Saturday, October 6, 2018

సత్య అన్వేషణ


ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.

"ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి.

చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు. చిరాకుకు కారణం పనిలేని చిత్త వృత్తి. కనుక అది ఒక విధమైన వ్యాధి వంటిది.

దానిని‌ నివారణ చేసుకొన్న వాడికి తప్ప మిగిలిన వారికి తన నిత్య జీవితం కూడా ఇబ్బందులతో నడుస్తుంది. ఇక మహాకార్యాలు సాధించడం అనేది ఉండదు.

" నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించటం సత్యం కాదు. కనుక అది ఎన్నటికి జరుగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకొని, ఉండవలసిన సంబంధం ఏర్పరుచుకుంటే నీవు వాళ్ళని, వాటిని మలచ గల్గుతావు.

నీ కన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే, నీవు నీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అడుగుజాడలలో నడవాలి

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ ...............✍

అంతర్యామి

భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడంటారు. అటువంటి ‘భక్తి’ అని దేన్ని అంటారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. భగవంతుడికి ప్రీతి కలిగించాలనే సంకల్పంతో భక్తులు నిత్యం పూజలు, జపాలు, ఇతర దైవకార్యాలన్నీ చేస్తుంటారు. అవన్నీ భక్తి పరిధిలోకే వస్తాయా అన్నది సందేహమే!
భక్తుణ్ని భగవంతుడు అనుగ్రహించాడని ఎలా తెలుస్తుంది? తన భక్తులైన ప్రహ్లాదుడికి, గజేంద్రుడికి, అలాగే మరికొందరికి కష్టాలు   వచ్చినప్పుడు ఆయన ఆదుకున్న కథలు అందరికీ తెలుసు. సర్వసహజంగా ఇతరులెవరికీ అంతటి కష్టాలన్నీ వచ్చే అవకాశం లేదు. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు జాగ్రŸత్తలు తీసుకుంటారు. అడుగులు వేయడం తెలిసిన పసివాణ్ని ఆదుకునే అవసరం ఎవరికీ ఉండదు. నడవలేనివారికే సాయం కావాలి. మనిషి శక్తికి మించిన కష్టం కలిగినప్పుడే, దైవశక్తి అవసరం ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కొరవడినప్పుడే ఔషధాలు కావాల్సి వస్తుంది. ఇదీ అలాంటిదే!
భక్తుడు పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చి ఆదుకోడు. ఆ పిలుపు ఆర్తిగా వెలువడినప్పుడే, అది భగవంతుణ్ని చేరుతుంది. ప్రార్థన పెదవుల నుంచి, ఆర్తి మనసు నుంచి, పూజ బుద్ధి నుంచి వస్తున్నాయి. ఆత్మతో భక్తుడు ఎటువంటి అనుబంధమూ పెట్టుకోవడం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడని భ్రమిస్తున్నాడు. ఆయన ‘అంతర్యామి’గా మదిలో కొలువై ఉన్నాడనే సత్యం భక్తుడికి ఒకపట్టాన అర్థం కావడంలేదు. ఆ లోపాన్ని అతడు తనకు తానే సరిదిద్దుకునే వరకు దైవానుగ్రహం లభించదు.
పూజ యాంత్రికం కారాదు. ప్రార్థన పూజగదికే పరిమితం కాకూడదు. మనిషి హృదయమే పూజా మందిరం. ముందుగానే అతడు అవలక్షణాల్ని తొలగించుకోవాలి. ఆ లక్షణాలేమిటో అతడికి ముందే తెలియాలి. అసూయ, అకారణ ద్వేషం, అంతరాలు, ఆధిక్య భావాలు... ఇవన్నీ తనలో ఉన్నాయని తెలిసినా, గుర్తించలేని స్థితికి చేరాడు. పరిపూర్ణుణ్ని, పరిశుద్ధుణ్ని- అనే భ్రమలు అతణ్ని వీడటం లేదు.    భగవంతుడు మానవుడికి అనేక ప్రజ్ఞలిస్తున్నాడు. అవన్నీ తనవేనని, అంతా తన ప్రజ్ఞేనని భావించి మనిషి అహంకరిస్తున్నాడు. అందరూ తనపై ప్రశంసలు కురిపించి, మహోన్నతుడిగా గౌరవించాలని అతడు ఆరాటపడుతున్నాడు.
అహంకారం, ఆధిపత్య ధోరణి అనేవి చెప్పుల జతలాంటివి. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. వాటిని ధరించి వెళ్లినవారికి దైవదర్శనం ఎప్పటికీ లభించదు. సర్వసంగ పరిత్యాగం అంటే కేవలం కాషాయం ధరించడం కాదు. తలపుల్ని శూన్యం చేసుకోవాలి. మనసంతా దైవచింతనతో నిండాలి. వేషంతో కాదు, వ్యవహార సరళి ద్వారా వైరాగ్యం ప్రస్ఫుటమవుతుంది. అవధూతలకు ఎలాంటి ఆర్భాటాలూ ఉండవు.
భక్తి అంటే, భగవంతుణ్ని ప్రేమించడం ఒక్కటే కాదు. సమస్త సృష్టినీ సమభావంతో చూడటం, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకచోటే దృష్టి కేంద్రీకరించడం! అప్పుడే అది సంపూర్ణ భక్తి అవుతుంది. అలాంటి భక్తితత్పరతకే భగవంతుడు   వశుడవుతాడు.
సంపూర్ణభక్తి అంటే- సమస్తంలోనూ భగవంతుణ్ని స్థిరబుద్ధితో చూడటం, చూస్తూనే ఉండటం!
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, October 5, 2018

