Thursday, January 17, 2019

ఏమైంది నాకు?

ఉదయం 6 గంటల సమయం…….ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం
చేస్తున్నాను. కానీ……లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి……
” ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? ” ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత
నొప్పి వచ్చింది…స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు
తెలియదు…..
కాఫీ కావాలి నాకు……..నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు…….ఇంటి బయట చాలా మంది గుంపుగా
ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు……అయ్యో! అది నేనే! దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు…..బిగ్గరగా
పిలిచాను……..నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను…. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును పట్టుకుని…….భార్యను పిలిచాను……..తనకు నా మాటలు
వినిపించలేదు……..మరో గదిలోకి వెళ్ళి చూశాను……
ఆ గదిలో మా అమ్మ …నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు
దు;ఖంలో…….

” నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ” అని బిగ్గరగా అరిచాను…….ఎవ్వరూ నన్ను
చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను…….అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు…..వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు…….
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి………..వాడితో సంవత్సరం నుండి నేను
మాట్లాడ్టం మానేశాను…….ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి
వాడెందుకు ఏడుస్తున్నాడు………అవును నేను చనిపోయాను……నిజంగానే
చనిపోయాను.
‘ దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని
ఇవ్వు…..ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా
ప్రేమగా చూసుకోలేకపోయాను…..నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..
నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను……..
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను……నేను వచ్చేలోగానే నా
బిడ్డ నిద్రపోయేవాడు……

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను……..చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని
వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను.” అని బి్గ్గారగా
ఏడుస్తున్నాను…….” దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు……నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి………నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! ”
ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు……కళ్ళు తెరిచి చూశాను.
నా భార్య……” ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
ఏమైంది మీకు ?” అని అడుగుతోంది.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
” నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని…..నీలాంటి అమ్మాయి నాకు
భార్యగా దొరకడం……నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా
ఉన్నావో తెలుసా ? ” అన్నాను……ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,

మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది… మీ ఈగో లను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి….అన్నీ పోగొట్టుకున్నతర్వాత
బాధపడి ఏమీ లాభం లేదు……కుటుంబంతో గడపండి………స్నేహితులతో
మంచిగా ప్రవర్తించండి……ఈ జన్మ దేవుడిచ్చినది……ఆనందంగా
జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా
మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!
……….ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు

Tuesday, January 8, 2019

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వేంకటేశ్వరున్ని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈమాసం మొత్తం  శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ థనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత ...మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్దారు. 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు.

ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 16వ రాత్రి 10గo.52ని ల నుంచీ ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికార్లు. ఈ నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్ధానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు. దీని వెనుక పురాణ గాధను పరిశీలిస్తే  గోదాదేవి  తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయన చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు.

గోదాదేవి రచించిన ఈ 30 పాశురాలను రోజుకోక పాశురం చోప్పున.... పటిస్తారు జీయంగార్లు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు అర్చకులు. అనంతరం యధావిదిగద అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున దరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.

ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం  భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి  బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరో వైపు  నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసిఆకులకు బదులుగా బిల్వ  పత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

జాతకకర్మ సంస్కారం

గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''

ఈ జాతకర్మ సంస్కారముచే శిశువు గర్బమునందు, గర్భ జలపానాది దోషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

"కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం జాతేన కర్మణా సగ్గ్స్కరిష్యే అని సంకల్పము, ఇందు ఫలీకరణ హోమమను పేర హోమకార్యముగలదు ఈ హోమ కార్యముచే, "ఆయుష్యాభివృద్ధర్థం, అనయోర్బాల సూతికయోః చండాలాదిపిశాచే భ్యోరక్షణార్థం. ఫలీకరణ హోమం కరిష్యే||" అని సంకల్పింతురు,

జన్మించిన బాలునికి పిశాచాది బాధలనుండియు, బాలగ్రహాది బాధల నుండియు, రక్షణార్థమై యీ ఫలీకరణ హోమము చేయుదురు. దీని వల్ల బాలారిష్టాదులకు శాంతికల్గును.

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను.

“స్నాతోలంకృతః పితా అకృత నాలచ్ఛేదం అపీతస్తన్యం అన్త్యెరస్పృష్టం ప్రక్షాళితం కుమారం మాతురుత్సాం  గేకారాయిత్వా..... అస్యకుమారస్య గర్భాంబు పాతజనిత దోష నిబర్హణాయుర్మేధాభివృద్ధి బీజ గర్భ సముద్భావైనో నిబర్హణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం జాతకకర్మ కరిష్యే “ అని ధర్మ సింధువు జాతకకర్మ  సంకల్ప విధానాన్ని నిర్దేశిస్తున్నది. దీన్నిబట్టి జాతకకర్మ ప్రయోజనం మాత్రమే కాక అది ఎప్పుడు చేయవలసిందో కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ విధానంలో కొంత ఇబ్బంది లేకపోలేదు.

