్రంతో ప్రోక్షించి మొదట దైవానికి పురోహితునికి అర్పించి కంసాలికి ఇచ్చి చెవులు కట్టించెదరు.

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.

చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధల్రు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టిం చుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.

ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.

ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొ స్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారు చేయించుకుని ధరిస్తున్నారు.

Tuesday, April 17, 2018

తీర్ధయాత్ర-కాణిపాకం

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా *చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం* భాసిల్లుతోంది. *కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది*.

సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

*క్షేత్రచరిత్ర/ స్థలపురాణం:*

సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

*ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!*

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

*నిత్యం పెరిగే స్వామి:* 

వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

*బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:* 

స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు:మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.

*సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం*

స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550

*సేవాఫలితం*: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500

*సేవాఫలితం*: ‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300

గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58

*సేవాఫలితం:* ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300

*సేవాఫలితం*: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151

*సేవాఫలితం*: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000

*సేవాఫలితం*:

వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116

*సేవాఫలితం*:

చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116

*సేవాఫలితం*:

పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51

*సేవాఫలితం*:

వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

*వసతి.. రవాణా సౌకర్యాలు*: 

కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి.

దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...