Sunday, February 10, 2019

ధర్మబద్ధ జీవనమే అతి పెద్ద పూజ



ఆయనకు వేదమే ప్రమాణం.. ఆయన మాట వేద సమానం.. అందుకే ఆ మాటలు.. ఇంటింటా వినిపిస్తున్నాయి.. మది మదినీ తడుతున్నాయి.. పురాణేతిహాసాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. ఆయనే చాగంటి కోటేశ్వరరావు. తన వచనామృతంతో తెలుగునాట భక్తి ఉద్యమం సాగిస్తున్న ప్రవచన చక్రవర్తి అంతరంగం ‘హాయ్‌’కి ప్రత్యేకం..

యజ్ఞయాగాదులే చేసి మోక్షాన్ని పొందాలని ఎక్కడా లేదు! ‘కలౌ నామ సంకీర్తనః’ అంటారు. ఒక్క నామం చాలు. ఇష్టదైవం నామం పట్టుకున్నా తరించిపోతావు. ‘రామ’, ‘శివ’ నామాలు స్మరిస్తే చాలు. ‘కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకొని పిలిచినా, ఆడుకుంటూ అయినా, గేళి చేస్తూ అయినా, పద్యం చదువుతూనో, పాట పాడుతూనో, గద్యం చెబుతూనో అందులో భగవన్నామాన్ని తెలిసిగానీ, తెలియక గానీ ఉచ్ఛరిస్తే.. అది నీ పాపాలను తొలగిస్తుంది. తరింపజేస్తుంది’ అని భాగవతంలో అజామీళోపాఖ్యానం తెలియజేస్తోంది.
* మీరు భారత ఆహార సంస్థలో ఉద్యోగి. కానీ, ప్రవచనాలవైపు రావడానికి కారణం?
మా నాన్నగారి రక్తం నాలో ప్రవహించడం వల్ల ఇలా వచ్చానేమో. వారికి సనాతన ధర్మంపై, ఆర్ష వాఙ్మయంపై, భక్తితో కూడిన జీవనంపై చాలా అనురక్తి, నిబద్ధత ఉండేవి. అదే నాకు ప్రేరణ. అదే ప్రవచనాల వైపు నడిపించింది.
* చిన్నప్పటి నుంచే రామాయణం, భారతం వంటి పురాణ వాఙ్మయంపై మక్కువ కలిగి ఉండేవారా?
నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల నుంచి పురాణాలపై అనురక్తి ఉంది. తమ్మిరాజు గారని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన మా ఇంట్లో ముందు భాగంలో అద్దెకు ఉండేవారు. తరచుగా వీటి గురించి ప్రస్తావన చేస్తుండేవారు. అలా వాటి మీద నాకు అనురక్తి బాగా స్థిరపడింది.
* చదువుకునే రోజుల్లో సహచరులతో వీటిపై చర్చలు జరిపేవారా?
మాకు ఇలాంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి కోణంతో విద్యా బోధన ఉండేది. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో.. మాకు తెలుగు పాఠం చెప్పేవాళ్లు మంచి విద్వాంసులు. ఉపాధ్యాయుడు నరసింహాచార్యులు గారు, మా ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఎల్‌ సూర్యనారాయణ గారు.. జీవితంలో క్రమశిక్షణతో నడవడానికి ఇవి ఉపయోగపడతాయని ధార్మిక విషయాలను బోధిస్తుండేవారు. ఈ కోణంలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. నాకు సహజంగా ఉన్న అనురక్తికి ఇవి బాగా తోడయ్యాయి.
* సంక్లిష్టమైన విషయాలను అలతి పదాలతో చెప్పగలిగే ధారణ మీరెలా అలవర్చుకున్నారు?
నేను ప్రవచనానికి వెళ్లినప్పుడు నా అంతిమ లక్ష్యం ఒకటే! ప్రవచనానికి ఆర్తితో వచ్చి రెండు గంటల సమయం వెచ్చిస్తున్న వ్యక్తికి నా వల్ల ఏదో ప్రయోజనం కలగాలి. అది కొంతమందికే అందితే.. ఎంతో ఆర్తితో వచ్చిన వారు నిరుత్సాహ పడతారు. అలా జరగకూడదని నేను ఎంత కిందివరకు వెళ్లి అర్థమయ్యేట్టు మాట్లాడొచ్చో.. అంత వరకూ వెళ్లాలనుకుంటా. ఆ తపనే ఎక్కువ మంది ఆదరణకు నోచుకోవడానికి కారణం అయి ఉండవచ్చు.
* ‘మనిషి శిథిల వస్త్రాన్ని విసర్జించి నూతన వస్త్రాన్ని ధరించినట్టే.. ఆత్మ శిథిల దేహాన్ని వదిలి నూతన దేహాన్ని అవిష్కరిస్తుందని గీతలో చెప్పారు. ఆత్మకు చావు లేద’న్నారు. అంటే పునర్జన్మ ఉంటుందనేనా?
సనాతన ధర్మం పునాదులన్నీ పునర్జన్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. ఎంత మంది రక్షకభటులు, ఎన్ని చట్టాలు మనిషిని నియంత్రించగలవు? నేను చేసింది నేనే అనుభవించాలి అనే స్పృహ పాపం చేయకుండా నియంత్రిస్తుంది. ఇతరులను బాధించకుండా, శాంతియుతంగా ఉండడానికి పునర్జన్మ సిద్ధాంతం ఉపకరణమే కదా!
* మన పురాణాల్లో, శాస్త్రాల్లో స్త్రీ-పురుష వివక్ష చూపలేదు.  వీరిద్దరి సంగమమే ఈ సృష్టి అని చెప్పాయి. కానీ, కొన్ని దశలు దాటిన తర్వాత ఎందుకు వివక్ష వచ్చింది? స్త్రీ అనేక విషయాల్లో వివక్ష ఎదుర్కొంటోంది.. ఇదెలా పోవాలి?
మనసులో ఏదో పెట్టుకొని మహిళలను దూరం పెట్టినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇచ్చి గౌరవించాలి. వారిని కాపాడటం కోసమో, భౌతికంగానో, ఇతరత్రా కారణాల చేతనో వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిందయితే.. దానిని సక్రమంగా వివరించి కొనసాగించాల్సి ఉంటుంది.  చటుక్కున వాటిని తీసేయడం కూడా ప్రమాదమే! ఇది రక్షణ కోసం ఏర్పాటు చేసిందని వివరణ ఇవ్వాలి. అది అపోహ అయినప్పుడు, అది మౌఢ్యం అయినప్పుడు దానిని తొలగించి వారి స్థానాన్ని వారికివ్వడమే మర్యాద.
* రామాయణంలో రాముడి ద్వారా సమాజాన్ని చూపించారు వాల్మీకి. అటువంటి రామాయణంలోనూ ఎవరో ఏదో అన్నారనో సీతమ్మను అరణ్యవాసానికి పంపించడంలో ఎటువంటి ధర్మం ఉంది?