లక్ష్మీదేవి అనుగ్రహానికి "శ్రీ లక్ష్మీ నారికేళం"

          శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటారు.శ్రీఫలాలు క్షార వృక్ష జాతికి చెందినవి. సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు పండుతాయి. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు , బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.   

        శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో చిన్న,పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. కొబ్బరి కాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరి కాయలకు ఉండే  విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

        శ్రీ లక్ష్మీ ఫలాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగినస్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు,తెల్ల బట్ట,సుఖ వ్యాదులు,గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా లేనివారు, ఎప్పుడు జలుబు,జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నవారు శ్రీ లక్షీ ఫలంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని స్వీకరించిన అనారోగ్యాలు మటుమాయం అవుతాయి.  

       శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసు కొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలి.శ్రీఫలం చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు, యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపాలి. తరువాత పసుపు గాని,ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని,లాభలక్ష్మీ స్వరూపంగా పద కొండు శ్రీలక్ష్మీ ఫలాలను  ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి. శ్రీలక్ష్మీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. "ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేసి పూజ అనంతరం శ్రీలక్ష్మీ ఫలాలను ఎర్రటి వస్త్రంలో కుంకుమ, నాణేలను మూటకట్టి వ్యాపారసంస్ధలలోగాని ఇంట్లోగాని ఉంచిన సుఖ సౌఖ్యాలు, ధన దాన్యాభివృద్ధి కలుగుతాయి.

Thursday, October 4, 2018

శరన్నవరాత్రులలో కుమారి పూజ విశిష్టత

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు. ఆశ్వీయుజమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలి. ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో కొన్ని ప్రాంతాలలో కుమారిపూజను చేస్తారు. ఈ పూజ హస్తా నక్షత్రముతో కలిసిన పాడ్యమి రోజున మొదలు పెట్టడం చాలా మంచిది అని పెద్దలు అంటారు.

కుమారిపూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీమంత్రంతో కానీ బీజ మంత్రంతో కానీ మొదలుపెట్టాలి. ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూజిస్తారు. కొత్తబట్టలు, నగలు ఇచ్చి పూజ చెయ్యాలి. అవలక్షణాలు ఉన్న బాలికలు, రోగాలతో ఉన్న బాలికలు, పది సంవత్సరాలు దాటిన బాలికలు ఈ పూజకు అనర్హులు. ఈ బాలికలకు షడ్రుచులతో భోజనం పెట్టి, వస్త్రాలతో సత్కరిస్తారు. ఒక్కొక్కరోజు ఒకొక్క వయస్సు బాలికకు పూజలు చేస్తారు.

రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది.

ఏడుసంవత్సరాల బాలికను చండిక అని అంటారు. చండికను పూజించడం వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఎనిమిదిసంవత్సరాల బాలికను శాంభవి అని అంటారు. శాంభవిని పూజను నృపసమ్మోహకం అని అంటారు. ఈ పూజ వల్ల అధికారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిదిసంవత్సరాల బాలికను దుర్గ అని అంటారు. దుర్గను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి.
ఈ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో, శాస్త్రోక్తకంగా నవరాత్రులు పూజ చేయడం సర్వశ్రేయస్కారం, శుభదాయకం.

కన్యా పూజా లేదా కుమారి పూజ నవరాత్రి వేడుకలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఇది నవరాత్రి అంటే అష్టమి మరియు నవమి అతిముఖ్యమైన రోజుల సమయంలో జరుగుతుంది.