ముహూర్త దర్పణం నందు
“తస్మిన్ జన్మముహూర్తే పి సూతకామ్టే ధవా శిశోః కుర్యాద్వైజాతకర్మాఖ్యం పితృపూజని తత్పరః” శిశువు జన్మించిన వెంటనే గాని పురుడు తొలగిన తరువాత గాని జాతకకర్మ చేయవలెనని నిర్దేశిస్తున్నది. ఈ విధంగా చేయబడుతున్నదే ఈనాటి బారసాల. ముహూర్త చింతామణిలో “తజ్జాతకర్మాది శిశోర్విధేయం పర్వఖ్యరిక్తోన తిధే శుభే హ్ని ఏకాదశ ద్వాదశకే పి ఘస్రేంమృధ్రువ క్షీప్రచారోడుశుస్యాత్” అని 11 వరోజుగాని, 12 వ రోజు గాని జాతకకర్మ చేయవలెనని చెప్పినది. పర్వతిధులు, రిక్త తిధులు, జాతకకర్మకు పనికిరావు. మృధు,ధృవ,క్షిప్ర, చర నక్షత్రాలలో ఏవైనా జాతకకర్మ చేయవచ్చును. చవితి, నవమి, చతుర్ధశి రిక్త తిధులు, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు, ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు, హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు, స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు, మంగళ, శనివారాలు జాతక కర్మకు పనికి రావని ధర్మ సింధువు వచనం.

ప్రస్తుతం బారసాలకు తిధులు నక్షత్రాలు చూడటం ఆచారంగా లేదు. పైగా అది వైదిక జాతకర్మ సంస్కారంగా నిర్వహించబడటం కానరాదు. అంతేకాదు జాతకర్మాదులను ప్రాయశ్చిత్త పూర్వకంగా ఉపనయనానికొక రోజు ముందుగా (ఒకొక్కప్పుడు ఆదేరోజు కూడా) జరిపించేయటం ఆచారంగా మారిపోయింది.

దేవర్షి పితృ ఋణాలు మూడింటిలో పిత్ర జననం వలన పితృ ఋణాలు విముక్తి కలుగుతుందని భారతీయుల పవిత్ర భావన. జాతకకర్మ, నామకరణం, డోలారోహణాలతో పాటుగా బాలింతరాలి చేత మొట్టమొదటగా నూతిలో చేద వేయించి నీరు తోడించే కార్యక్రమాన్ని కూడా కలిపి లౌకికాచారంగా ఇరవై ఒకటో నాడు నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కానవస్తుంది. ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా మాత్రం చూస్తున్నారు.

శిశువు జన్మించిన సమయము ననుసరించి, మాతా పితరులకు క్షేమకరమగునా? లేదా? యనియు, జన్మించిన శిశువునకు బాలరిష్టాది దోషములు లేకను, ఆయుర్వృద్ధికరమైన విధానమున్నదా? లేదా యనియు విచారింపదగియున్నది. అట్లు తల్లి దండ్రులకు, మేనమామలకు, జన్మించిన శిశువునకు దోషములున్నచో, నవగ్రహ, జప, హోమదానాదులచేతనూ తదితర జప హోమశాంతుల చేతను దోషనివారణమునకు శాంతికలాపములుగలవు వానిని యెరింగిన మహనీయులనడిగి, తగిన శాంతులు జరుపుకొని యంనతరము దాని జాతకర్మ నామ కరణాదులు జరపుకొనుట పెద్దలయాచారము. తల్లి దండ్రులకు మేనమామలకు, దోషకరమైన రీతిని కొన్ని జన్మలుండునుగాన విధిగ పెద్దలనడిగి శాంత్యాదులు జరుపుకొనుట శ్రేయస్కరము. ఈ జన్మ దోషాదులు జ్యోతిషము తెలిసిన పెద్దలు చెప్పగలరు. వానికి శాంతులు చక్కని పురోహితులు జరిపించగలరు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.

యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.

  కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా  ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.

  కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

రంగవల్లికలు

  రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.

గొబ్బెమ్మలు

స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.

మొదటిరోజు ‘భోగి’

భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని  పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

సంక్రాంతి

సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు.ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు. మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

బోగి పండ్లు

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.
ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.
దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.

రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...