చాలాకాలంగా రామాయణంపై జరుగుతున్న చర్చల్లో వస్తున్న ప్రశ్న ఇది. రాముడి మనసులో సీతమ్మ మీద అసలు అనుమానం లేనే లేదు. బాగా ప్రేమ ఎక్కడ ఉంటుందో.. అక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే.. అవతల వారు మానసింగా ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఇవతలి వారు అనుభవిస్తారు. సీతమ్మ మీద అనుమానం ఉంటే రాముడు ఆమెను అయోధ్యకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయడు. కానీ, లోకం సరైంది కాదు.. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అయోధ్యకు వెళ్లిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటే.. సీతమ్మ చాలా బాధపడుతుంది. ఆమెను ఎవ్వరూ ఏమీ అనకూడదనీ, ఆమె అలా బాధపడకూడదనీ.. సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించారు. అగ్నిహోత్రుడు ఆమెను మహాపతివ్రత అన్నారు. ఉత్తరకాండలో సీతమ్మను పరిత్యజించడానికి ముందు.. ఒక గూఢచారి వచ్చి సీతమ్మను ఇలా అంటున్నారని రామునితో చెప్పాడు. రాముడు వెంటనే నిర్ణయం తీసుకోలేదు. మిత్రులతో మీరేం అనుకుంటున్నారని అడిగాడు. మిత్రులు కూడా గూఢచారి చెప్పిన మాటకు అనుకూలంగానే మాట్లాడారు. ఇది ‘ఇవ్వాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆమె గర్భవతి. ఈ మాట రేపు అంతఃపురానికి వస్తుంది. చెలికత్తెలు ఏం మాట్లాడుకుంటున్నా.. నా గురించేనేమో అని సీత అనుకొని బాధపడుతుంది. మానసికంగా కుంగిపోతే సంతానం తేజోవంతంగా ఎలా పొందగలుగుతుంద’ని ఆలోచించాడు రాముడు. ఆమె ప్రశాంతంగా ఉండి సంతానం కనాలని వనాలకు పంపించాడు. సీతారాములు రెండు కాదు ఒక్కటే అని సీతమ్మే చెప్పింది. రామాయణం సహృదయంతో అర్థం చేసుకుంటే.. రాముడెప్పుడూ సీతమ్మను వదిలిపెట్టేయలేదన్న విషయం మనకు దృఢంగా అర్థమవుతుంది. అందుకే సీతమ్మ భూమిలోకి వెళ్లిపోతే.. రాముడు సరయూలోకి వెళ్లిపోయాడు. ఇంక రాముడు సీతమ్మను వదిలేశాడన్న ప్రశ్నే రాదు. అదే నిజమైతే నేటికీ పెళ్లిపత్రికలపై సీతారాముల బొమ్మలు వేసి, వారి శ్లోకాలను ఎందుకు అచ్చు వేయిస్తా?.
* రామాయణం కంటే భారతం ముందు జరిగిందని కొందరంటారు. కానీ శాస్త్రం ప్రకారం రాముడు ముందు.. కృష్ణుడు తర్వాత అంటారు. మీరు దీన్నెలా వివరిస్తారు?
ఇతిహాసం అంటే... ఇది ఇట్లే జరిగిందని అర్థం. ఇక ఇందులో అనుమానాలేం లేవు. రామాయణ కర్త వాల్మీకీ రామాయణంలో భాగం. భారత కర్త వ్యాసుడు భారతంలో భాగం...  వాళ్లు రాసిన ఈ రచనల్లోనే రామాయణం త్రేతాయుగంలో జరిగిందని చెప్పారు. మహాభారతం ద్వాపర యుగంలో జరిగిందని రాశారు. అంటే రామా అవతారం తర్వాత... కృష్ణావతరం.
* చాతుర్‌వర్ణ వ్యవస్థలో చెప్పేందేమిటి? ఇప్పుడు కులాల పేరుతో జరుగుతోందేమిటి?
గుణాలతో ఎవరు ఏదైనా కావచ్చు. విశ్వామిత్రుడు రాజు. బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణమే అంగీకరించిందిగా! ఇక సంకుచిత ప్రయోజనాలు, అధికారం ఆశించే వాళ్లు మనుషులను విభజించి లబ్ధి పొందడానికి చూస్తుంటారు. వారి గురించి వ్యాఖ్యానించను.
* ఎంతో ఆడంబరంగా, బాగా ఖర్చు పెట్టి కొందరు పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే దైవం మనల్ని కరుణిస్తాడని నమ్మకంతో ఉంటారు. ఇలా గొప్పగా చేస్తేనే  ఫలితం ఉంటుందంటారు కొందరు. వీరికి మీరిచ్చే సలహా?
ప్రపంచంలో ప్రతీ ఒక్కటీ దేవుడు సృష్టించినవే కదా! మరి అన్నీ ఆయనవే అయినప్పుడు మనల్ని ఎందుకు అడుగుతాడు? ఫలానా ఉపకరణం సమర్పించి పూజ చేస్తేనే మిమ్మల్ని అనుగ్రహిస్తానని ఎందుకు చెబుతాడు. భగవంతుడు పూజలో మనసు అడిగాడు. ధర్మబద్ధంగా బతకడమే అతి గొప్ప పూజ. అరగంటో, గంటో పూజ చేస్తావు. మరి 23 గంటలు అధర్మంగా బతికితే భగవంతుడు అనుగ్రహిస్తాడా? దేవుడు చెప్పింది మనం ఆచరిస్తే ఆయన సంతోషిస్తాడు గానీ... ఏవేవో సమర్పించి పెద్దపెద్ద పూజలు చేస్తే అనుగ్రహించడు.
* పెళ్లి అంటే ఆడంబరాలేనా? కొందరు లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నారు. పెళ్లి చేయటానికి ఏ రకమైన విధానం ఉండాలి?
పెళ్లిలో ఆడంబరం అనే పదానికి స్థానం లేదు. వివాహ క్రతువు దాన్ని కోరలేదు. పెళ్లిద్వారా గృహస్థాశ్రమంలోకి వచ్చి ధార్మికమైన సంతానాన్ని పొందాలి. తన కామాన్ని ధర్మంతో ముడివేయాలి. ధర్మపత్నిని స్వీకరించి సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. దంపతుల మధ్య ఉండవలసింది అవగాహన. ఇద్దరు సమాజంలో ఆదర్శవంతంగా బతకాలి.  ఇంత పవిత్రమైన వివాహ క్రతువుకు ఇన్నివేలమంది రావాలి.. యాభై వంటకాలుండాలి.. ఇన్ని పట్టుచీరలు, ఇంతబంగారం పెట్టాలి.. అని ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు. మీదగ్గర చాలా డబ్బు ఉంటే మీ అమ్మాయి పెళ్లి చేసి.. మిగిలిన డబ్బుతో పేదమ్మాయి పెళ్లిచేసి ఆదర్శంగా ఉండమంటాను.
* ఈ మధ్య యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. దీనికి కారణం వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేకపోవటమా? నైరాశ్యమా?
దీనికి పిల్లలను మాత్రమే అననక్కర్లేదు. తల్లిదండ్రులు, బంధువులు, సమాజం, విద్యాలయాలు, ప్రభుత్వం.. అన్నింటికీ సమాన భాగస్వామ్యం ఉందంటాను. సీతమ్మ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో.. పాండవులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. నెల్సన్‌ మండేలా ఎన్ని బాధలు పడ్డాడో.. అయినా వీరంతా బతికి చూపించారు కదా. కష్టాలు పడనివాడెవ్వడూ ఉండడు. పిల్లలకు అబ్దుల్‌కలాం జీవితం గురించి చెప్పరు. మహాత్ముల జీవితచరిత్రలు పిల్లలకు అందుబాటులో ఉండవు. పాఠ్యాంశాల్లోకి తీసుకురారు. ఓ పండుగొస్తే మేనమామగానీ, పెద్దనాన్నగానీ మంచి పుస్తకం తీసుకొచ్చి పిల్లలకు ఇవ్వరు. ఇంట్లోవాళ్లు మంచి పుస్తకాలు చదివి భోజనం చేసేప్పుడు పిల్లలకు చెప్పరు. ఎంతసేపు పిల్లలు ఇంటికొచ్చినప్పటి నుంచి 99.9 శాతం మార్కులు వచ్చాయా లేదా అనే ప్రశ్ననే ఉంటుంది. ఆ పిల్లవాడు చదువైతే చదువుకున్నాడు. అయితే జీవితంలో చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోవటానికి మార్గం తెలీదు. అంతలా కూరుకుపోతున్నాడు. ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే.. రామాయణం, భారతం ఛాందసాలు అనటం మానాలి. నెల్సన్‌మండేలా, అబ్దుల్‌కలాం జీవితాలు ఇప్పుడు మా అబ్బాయికెందుకు?అని తల్లిదండ్రులు అన్నన్నాళ్లు ఈ నైరాశ్యం నుంచి పిల్లలు బయటపడే అవకాశం లేదు.


