Monday, April 16, 2018

మనుష్య జీవితం- పరమార్ధం

ఏబంధాలు లేకుండా ఏకాకి గా తపమాచరించు
ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి
మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు. నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో... అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాటి హితవు ఒకటి ఉండాలి.
ఇంతకీ రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు.

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

Sunday, April 15, 2018

శాశ్వత సత్యాలు

మనకేం కావాలో తెలియనపుడు ఎన్ని శాస్ర్తాలు నేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఏ శాస్ర్తం గొప్పది, ఏ మార్గం గొప్పది, ఎవరు గొప్పవారు‌ అనే ప్రశ్నలు మానవుని ఆచరణ శూన్యతకు, పతనానికి కారణాలు.

భగవంతుని కన్నా శాస్ర్తమే ఎక్కువ. అనే వెర్రిలో పడరాదు. భగవంతుడిని మరువలేని శాస్త్రమే కావాలి. భగవంతుడు లేడు లేడు అని అరుస్తుంటారు కొంతమంది. అలా అంటూనే మరల భగవంతుణ్ణి తిట్టే వారు కూడా ఉన్నారు. మనకీ భగవంతునికి మధ్య పొరలు తొలగాలంటే మిగిలిన జీవులకు మనకు మధ్య పొరలుండరాదు.

మనం ఉండటం అంటే మనము ఉన్నట్లు అనిపించడమే గాని అదికాక మనం అంటే ఏమిటో చెప్పు? ఎవడి అస్తిత్వము వాడికి ఉండడమే ఉండటం.

నువ్వు సర్వ శక్తి సంపన్నుడవు అంటే ఒక్కొక్కడు అంగీకరించడు . ఎందుకో తెలుసా? అలా అని నమ్మితే ఆ శక్తిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత తన నెత్తిన పడుతుందేమోనని.

ఒక్కొక్కడికి తోచదు ఎవరైనా చెపుతూ ఉంటే వినడు. వినగలిగే మంచితనం, సహనం ఉండాలి. వినడానికి అహంకారం పడక, బుద్ధి గలిగి వినగలిగితే వినే ప్రతిమాట మంత్రమే-- మార్గమే.

తెలిసి తప్పు చేసినవాడు, ఇతరుల తప్పులను పట్టుకు కూర్చునే వాడు, చేసిన తప్పులను గూర్చి తపస్సు‌ చేసేవాడు, శరీరం మీద అభిమానం, మృత్యుభీతి ఉన్న వాడు బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు.......

........✍🏻 గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

సదా స్మరణీయులు మన సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!*
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!*

భారతీయ పరంపరాగత ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు...

వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు)

దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి:*

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు :*

ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి:*

త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. గౌతముడు:*

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి:*

రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు:*

ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

Friday, April 13, 2018

శని త్రయోదశి ప్రాముఖ్యత

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.

ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలిమద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

శని దండనాధికారి:
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

Tuesday, April 10, 2018

ప్రాచీనకాలం నాటి కోరికలు తీర్చుకొనే "కామ్య యఙ్ఞాలు

నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలుల యొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు.

మనవాళ్ళు చెప్తే నమ్మని మనవారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్నిఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన బోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారుమైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు,కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆరసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన
కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్ని హోత్రం లో రోజూ ఆజ్యంవేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్లా ల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ ఆర్టికల్ ప్రచురించబడింది.

సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా
ఉండవు అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతియొక్క
మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు. చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనలచేత నిర్ధారించారు. ఐనప్పటికీ వీటిమీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు.

ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉండుగాక అదే ధృతి, ధర్మమునందు నిర్భయంగా చరించే శక్తి మనకు అనవరతమూ ఉండుగాక

ప్రతి మనిషికీ ఎంతోకొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంతామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!

ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది.

కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.

హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.

తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...