Saturday, November 22, 2014

కర్మ ఫలం అంటే ఏమిటి.............?

కర్మ ఫలం అంటే ఏమిటి


"కర్మ" అనే మాటకు సరి అయిన అర్థం "కార్యము" లేదా "కృత్యము", మరింత విస్తారముగా చెప్పలంటే, అది కారణము మరియు పరిణామము, స్పందన మరియు ప్రతిస్పందనల యొక్క విస్వజనీనమయిన సూత్రమును పేర్కొంటుంది, హిందువులు దానిని మనిషి యొక్క చేతనని నడిపించేదిగా నమ్ముతారు. కర్మ అంటే విధి కాదు, ఎందుకంటే మనిషి తన జీవితంలో రాబోవు పరిణామాలను తన స్వేచ్ఛానుగతమయిన సంకల్పము చేత నిర్దేశించబడిన చేతల ప్రభావంతో సృష్టించుకుంటాడు. వేదాల ప్రకారము, మనం మంచితనాన్ని నాటితే మంచి ప్రతిఫలాన్ని పొందుతాము, చెడుని నాటితే, చెడు ఫలితాన్ని పొందుతాము. కర్మ అనేది మన కార్యాలని అన్నింటినీ సమిష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ, గత జన్మలలోనూ అనుసరించి ఉన్న ప్రతిస్పందనలను సూచిస్తుంది, ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. కర్మను జయించడము తెలివయిన కార్యాచరణలోనూ మరియు నిశ్చలమయిన ప్రతిస్పందనలోనూ ఉన్నది. అన్ని కర్మ ఫలితాలూ వెంటనే సంభవించవు. కొన్ని జమ అయ్యి, ఈ జన్మలోనో లేదా ఇతర జన్మల్లోనో అనుకోని విధంగా సంభవిస్తాయి మనం నాలుగు విధాలుగా కర్మని ఉత్పత్తి చేస్తాము:
  • ఆలోచనల ద్వారా
  • మాటల ద్వారా
  • మనమే చేపట్టే మన కార్యాల ద్వారా
  • మన ఉపదేశాలను అనుసరించి ఇతరులు చేసే కార్యాల ద్వారా
మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది లేదా దేనికైనా కారణమయ్యేది అంతా కూడా కర్మ; ఈ క్షణంలో మనం ఆలోచించేది, మాట్లాడేది లేదా చేసేది కూడా కర్మే.హిందూ శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజిస్తాయి:
  • సంచిత అనేది కూడబెట్టబడిన కర్మ. అన్ని కర్మలనూ ఒకే జీవితంలో అనుభవించడం, భరించడం అనేది అసాధ్యం. ఈ సంచిత కర్మ యొక్క ఖాతాలోనుండి, చేతిలో పట్టేటన్ని ఒక జీవితంలో అనుభవించడానికి వెలికి తీయడం జరుగుతుంది, ఈ కార్యాలు, ఫలించడం మొదలు పెట్టి, అవి ఫలించాకనే వాటిని అనుభవించడం ద్వారా తరిగిపోతాయి, వేరే విధంగా కాదు, దానిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.
  • ఫలించగలిగే ప్రారబ్ధ కర్మ అనేది కూడబెట్టబడిన కర్మలోని ఒక భాగం, అది "పండి", ప్రస్తుత జీవితంలో ఒక ప్రత్యేకమైన సమస్యగా గోచరిస్తుంది.
  • క్రియమాన అనేది ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసేది. అన్ని క్రియామాన కర్మలూ సంచిత కర్మ లో జమ అయ్యి, తదనంతరముగా మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మానవజన్మలో మాత్రమే మనం మన భవిష్యత్గమ్యాన్ని మార్చుకోగలము. చనిపోయాక మనం మన క్రియా శక్తి (పని చేయకలిగే శక్తి) కోల్పోయి, (క్రియామాన) కర్మను మళ్ళీ మనిషి శరీరంలో జన్మించేంతదాకా చేయలేము.
స్పృహతో చేసిన కార్యాలు, స్పృహ లేకుండా అంటే తెలీకుండా చేసిన వాటికంటే చాలా భారీగా ఉంటాయి. ఎలాగయితే విషం తెలీకుండా తీసుకున్నా కూడా మనల్ని ప్రభావితం చేస్తుందో అలాగే, మనకు తెలీకుండా ఇతరులని బాధిస్తే, దానికి కూడా తగిన విధమైన కార్మిక ప్రభావం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలిసిన మనుషులు మాత్రమే (క్రియామాన) కర్మను చేయగలరు. జంతువులు మరియు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు కొత్త కర్మని సృష్టించడం లేదు (అందుకని వాళ్ళు తమ భవిష్యద్గమ్యాన్ని ప్రభావితం చేసుకోలేరు) ఎందుకంటే వాళ్ళు మంచి, చెడుల మధ్య తారతమ్యం గ్రహించలేరు. కానీ స్పర్శా జ్ఞానం కలిగిన ప్రతి జీవీ కర్మ యొక్క ప్రభావమును అనుభవించగలదు, అవి వాటికి ఆనందము మరియు బాధగా తెలుస్తాయి.