ధర్మం మారుతూ ఉంటుంది. సత్యం ఎప్పడూ ఒక్కలాగే ఉంటుంది. ధర్మాన్ని పట్టుకోగా..పట్టుకోగా చివరికి సత్యంలోకి వెళతాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం ధర్మం. ఉదాహరణకు కొడుకు ముందు నిల్చుంటే తండ్రిలా ఉండాలి. భార్య వద్ద భర్తలా మెసలాలి. ఇది ధర్మం. ఇలా తండ్రిలా, భర్తలా మారుతూ...మారుతూ.. చివరకు ఆత్మగా ఈ మార్పులేకుండా ఉండిపోవడమే సత్యం. ధర్మం... అనుష్టించగా... అనుష్టించగా సత్యం అవుతుంది. ఆ సత్యమే భగవంతుడు.
మనకు దేవతామూర్తులు ఎక్కువ. పూజలు ఒక్కటే. భగవంతుడిని ఏ రూపంలో రమ్మని భక్తుడు అడుగుతాడో ఆ రూపంలోనే వెళ్తాడు. పరమహంస.. ఈ ప్రశ్నకే ఓ మాటంటాడు. ఓ వ్యక్తి చెట్టుమీద ఉండే పురుగు ఎర్రగా ఉందంటాడు. మరొకరు పసుపు అంటాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి పకపకా నవ్వి.. ఆ పురుగు ఊదా రంగులో ఉందని చెప్పాడు. ఈశ్వరుడంతే. ఉన్నది ఒక్కడే. ఎవరికి ఎలా చూడాలనిపిస్తే అన్ని రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడ
రామావతారంలో... రాముడు ఏం చేశాడో మనిషి దాన్ని చేయాలి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తట్టుకొని నిలబడ్డాడు రాముడు. మనిషీ అదే చేయాలి.
కృష్ణావతారంలో... కృష్ణుడు ఏం చెప్పాడో అలా చేయాలి. ఎందుకంటే కృష్ణావతారంలో కొన్ని అద్భుతాలుంటాయి. అవన్నీ మనిషి చేయలేడు. అందుకే కృష్ణుడి మాటలను  అనుసరించాలి.
జోతిష్యం.. వేదాలకు ఉపాంగం. నేత్ర స్థానంలో ఉంటుంది. భవిష్యత్తును దర్శించి... పరిహారం చెబుతుంది. అయితే జోతిష్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా కొందరు చేసేది నాకు నచ్చదు. ఒక వైద్యుడు కుడికాలికి చేయాల్సిన శస్త్రచికిత్స ఎడమ కాలికి చేశాడనకో... అది వైద్యుడి తప్పు... అంతేగానీ వైద్యశాస్త్రం మొత్తంది కాదు. జోతిష్యంలో తప్పు లేదు. జోతిష్యం ఓ శాస్త్రం. దీన్ని ఉపయోగించి సమాజ సంరక్షణకు ఏదీ చెప్పాలో అది చెప్పాలి. తగినంత పరిజ్ఞానం లేకుండా వ్యాపారంగా మార్చడాన్ని నేను సహించను.

Tuesday, February 5, 2019

మాఘ మాసం ప్రారంభం



చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది.

కార్తిక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.

ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.

అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.

అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము,పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ. మహా శివరాత్రి.
WRITTEN BY_ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

Monday, February 4, 2019

వి. వి. గిరి గారు


భారత మాజీ రాష్ట్రపతి, కార్మిక సంఘ నేత, స్వాతంత్ర్య సమరయోధులు.

వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.

ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు  బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒడిషా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య పంతులు
గారు ప్రసిద్ధి చెందిన న్యాయవాది మరియు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాజకీయ కార్యకర్త. గిరి తల్లి సుభద్రమ్మ గారు  సహాయ నిరాకరణ మరియు శాసనోల్లంఘన ఉద్యమాల సమయంలో బెర్హంపూర్లోని జాతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అరెస్టు అయ్యారు..
ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళారు

గిరి తన ప్రారంభ విద్యను ఖలలణ్డ కోట్ కాలేజీలో పూర్తి చేశారు. 1913 లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి ఐర్లాండ్ వెళ్లారు.

మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా, గిరి గారు డబ్లిన్ నుండి లండన్ వెళ్లారు మరియు మహాత్మా గాంధీని కలిసారు.  గిరి గారి ని రెడ్ క్రాస్ వాలంటీర్ గా ఇంపీరియల్ యుద్ధ సమయంలో చేరాలని గాంధీ కోరుకున్నారు. గీరీ గారు  మహాత్మా గాంధీ యొక్క అభ్యర్థనను అంగీకరించారు,
.
 ఈ కాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.

గిరి గారు సరస్వతి బాయిని వివాహం చేసుకున్నారు మరియు ఆ జంటకి 14 మంది పిల్లలు ఉన్నారు.

తను చదువుకునే సమయంలోనే గిరి గారు భారత మరియు ఐరిష్ రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. తోటి భారతీయ విద్యార్థులతో కలిసి దక్షిణాఫ్రికాలోని భారతీయుల పై జరుగుతున్న  వివక్ష గురించి ఒక కరపత్రాన్ని రూపొందించారు. ఈ కరపత్రాన్ని ఆంగయుల ఆధ్వర్యంలోని ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అడ్డుకుంది, దీంతో గిరి గారు మరియు అతని తోటి విద్యార్థుల పై డబ్లిన్ లో  పోలీసుల పరిశీలన పెరిగింది.  ఇంతలో, ఐరిష్ వాలంటీర్ల యొక్క వార్తాపత్రికకు మరియు UCD విద్యార్ధి పత్రిక అయిన ది నేషనల్ స్టూడెంట్ లో అనామక వ్యాసాలు వ్రాయబడ్డాయి.

