Monday, February 4, 2019

జె.వి. సోమయాజులు గారు

తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటులు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలు అన్నింటిలో నటించారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు గారు.

బాల్యం:
-----------
జె.వి.సోమయజులు గారు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు.
తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. వీరి నాన్న గారు జె.వి. శివరామమూర్తి  ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. వీరి కి అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, రమణమూర్తి నాలుగో సంతానం.

సోమయాజులు గారు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవారు.


రంగస్థలంపై తొలి రోజుల్లో...

సోమయాజులు గారు, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశారు.  అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత సోమయాజులు గారు తన తమ్ముళ్ళు రమణమూర్తి గారు, శ్రీ రామ మూర్తి గార్ల తో కలిసి ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో నాటకాలు పట్టుదలగా, ఉత్సాహంగా వేసేవాళ్ళు.

ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు గారు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, ఆయన అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి రమణమూర్తి గారు
 స్క్రిప్టు చదివి వినిపించేవారు అవన్నీ బాగా గుర్తు పెట్టుకొనేవారు..

తన సోదరుడు రమణమూర్తి తో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధులయ్యారు.
సోమయాజులు  గారి తల్లి శారదాంబ వారిని ప్రోత్సహించింది.

కళాకారునిగా:
---------------------
తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశారు ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు

జె.వి.సోమయాజులు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కుటుంబమంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయినపుడు ఆయన వ్యధ చెందారు. క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), భారత స్వాతంత్య్ర సంగ్రామం, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు.

తన సోదరుడు జె.వి.రమణమూర్తి తో కలిసి కృషి చేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన కన్యాశుల్కం తొలి ప్రదర్శన ఇచ్చారు.

సోమయాజులు గారితో పాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు గారు. దీనితర్వాత ఆంధ్రనాటక కళా పరిషత్తు లో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు. ఆత్మవిశ్వాసం తో పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవారు..

సినిమా రంగం:
--------------------
రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రాధాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు.


ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజం లోనూ వారి ని రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ గారు ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు సోమయాజులు గారి పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, ఆయన నటించడానికి ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన రమణమూర్తి గారు వారి అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించారు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయారు..

రమణమూర్తి గారు మాట్లాడుతూ
" వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు అని అంటారు.

శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కి కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆయన ఆ  సినిమా ను స్వయంగా చూసి, ఇలాంటి వారు మన ప్రభుత్వ అధికారి గా ఉండటం మన అదృష్టం అని, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులు గారి ని నియమించారు.

1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55 ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది. ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు గారు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు గారు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన సేవలు చెప్పుకోదగినవి..

చలన చిత్ర పరిశ్రమలో:
---------------------------------
శంకరాభరణం సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. 'వంశవృక్షం', 'త్యాగయ్య' చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమయాజులు గారి కి మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నారాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా ఆయనకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది. 'సప్తపది', 'పెళ్ళీడు పిల్లలు', 'నెలవంక', 'సితార', 'స్వాతిముత్యం', 'దేవాలయం', 'కళ్యాణ తాంబూలం', 'ఆలాపన', 'మగధీరుడు', 'చక్రవర్తి', 'స్వయంకృషి', 'స్వరకల్పన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'అల్లరిమొగుడు', 'అభినందన', 'రౌడీ అల్లుడు', 'ముఠామేస్త్రి', 'గోవిందా గోవిందా', 'సరిగమలు', 'కబీర్‌దాస్‌', 'భాగమతి' మొదలైన తెలుగు చిత్రాల్లోను, 'ఇదు నమ్మ ఆలు', 'ఒండగానబా.... శ్రీరాఘవేంద్ర' తమిళ చిత్రాల్లో, 'సోపానం' అనే మలయాళ చిత్రంలో, 'ప్యార్‌ కా సింధూర్‌', 'ప్రతిబంధ్' హిందీ చిత్రాల్లోనూ నటించాడు.

టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించారు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించారు.

వారి కి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు.

ఆయన 24 April 2004 లో పరమపదించారు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...