మనం ఎంతమందిని అయిన ఈ కన్యా పూజాకి ఆహ్వానించవచ్చు. సాధారణంగా 1,3,5,7,9 మంది కన్యలను ఆహ్వానించవచ్చు.
ఒక అమ్మాయికి పూజలు చేస్తే ఐశ్వర్యము అందిస్తుంది.
ఇద్దరు బాలికలుకి పూజలు చేస్తే భోగము మరియు మోక్షం అందిస్తుంది.
ముగ్గురు అమ్మాయిలకి పూజలు చేస్తే ధర్మము, అర్థము మరియు కామము అందిస్తుంది.
నలుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే అధికారం అందిస్తుంది.
ఐదుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే విధ్య అంటే నాలెడ్జ్ పెరుగుతుంది.
ఆరుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే , 6 రకాల సిద్ధి అందిస్తుంది.
ఏడుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే రాజ్యసభ అంటే శక్తి మరియు రాజ్యం సాధించడంలో సహాయపడుతుంది.
ఎనిమిది మంది అమ్మాయిలకి పూజలు చేస్తే సంపద పెంచుతుంది.
తొమ్మిది మందిఅమ్మాయిలకి పూజలు చేస్తే పృథ్వీ. యాజమాన్యం ఇస్తుంది.

Saturday, September 29, 2018

పృధ్వీ స్తోత్రం

అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.

జయజయే జలా ధారే జలశీలే జలప్రదే l
యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ll

మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే l
మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ll

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే l
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ll

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని l
పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ll

సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే l
సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ll

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే l
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ll

ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ l
కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ll

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

Tuesday, September 25, 2018

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం.

ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి.

ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు.

స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది.

లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మహాలయపక్ష తిథులలో శ్రాద్ధకర్మలు చేస్తే వాటి ఉపయోగాలు.

తిథి ఉపయోగాలు

పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి

అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి

శ్రాద్ధ కర్మలలో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది

బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణం లో చెప్పబడి ఉన్నది . అగ్ని దేవుని భార్య పేరు స్వాహా . హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో "స్వాహా " అనడం జరుగుతుంది . ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అన్ని దేవునికి చేరుతాయి .

అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమ౦ చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది.

స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది.  శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద  దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. "ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యైస్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.

బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా , విద్యావతిగా తీర్చిదిద్ది , ఆ కన్యకు "స్వధాదేవి" అని నామకరణం చేసాడు. పితృదేవతలకు పత్నిగా స్వధా దేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు,విప్రులు ,మానవులు "స్వధాదేవి"ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

"బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర యౌవనాం |
పూజ్యానాం పితృ దేవానాం శ్రద్దానాం ఫలదాం భజే "||

అని స్వధాదేవిని ప్రార్ధిస్తూ ఉంటారు.

పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లొ,తీర్ధస్నానాల్లో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించాడు.

స్వధాదేవి స్తోత్రం

స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı
ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı

స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı
శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య  జిలైరపి ıı

శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి సమాహితః ı
సలభేట్ శ్రాద్ద శంభూతం ఫలమేవన సంశయః ıı

స్వధా స్వధా స్వధేత్యేవం త్రిసంధ్యం యః పఠేన్నరః ı
ప్రియాంవినీతాం సలభేత్ సాధ్వీం పుత్రగుణాన్వితామ్ ıı

పితౄణాం ప్రాణతుల్యాత్వం ద్విజజీవన రూపిణీ ı
శ్రాద్దాదిష్ఠాతృ దేవీచ శ్రాద్దాదీనాం ఫలప్రధా ıı

నిత్యాత్వం సత్యా రూపాసి పుణ్యరూపాసిసువ్రతే ı
ఆవిర్భావతిరోభావౌ సృష్టౌచ ప్రళయేతవ ıı

ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణాతధా ı
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ıı

కర్మ పూర్త్యర్దమే వైతా ఈశ్వరేణ వినిర్మితాః ı 
ఇత్యేవ ముక్త్వా సబ్రహ్మా బ్రహ్మలోకే స్వసంసది ıı

తస్ధౌచ సహసాసద్యః స్వధాసా విర్బభూవహి ı
తధా పితృభ్యః ప్రదదౌ తామేవకమలాననామ్ ıı

తాం సంప్రాప్యయయుస్తేచ  పితరశ్చ ప్రహర్షితాః ı
స్వధా స్తోత్ర మిదంపుణ్యంయః శృణోతి సమాహితః ıı

సుస్నాతః సర్వతీర్ధేషు వాంఛితం ఫలమాప్నుయాత్ ıı

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...