జేమ్స్ కొన్నోల్లీ, PH పియర్స్ మరియు యువ ఎమాన్ డీ వాలెరా లలో 1916 లో ప్రముఖ రింగ్ నాయకులతో గిరి గారి కి  సంబంధం ఉన్నట్లు అనుమానించ బడింది. 1916 జూన్ 21 న గిరి గారి ని ఐరిష్ బార్ కౌన్సిల్ కు పిలిచారు.  కానీ ఆయన పోలీసుల దాడి నుంచి  తప్పించుకున్నారు.

1916 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత గిరి గారు మద్రాస్ హైకోర్టులో  న్యాయవాదిగా చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యుడయ్యారు, దాని లక్నో సమావేశానికి హాజరై మరియు అనిబీసెంట్ యొక్క హోమ్ రూల్ మూమెంట్ లో చేరారు. మహాత్మా గాంధీ 1920 లో నాన్-కోపరేషన్ మూవ్మెంట్ కోసం పిలుపునిచ్చారు.1922 లో, ఆయన మద్యం దుకాణాల విక్రయాలకు వ్యతిరేకంగా మొదటిసారి అరెస్టు చేయబడ్డారు.

కార్మిక ఉద్యమంలో పాత్ర:
--------------------------------------

గిరి గారు తన కెరీర్ మొత్తంలో భారతదేశంలో కార్మిక మరియు వర్తక సంఘ ఉద్యమానికి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నారు. 1923 లో ఏర్పడిన ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ యొక్క వ్యవస్థాపక సభ్యునిగా  మరియు ఒక దశాబ్దం పాటు దాని కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1926 లో తొలిసారిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గిరి గారు బెంగాల్ నాగపూర్ రైల్వే అసోసియేషన్ ను స్థాపించారు, 1928 లో బెంగాల్ నాగపూర్ రైల్వే కార్మికులకు పునరావృతమయ్యే కార్మికుల హక్కుల కోసం హింసాత్మక సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లను అంగీకరించి, భారతదేశంలో కార్మిక ఉద్యమంలో ఒక మైలురాయిగా పరిగణించాలని బ్రిటీష్ భారతీయ ప్రభుత్వం మరియు రైల్వే కంపెనీ నిర్వహణను బలవంతంగా సమ్మె విజయవంతం చేసింది.

1929 లో గిరి గారు అధ్యక్షుడిగా
ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ITUF) ఏర్పడింది. లేబర్ పై రాయల్ కమిషన్ తో సహకరించే సమస్య గురించి AITUC తో చీలిక వచ్చింది. గిరి గారు మరియు ఐ.టి.యు.ఎఫ్.ఎ నాయకుల ఉదారవాదులు కమిషన్ తో సహకరించాలని నిర్ణయించుకున్నారు, అయితే AITUC దానిని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. 1939 లో ITUF, AITUC తో విలీనం అయ్యింది మరియు 1942 లో రెండవసారి AITUC అధ్యక్షుడిగా గిరి గారు ఎన్నిక అయ్యారు.

1927 లో ఐఎల్ఒ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ లో భారత ప్రతినిధి బృందం యొక్క కార్మికుల ప్రతినిధి గా,  రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో, గిరి గారు భారతదేశంలోని పారిశ్రామిక కార్మికుల ప్రతినిధిగా ఉన్నారు. భారతదేశంలో స్వేచ్ఛాయుత ఉద్యమానికి మద్దతుగా కార్మిక సంఘాలు పాల్గొనడానికి గిరి గారు కృషి చేశారు మరియు భారత జాతీయ కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే AITUC యొక్క అధ్యక్షుడిగా రెండు సార్లు అధ్యక్షత వహించారు.

బ్రిటిష్ ఇండియాలో ఎన్నికల జీవితం
----------------------------------------------------
1934 లో గిరి గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా  అయ్యారు. ఆయన 1937 వరకు సభ్యుడిగా ఉన్నారు మరియు అసెంబ్లీలో కార్మిక మరియు వర్తక సంఘాల విషయాల ప్రతినిధిగా వ్యవహరించారు.

1936 సాధారణ ఎన్నికల్లో, మద్రాస్ శాసనసభ సభ్యుడిగా మారడానికి గిరి గారు బోబిలి రాజాను ఓడించారు. 1937-1939 మధ్య కాలంలో ఆయన సి. రాజగోపాచారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో లేబర్ అండ్ ఇండస్ట్రీకి మంత్రిగా ఉన్నారు.1938 లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జాతీయ ప్రణాళికా కమిటీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1939 లో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని పార్టీగా చేయటానికి బ్రిటీష్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ రాజీనామా చేశాయి. కార్మిక ఉద్యమానికి తిరిగి వచ్చిన తరువాత, గిరి గారి ని అరెస్టు చేసి మార్చి 1941 వరకు 15 నెలల జైలు శిక్ష విధించారు.

క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభాన్ని అనుసరించి, గిరి గారిని 1942 లో బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి ఖైదు చేసింది. ఆయన 1943 లో నాగపూర్ లో జైలులో ఉండగానే ఎఐటియుసి అధ్యక్షుడిగా  ఎన్నికయ్యారు. వేలూరు మరియు అమరావతి జైళ్లలో గిరి గారు తన శిక్షను అనుభవించారు.  గిరి గారు మూడు సంవత్సరాలపాటు జైలులో ఉండి, 1945 లో విడుదలయ్యే వరకు ఆయన సుదీర్ఘ శిక్ష అనుభవించారు.

1946 సాధారణ ఎన్నికలలో గిరి గారు మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు మరియు  ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టారు. గిరి గారి నాన్న గారు, ప్రకాశంగారు సమకాలికులు, ఆజీవ మిత్రులు, ఇద్దరూ న్యాయవాద వృత్తిలో ప్రముఖులు.

దేశ స్వాతంత్య్రం తర్వాత జీవితం:
----------------------------------------------
స్వాతంత్ర్య తరువాత 1947 నుండి 1951 వరకు, గిరి గారు సిలోన్ కు భారతదేశం యొక్క మొట్టమొదటి హై కమిషనర్ గా పనిచేశారు. 1951 సాధారణ ఎన్నికలలో, ఆయన మద్రాస్ రాష్ట్రంలోని పాతపట్నం లోక్ సభ నియోజకవర్గం నుండి మొదటి లోక్ సభ కు ఎన్నికయ్యారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా:
--------------------------------------

పార్లమెంటుకు ఎన్నికైన తరువాత, గిరి గారు 1952 లో లేబర్ మంత్రిగా నియమించబడ్డారు. పారిశ్రామిక వ్యవహారాల తీర్మానం లో గిరి గారి అప్రోచ్ కు మంత్రిగా అతని విధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక సమస్యల పరిష్కారానికి నిర్వహణ మరియు యాజమాన్యం,  కార్మికుల మధ్య చర్చలను గిరి గారి విధానం ప్రస్పుటం చేస్తుంది. అలాంటి చర్చల వైఫల్యం తప్పనిసరి న్యాయ విచారణకు దారి తీయనివ్వదు, కానీ సమాజంలో అధికారుల ద్వారా మరిన్ని చర్చలు జరపాలి. ఏదేమైనా, గిరి అప్రోచ్ కు వర్తక సంఘాలు, కార్మిక సంఘాలు మరియు ప్రభుత్వ వ్యతిరేకతకు మద్దతుగా ప్రభుత్వంతో విభేదాలు మరియు బ్యాంకు ఉద్యోగుల వేతనాలను తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆగస్టు 1954 లో ప్రభుత్వ నుండి గిరి గారు రాజీనామా చేయటానికి దారితీసింది.