తులసిదాస్ అనే హిందు సాధువు ఈ విధంగా అన్నాడు: "మన శరీరం సృష్టిలో భాగం కాక ముందే మన గమ్యం నిర్దేశించబడుతుంది."సంచిత కర్మ లోని ఖాతా అంతమయ్యే వరకూ, దానిలోని కొంచం భాగము ఒక జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మ ను అనుభవించడానికి వెలికితీయడం జరుగుతుంది, అది జనన మరణ చక్రానికి దారితీస్తుంది. జీవుడు జమకాబడిన సంచిత కర్మ పూర్తిగా తరిగిపోయేంత వరకూ జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందలేడు.
భూమిపైన జనన మరణాల చక్రం అనేది 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుంది, వాటిల్లో ఒకటి మాత్రమే మానవ జన్మ. మనుషులుగా మాత్రమే మనం మన గమ్యస్థానం కోసం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఏదో ఒకటి చేసే స్థానంలో ఉంటాము. మంచి పనుల వల్ల, స్వచ్చమయిన ఆలోచనల వల్ల, ప్రార్థన వల్ల, మంత్రము మరియు ధ్యానం వల్ల, మనం కర్మ యొక్క ప్రభావాన్ని ప్రస్తుత జీవితంలో తగ్గించుకోగలిగి, మన గమ్యాన్ని బాగు చేసుకోగలము. మన కర్మ ఏ రకంగా, ఏ వరుసక్రమంలో పరిపక్వం చెందుతుందో అన్న విషయం తెలిసిన ఆధ్యాత్మిక గురువు మనకి సాయపడగలడు. మనుషులుగా మనం మంచి పనులు చేయడమనే అభ్యాసం ద్వారా మన ఆధ్యాతిమ పురోగమనాన్ని త్వరితం చేసుకోగల అవకాశం ఉంది. మనకు జ్ఞానము లేదా స్పష్టత లేక పోవడం వలన మనము చెడు కర్మను ఉత్పత్తి చేస్తాము.
నిర్దయగా ఉండటం చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని పాపం అంటారు, మంచి పనులు తియ్యటి ఫలాలను తీసుకువస్తాయి, వాటిని పుణ్యము అంటారు. మనం చేసే పనులకు తగ్గట్లుగా మనం తయారవుతాము: సన్మార్గపు కార్యాల వలన సన్మార్గులుగానూ, దుర్మార్గపు కార్యాల వల్ల దుర్మార్గులుగానూ మారతాము.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

Saturday, September 13, 2014

చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు ?



ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.

గుట్టి. సుబ్రహ్మణ్యశర్మ 

Thursday, August 7, 2014

వరలక్ష్మీ వ్రతం

 శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు.









నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ

స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి ఉంటే) పానకము (ఆనవాయితి ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధి విధానం

తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

తోరగ్రంథి పూజ

తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.

  • ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.

  • ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.

  • ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||


అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

 PRIEST

గుట్టి సుబ్రహ్మణ్య శర్మ 

 9848288711

Sunday, June 15, 2014

క్షమాపణ

జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి 

దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హరి హర పుత్రా అయ్యాన్ అయ్యప్ప స్వామి మీ పాదాల చరణ విందములకు ఈవె మా శరణములు 

 

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

హరివరాసనం


Tuesday, May 13, 2014

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...