1957 సాధారణ ఎన్నికలలో గిరి పర్వతీపురం డబుల్ సభ్యుల నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ (ఇస్లే) స్థాపనలో గిరి గారు ఒక ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 1957 లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులయ్యారు.

గవర్నర్ పదవీకాలం (1957-1967):
--------------------------------------------------

1957-1967 మధ్య, గిరి గారు ఉత్తరప్రదేశ్ (1957-1960), కేరళ (1960-1965) మరియు కర్నాటక (1965-1967) గవర్నర్లు గా పనిచేశారు.

కేరళ గవర్నర్ (1960-1965):
----------------------------------------
1 జూలై 1960 న గిరి కేరళ రెండవ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ గా గిరి గారి యొక్క కేరళ ఆర్థిక అవసరాలు పై  క్రియాశీల పాత్ర వల్ల మూడో పంచవర్ష ప్రణాళికలో అధిక నిధులు కేటాయించటానికి దారితీసింది.  పాలక కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఓటమిలు ప్రభుత్వాన్ని మైనార్టీకి తగ్గించినప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని నిర్ణయించిన తరువాత కేరళ లో రాష్ట్రపతి పాలన విధించాలని గిరి గారు సిఫార్సు చేసారు. 1965 లో జరిగిన ఎన్నికల్లో కేరళ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకి మెజారిటీ లేనందున, మెజారిటీని కట్టబెట్టేందుకు ఎటువంటి భాగస్వామ్యాలు లేనందున, గిరి గారు మళ్లీ అసెంబ్లీ రద్దు చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసారు.

వైస్ ప్రెసిడెంట్ (1967-1969) మరియు యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా (1969)

గిరి గారు 13 మే 1967 న భారతదేశానికి మూడవ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు, ఆయన రెండు సంవత్సరాలపాటు 3 మే 1969 వరకు కొనసాగారు. రాష్ట్రపతి పదవికి పదోన్నతి పొందటం మరియు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన మూడవ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.

3 మే 1969 న రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కార్యాలయంలో మరణం తరువాత, గిరి గారు అదే రోజు acting  అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గిరి గారు రాష్టప్రతి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటానికి జూలై 20, 1969 న రాజీనామా చేశారు. రాజీనామాకు ముందుగా, గిరి గారు acting అధ్యక్షుడిగా, 14 బ్యాంకులు మరియు భీమా సంస్థలను జాతీయీకరించిన ఒక శాసనం ప్రకటించారు.

అధ్యక్ష ఎన్నిక:
---------------------

ఒక కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు సిండికేట్ అని పిలవబడే కాంగ్రెస్ పార్టీ యొక్క పాత గార్డు మధ్య పోటీగా మారింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నీలమ్ సంజీవరెడ్డి ని ప్రెసిడెంట్ అభ్యర్ధిగా సమర్ధించాలని నిర్ణయించుకుంది, వైస్ ప్రెసిడెంట్ అయిన గిరి గారు, రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రి గాంధీ ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, కాంగ్రెస్ శాసనసభ్యులు గిరి గారికి ఓటు వేయడానికి అనుమతించే "మనస్సాక్షి ఓటు" ను ఆమోదించింది. 16 ఆగష్టు 1969 న జరిగిన ఎన్నికలలో, రెడ్డి, గిరి మరియు ప్రతిపక్ష అభ్యర్థి సి.డి.దేశ్ముఖ్ మధ్య పోటీ జరిగింది. దగ్గరి పోరాట ఎన్నికలో వి.వి. గిరి గారు విజేతగా నిలిచారు,

భారతదేశం యొక్క అధ్యక్షుడు:
------------------------------------------------

భారతదేశ అధ్యక్షుడు గిరి సౌత్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియా, సోవియట్ బ్లాక్ మరియు ఆఫ్రికా వంటి 14 దేశాలను సందర్శించారు..

ఆగష్టు 24, 1969 న భారత రాష్ట్రపతిగా గిరి గారు ప్రమాణ స్వీకారం చేశారు.  ఆగష్టు 24, 1974 వరకు పదవిలో కొనసాగారు.

1976 లో భారతరత్న అవార్డుతో సత్కారం పొందారు. వి.వి.గిరి గారు 1980 జూన్ 24న కన్నుమూశారు..

జె.వి. సోమయాజులు గారు

తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటులు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలు అన్నింటిలో నటించారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు గారు.

బాల్యం:
-----------
జె.వి.సోమయజులు గారు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు.
తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. వీరి నాన్న గారు జె.వి. శివరామమూర్తి  ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. వీరి కి అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, రమణమూర్తి నాలుగో సంతానం.

సోమయాజులు గారు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవారు.


రంగస్థలంపై తొలి రోజుల్లో...

సోమయాజులు గారు, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశారు.  అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత సోమయాజులు గారు తన తమ్ముళ్ళు రమణమూర్తి గారు, శ్రీ రామ మూర్తి గార్ల తో కలిసి ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో నాటకాలు పట్టుదలగా, ఉత్సాహంగా వేసేవాళ్ళు.

ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు గారు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, ఆయన అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి రమణమూర్తి గారు
 స్క్రిప్టు చదివి వినిపించేవారు అవన్నీ బాగా గుర్తు పెట్టుకొనేవారు..

తన సోదరుడు రమణమూర్తి తో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధులయ్యారు.
సోమయాజులు  గారి తల్లి శారదాంబ వారిని ప్రోత్సహించింది.

కళాకారునిగా:
---------------------
తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశారు ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు

జె.వి.సోమయాజులు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కుటుంబమంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయినపుడు ఆయన వ్యధ చెందారు. క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), భారత స్వాతంత్య్ర సంగ్రామం, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు.

తన సోదరుడు జె.వి.రమణమూర్తి తో కలిసి కృషి చేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన కన్యాశుల్కం తొలి ప్రదర్శన ఇచ్చారు.

సోమయాజులు గారితో పాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు గారు. దీనితర్వాత ఆంధ్రనాటక కళా పరిషత్తు లో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు. ఆత్మవిశ్వాసం తో పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవారు..

సినిమా రంగం:
--------------------
రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రాధాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు.


ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజం లోనూ వారి ని రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు సోమయాజులు గారి పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, ఆయన నటించడానికి ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన రమణమూర్తి గారు వారి అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించారు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయారు..

రమణమూర్తి గారు మాట్లాడుతూ
" వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు అని అంటారు.

శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కి కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆయన ఆ  సినిమా ను స్వయంగా చూసి, ఇలాంటి వారు మన ప్రభుత్వ అధికారి గా ఉండటం మన అదృష్టం అని, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులు గారి ని నియమించారు.

1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55 ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది. ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు గారు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు గారు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన సేవలు చెప్పుకోదగినవి..

చలన చిత్ర పరిశ్రమలో:
---------------------------------
శంకరాభరణం సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. 'వంశవృక్షం', 'త్యాగయ్య' చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమయాజులు గారి కి మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నారాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా ఆయనకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది. 'సప్తపది', 'పెళ్ళీడు పిల్లలు', 'నెలవంక', 'సితార', 'స్వాతిముత్యం', 'దేవాలయం', 'కళ్యాణ తాంబూలం', 'ఆలాపన', 'మగధీరుడు', 'చక్రవర్తి', 'స్వయంకృషి', 'స్వరకల్పన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'అల్లరిమొగుడు', 'అభినందన', 'రౌడీ అల్లుడు', 'ముఠామేస్త్రి', 'గోవిందా గోవిందా', 'సరిగమలు', 'కబీర్‌దాస్‌', 'భాగమతి' మొదలైన తెలుగు చిత్రాల్లోను, 'ఇదు నమ్మ ఆలు', 'ఒండగానబా.... శ్రీరాఘవేంద్ర' తమిళ చిత్రాల్లో, 'సోపానం' అనే మలయాళ చిత్రంలో, 'ప్యార్‌ కా సింధూర్‌', 'ప్రతిబంధ్' హిందీ చిత్రాల్లోనూ నటించాడు.

టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించారు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించారు.

వారి కి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు.

ఆయన 24 April 2004 లో పరమపదించారు.

బుధ గ్రహ దోష నివారణకు మరకతం(పచ్చ)


రత్నశాస్త్ర గ్రంధం నందు పచ్చలను మరకత మణి, గారుడం, హరిన్మణి, తృణగ్రాహి, పన్నా అని కూడా అంటారు. పెగ్మటైట్ పొరల యందు, ఖనిజ పొరల యందు, ప్రవాహములకు కొట్టుకువచ్చే గుళక రాళ్ళ యందు నెమలి కాంతం రంగులో, నాచు వలె, గరిక వలె, మిణుగురు పురుగులా మెరుస్తాయని చిలక రెక్కలవలె, వివిధ రకాలైన పచ్చలు లభిస్తాయని రత్న శాస్త్ర గ్రంధాలలో వివరించబడింది. దోషాలు లేని, మచ్చలేని పచ్చ దొరకటం కష్టం. పచ్చలకు ఎక్కడైనా కొంచమైన మచ్చలు లేకుండా లభ్యం కాదు. “అత్తలేని కోడలు, మచ్చ లేని పచ్చ” ఉండదని లోకోక్తి. బీటలు, మచ్చలు కనబడకుండా ఒక రకమైన తైలం రాస్తారు.
          ప్రపంచంలో చారిత్రాత్మక ప్రాదాన్యత సంతరించుకున్న పచ్చలు ఈజిప్ట్ గనుల నుండి లభ్యమవుతాయి. దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాలో ఉదయపూర్, ఆజ్మీర్, ఆప్రికాలోని కొలంబియాలలో పచ్చలు లభ్యమగును. పచ్చని ఎండలో సూర్యునికి ఎదురుగా పెట్టిన మంచి ఆకు పచ్చని కాంతితో మెరుస్తూ బంగారం, తెల్లని వస్త్రం పై పెట్టినప్పుడు ఆకు పచ్చని కాంతిని ప్రసరించును కనుక ‘గరుడ పచ్చ’ అని పేర్కొనటం జరిగింది. అధిక వేడి తగిలిన బరువు లో 99 %తగ్గుతుంది. రాపిడి వల్ల విద్యుచ్చక్తి వస్తుంది.
        గరుడ పురాణంలో పచ్చల పుట్టుక గురుంచి ఒక కధ ఉంది. సర్ప రాజు వాసుకి అనే సర్పం, బకాసురుడనే రాక్షసుని యొక్క  చేదు కట్టని (పిత్త కోశం) సంగ్రహించి ఆకాశంలో ఎగిరిపోతుండగా వాసుకిని చూసిన గరుత్మంతుడు ఆ జన్మ శతృత్వం వలన ఆకాశంలో ఎగురుచున్న ఆ సర్పారాజుని డీకొని యుద్దం చేయగా గరుత్మంతుని దాటికి వాసుకి నిలవలేక మలయ పర్వత ప్రాంతములలో ఆ చేదు కట్టని విడిచింది. విడిచిన సమయంలో దేదీప్యమానంగా పచ్చదనంతో వెలిగిపోతున్న ఆ చేదుకట్టలో కొంత భాగం గరుత్మంతుడు త్రాగుతాడు. అదియే మరకతం. త్రాగిన కొంతసేపటికి మూర్ఛ కలిగి, పిదప కొంత బైటికి వదిలి వేయగా అదిపడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడ పచ్చలని పేరు.గరుడ పచ్చ గరుత్మంతునిచే జనియించి నందున విషమును హరింపజేయు శక్తి కలిగి ఉంటుంది.
        మరొక కధ ప్రకారం నలమహారాజు శనిగ్రహ పీడా విముక్తికి విష్ణుమూర్తిని ప్రార్ధించి శివలింగంను ప్రసాదించమని కోరగా మరకత లింగమును ప్రసాదించాడు. నలుడు ప్రతిష్టించిన మరకత లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో  స్వామి వారికి శ్రేష్ఠమైన పచ్చలను ఇవ్వటం జరిగింది. గరుత్మంతుని ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చలు అమిత శక్తి వంతమైనవి.
        చిన్న చిన్న గుంటలుగా ఉన్న పుప్పి దోషం ఉన్న, కాంతిహీనమైన గార దోషం ఉన్న.తెల్లని తెట్టవలే ఉన్న కర్క దోషం ఉన్న పచ్చలను ధరించరాదు. పచ్చను వస్త్రంపైన పెట్టి సూర్య కిరణాలకు ఎదురుగా ఉంచినట్లయితే కాంతి నలుమూలల ప్రకాశిస్తూ వస్త్రం పచ్చగా ప్రకా శించును. పచ్చపైన సున్నపు పొర వేసిన పొరలో నుండి కూడా ప్రకాశించు పచ్చలను ధరించటం ఉత్తమం.
        ఆయుర్వేద శాస్త్రం ప్రకారం  నేల వంకాయ రసంలో గాని, కొండ పిండి వేళ్ళ రసంలో గాని ఒక రోజు నానబెట్టి పచ్చను భస్మం చేసి వాడిన ఛాతీ, నరాల, మెదడు, నోరు, చర్మ వ్యాదులను, జీర్ణ వ్యవస్ధలోని లోపాలను, మందబుద్ధి, పిచ్చిని తగ్గించును. రసాయన శాస్త్రం ప్రకారం ఇది బేరీలియమ్, సిలికేట్ ల సమ్మేళనం వేడికి మార్పు చెందని క్రోమియం ఆక్సైడ్ ఉన్నందున ఈ రత్నాలకు పచ్చ రంగు వచ్చింది. పచ్చ బుద గ్రహానికి సంబందించినది కావున జ్ఞాన శక్తికి, మానసిక ప్రశాంతతకు, వ్యాపారా భివృద్ధికి, ఉన్నత విద్యలను అభ్యసించుటకు విష్ణుమూర్తి ప్రతి రూపమైన పచ్చను ధరించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించును.
           వేదాంతులు, పండితశ్రేష్టులు, సివిల్ ఇంజనీర్స్, పురోహితులు, జ్యోతిష్యులు, ఆడిటర్స్, ఉపాన్యాసకులు, కాలేజీ,స్కూల్స్ నడిపేవారు, పుస్తక వ్యాపారులు, లలితా కళాకారులు, చిత్రా లేఖనం చేసేవారు, న్యాయ వాదులు, రత్న పరీక్ష, హోమియో, అల్లోపతి, ఫిజీషియన్స్ తప్పని సరిగా మోక్షాన్ని కలిగించే పచ్చ రత్నాన్ని ధరించాలి. పచ్చను ధరించిన గణిత శాస్త్రం పైన పట్టు సాధించవచ్చును.పచ్చను ధరించిన క్రీడలలో నైపుణ్యాన్ని, తెలివి తేటలను తడుముకోకుండా వ్యక్త పరచటం, అవతలి వ్యక్తులు ఏది చెబితే విని అర్ధం చేసుకోగలరో అది చెప్పగలిగే వాక్ శుద్ధిని కలిగిస్తుంది. మంచి తెలివితేటలతో వాదోపవాదనలు చేయగలరు. రావణాసురుడు పెద్ద మరకత మణి పైన కూర్చోని భగవంతుని ద్యానం చేసేవాడట.
         జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, వక్రించి ఉన్న లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రు స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న, బుధ దశా అంతర్ధశలలో ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మంధ బుద్ధి కలవారు మరకతమణిని ధరించాలి. మరకతమణి ధరించేటప్పుడు “మహాదేవచ్చ విద్మహే విష్ణు పత్నేచ్చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్”అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన పచ్చను చిటికిన వ్రేలుకు గాని, ఉంగరపు వేలుకు గాని బుధవారం రోజు బుదహోరలో పచ్చ పెసర్లను ఒక కిలో పావు దానం చేస్తూ ధరించాలి.

జాతకంలో_రవిగ్రహ_దోష_నివారణకు_ఆదిత్య_హృదయ_స్తోత్ర_పారాయణం



సూర్యరశ్ని సోకకపోతే చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిష్టగా ప్రతిరోజూ పఠిస్తారో వారికి ఎటువంటి రుగ్మతలు కలగవు. సమస్త గ్రహ దోష నివారణార్ధం ఆదిత్య హృదయం చదవాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల జాతకంలో సూర్య సంబంధిత దోషాలు నివారించుకోవచ్చు. రోగములు తగ్గి పూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయారుచేసిన ఆహారప దార్థములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుశ్యును పెంచే అమోగమైన అక్షర సాధనం అదిత్య హృదయం. ఈ అమోగమైన స్తోత్రరాజాన్ని శ్రీ రామ చంద్రునికి ఆగస్త్యమహర్షి మంత్రాల వంటి మాటలతో వివరించాడు.అదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంధము. శ్రీమద్‌ రామాయణ మహాకావ్యమందలి యుద్దకాండలో 105వ సర్గలో సూర్యభగవానుని స్తుతికి ‘‘ఆదిత్య హృదయం’’ అని నామకరణం చేశారు.

 సంతానం లేనియి ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టు చుట్టు తిరుగుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికి విజయం కలుగుతుంది. కఠిక దారిద్రంచే భాద పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. ఆనారోగ్య రుగ్మతలతో భాదపడుచున్నివారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో భాదపడేవాడు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.

ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోగమైన తపశ్శక్తి కలిగిన రావణసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. రావణుడు చావు లేకుండునట్లు అనేక వరములు పొందడం వల్ల శ్రీరామునకు రావణాసుర వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.దీనితో శ్రీరాముడు చింతాకాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే.

 ఓరామ!నీకు మహీ పవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. మహా పుణ్యప్రదము, జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుషును కులుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశించెదను. దీని వల్ల నీవు యుద్ధమును, రావణున్ని సులభంగా జయించగలవు.

శ్రీరాముడు భక్తితో  ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమాత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ఇచ్చే భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.

1. తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం |
రావణంచాగ్రతో దృష్వా – యుద్దాయ సముపస్థితమ్‌ ||

అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.

2. దైవతైశ్చ సమాగమ్య – ద్రుష్టు మభాగ్యతో రణం |
అర్థము : ఉపగమ్యాబ్రవీ ద్రామ – మగస్త్యో భగవాన్‌ ఋషి: ||

యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

3. రామ రామ మహాబాహో – శృణుగుహ్యం సనాతనం |
యేనసర్వా నరీ న్వత్స – సమరే విజయిష్యసి ||

అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

4. ఆదిత్యహృదయంపుణ్యం – సర్వశత్రువినాశనం |
జయావహం జపేన్నిత్యం – మక్షయ్యం పరమం శుభమ్‌ ||

అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

5. సర్వ మఙ్గలమాఙ్గల్యం – సర్వపాపప్రణాశనం |
చిన్తాశోకప్రశమన – మాయుర్వర్ధన ముత్తమమ్‌ ||

అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.

6. రశ్మిమన్తం సముద్యన్తం – దేవాసురనమస్కృతం |
పూజయస్వ వివస్వన్తం – భాష్కరం భువనేశ్వరమ్‌ ||

అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.

7. సర్వదేవాత్మకో హ్యేష – తేషస్వీ రశ్మిభావన: |
ఏష దేవాసురగణాన్‌ -లోకా న్పాతి గభ స్తిభి: ||

అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.

8. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ – శివ స్స్కన్ధ: ప్రజాపతి: |
మహేన్ద్రో ధనద: కాలో – యజు స్సోమో హ్యపాంపతి: ||

అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు

9. పితరో వసస్సాధ్యా – హశ్శినౌ మరుతో మను: |
వాయు ర్వహ్ని: ప్రజా: ప్రాణా – ఋతుకర్తా ప్రభాకర: ||

అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.

10 ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |
సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||

అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.

11. హరిదశ్వ స్సహస్రార్చి – స్సప్తసప్తి ర్మరీచిమాన్‌ |
తిమిరోన్మథన శ్శంభు – స్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌ ||

అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.

12. హిరణ్య గర్భ శ్శిశిర – స్తపనో భాస్కరో రవి: |
అగ్ని గర్భో దితే:పుత్ర – శ్శంఖ శ్శిశిరనాశన: ||

అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.

13. వ్యోమనాథ స్తమోభేదీ – ఋగ్యజుస్సామపారగ: |
ఘనవృష్ఠి రపాంమిత్రో – విన్ద్యవీథీప్లవఙ్గమ: ||

అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.

14. ఆతపీ మణ్డలీ మృత్యు: – పింగల స్సర్వతాపన: |
కవిర్విశ్వోమహాతేజా – రక్త స్సర్వభవోద్భవ: ||

అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.

15. నక్షత్రగ్రహతారాణా – మధిపో విశ్వభావన: |
తేజసా మపితేజస్వీ – ద్వాదశాత్మ న్నమోస్తుతే ||

అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.

16. నమ: పూర్వాయ గిరయే – పశ్చిమే గిరయే నమ: |
జ్యోతిర్గణానాం పతయే – దినాధిపతయే నమ: ||

అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

17. జయాయ జయభద్రాయ – హర్యశ్వాయ నమో నమ: |
నమో నమ స్సహస్రాంశో – ఆదిత్యాయ నమో నమ: ||

అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

18. నమ ఉగ్రాయ వీరాయ – సారఙ్గాయ నమో నమ: |
నమ: పద్మప్రబోధాయ – మార్తాణ్డాయ నమో నమ: ||

అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

19. బ్రహ్మేశానాచ్యుతేశాయ – సూర్యా యాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ – రౌద్రాయ వపుషే నమ: ||

అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

20. తమోఘ్నాయ హిమఘ్నాయ – శత్రుఘ్నా యామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ – జ్యోతిషాం పతయే నమ: ||

అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.

21. తప్తచామీకరాభాయ – వహ్నయే విశ్వకర్మాణే |
నమస్తమోభినిఘ్నాయ – రుచయే లోకసాక్షిణే ||

అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.

22. నాశయ త్యేష వైభూతం – త దేవ సృజతిప్రభు: |
పాయత్యేష తపత్యేష – వర్స త్యేష గభస్తిభి: ||

అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.

23. ఏష సుప్తేషు జాగర్తి – భూతేషు పరినిష్ఠిత: |
ఏష చైవాగ్నిహోత్రఞ్ఛ – ఫలంచై వాగ్ని హోత్రిణామ్‌. ||

అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.

24. వేదాశ్చక్రతవశ్చైవ – క్రతూనాం ఫల మేవ చ |
యాని కృత్యానిలోకేషు – స ర్వ ఏషరవి: ప్రభు: ||

అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.

25. ఏనమాపత్సుకృచ్ఛ్రేషు – కాన్తారేషు భయేషు చ |
కీర్తయ న్పురుష: కశ్చి – న్నావసీదతి రాఘవ ||

అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.

26. పూజాయ స్వైన మేకాగ్రో – దేవదేవం జగత్పతిత్‌ |
ఏత త్త్రిగుణితం జప్త్వా- యుద్దేషు విజయిష్యసి ||

అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.

27. అస్మిన్‌ క్షణే మహాబాహో – రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వాతదా గస్త్యో – జగామ చ యథాగతమ్‌ ||

అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.

28. ఏత చ్ఛ్రుత్వా మహాతేజా – నష్టోశోకో భవ త్తదా |
ధారయామాస సుప్రీతో – రాఘవ: ప్రయతాత్మవాన్‌ ||

అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.

29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు – పరంహర్ష మవాప్తవాన్‌ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా – ధను రాదాయ వీర్యావాన్‌ ||

అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.

30. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్‌ ||

అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.

31. ఆథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమానా: పరమం ప్రహృష్యమాణ: |
నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచ స్త్వరేతి ||

అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.

Tuesday, January 29, 2019

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞులు, గుప్తదాత, దేశభక్తులు, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, స్వాతంత్ర్య సమరయోధులు.

   
‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ.

భారతీయ పత్రికలను బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణ లోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి.

ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు.  కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు.

1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు గారు అనే పండితులు మద్రాసు నుంచి వెలువ రిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథి నాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య గారు తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట.

జీవిత విశేషాలు:
----------------------------
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు మే 1, 1867 న కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు. తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది.  ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్‌ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచి పెట్టేశారు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి.

అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులు గారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు కామాక్షమ్మ. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది. అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు.

వ్యాపారం:
---------------------

1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్‌ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులు గారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు.

ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవారు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవారు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నారు.

పత్రికా రంగం:
-------------------------
బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్‌ కాంగ్రెస్‌ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది.

1910 లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్‌ ప్రింట్‌ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో  వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్‌ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు.

 కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్‌ సభలకు వెళుతూ గిర్గావ్‌లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు  ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి  ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.

భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్‌ చేరుకున్న తరువాత 1914 లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి.

దేశోద్ధారక :
------------------
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభ దశ నుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను దేశోధ్ధారక అనే బిరుదు తో సత్కరించారు.

ఆంధ్ర గ్రంధమాల:
-----------------------------
 పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్ర గ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు.

ఈ సంస్థ 30 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు గారు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావు గారిని పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.

ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన. కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు.

ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం.  ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు.

రాజకీయాలు:
-------------------------
టంగుటూరి ప్రకాశం గారి కి సమకాలీనుడైన నాగేశ్వరరావు గారు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నారు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు గారు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకరు. నాగేశ్వరరావు గారి పై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

హరిజనోద్ధరణ:
-----------------------
పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాల బాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్‌ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు.

 విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్‌ ఆయన చలవతో ఏర్పడినదే.  అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి. 

విశ్వదాత:
--------------------
నాగేశ్వరరావు గారు అసమాణ దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవారు.. ఆయన ఇంటినుండి వట్టి చేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడారు..

భారతి పత్రిక:
--------------------
1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది.

ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆంధ్ర  ఉద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్‌ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు కూడా పంతులు గారే. పంతులు గారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణ దేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం.

ఈయన...జైల్లోనే "భగవత్గీత" మీద వ్యాసాలు వ్రాశారు..."భగవత్గీత ఒక్క విశ్వాసానికో ఒక్క ధర్మానికో చెందినది కాదు "అని పేర్కొనేవారు.

వీరు కొనుగోలు చేసిన గృహములో జరిగిన ఒప్పందమె శ్రీబాగ్ ఒప్పందం అంటారు. "శ్రీబాగ్" అంటే వీరి గ్రుహము పేరు.గాంధీగారు చెన్న పట్నానికి వచ్చినప్పుదల్లా శ్రీబాగ్ నే వారికి విడిది.

మరణం:
--------------
కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1938లో మరణించారు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన సేవ ఎనలేనిది. వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ గారు పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలను చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు

తమిళనాడు ప్రభుత్వం వీరి గృహానికి చుట్టు పక్కల ప్రాంతాన్ని వీరి గౌరవార్ధం "నాగేస్వరపురం" అని నామకరణం చేసింది.

భారతదేశానికి వీరు చేసిన సేవలకు గుర్తుగా వీరిని "దేశోధ్ధారక నాగేశ్వరరావు గారు" అని సంబోధించి భారత ప్రభుత్వం వీరి ముఖచిత్రం తో పోష్టల్ స్ఠాంప్ ముద్రించినది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...