Tuesday, January 8, 2019

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.

యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.

  కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా  ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.

  కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

రంగవల్లికలు

  రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.

గొబ్బెమ్మలు

స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.

మొదటిరోజు ‘భోగి’

భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని  పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

సంక్రాంతి

సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు.ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు. మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

బోగి పండ్లు

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.
ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.
దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.

రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

ఉత్తరాయణ పుణ్యకాలం

‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది.
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’

మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.
‘‘రవి సంక్రమణే ప్రాపే న
న్నా యాద్యన్తు మానవః
సప్త జన్మసు రోగీ స్యా
నిర్దేనశే్చన జాయతే’’

అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…

ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

Tuesday, January 1, 2019

కోరాడ రామచంద్రశాస్త్రి గారు


రచయిత, కవి

కోరాడ రామచంద్రశాస్త్రి గారు ప్రథమ తెలుగు నాటక రచయిత. క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. సంస్కృతం నుండి తెలుగులోని అనువాదం చేసిన మొదటి రచయిత కూడా వీరే కావడం విశేషం.

జీవిత విశేషాలు :
----------------------
ఈయన 1816లో అమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసము బందరు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు ఒక వివాహం లో మెచ్చుకుంటుండగా, ఆ సమయమున చిరపరిచయులగు శిష్టుకవి గారు రామచంద్రపురము రాజుగారికి "ఆయన ను ఆస్థాన పండితునిగా గౌరవించండి అని ఉత్తరము వ్రాసి ఇవ్వగా ఆ రాజు గారు  "దేశమున క్షామము వలన ఈ కవిని రెండు నెలల కంటే ఎక్కువ పోషింపలేమని చెప్పారట. ఆమాట రామచంద్రశాస్త్రి గారి కి నచ్చలేదు. మదరాసు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణమయ్యారు. త్రోవలో మచిలీపట్టణమున ఆగవలసివచ్చి ఇంగువ రామస్వామి శాస్త్రి గారి వద్ద మంత్ర శాస్త్రమభ్యసించారు. వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మ శాస్త్రి గారి స్వస్థలము నడవపల్లి. ఆ ఊరి వారు రామచంద్ర శాస్త్రి గారి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమన్నారు. మహా కవితా ధార కలిగిన వీరికి అది ఒక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ అవధానమును చెప్పారట. ఆ పద్యములు మాత్రం అపలబ్ధములు.

క్రమముగా శాస్రి గారి పాండితీ కవితా ప్రతిభలు నలుదిక్కులా వ్యాపీంచాయి. బందరు నోబిల్ పాఠశాలలో ఉద్యోగము లభించింది. అక్కడ 43 వత్సరములు పని చేసారు. దొరలు వీరి నైపుణ్యానికి నివ్వెఱపోయేవారు. వారెవ్వరిని లెక్క చేసేవారు కాదు. ఉద్యోగంలో వున్న నలువది మూడేండ్లలో ' ఈ తప్పు చేసారు  ' అని ఒక్క అధ్యక్షుడు చేత కూడా ఆక్షేపింపబడలేదు.

 కళాశాల అధ్యక్షునకు ఈయనకు ఒక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చాయి. శాస్త్రులు గారు ముక్త కంఠమున "మీ అర్ధము పొరపాటు" అని కరాఖండిగా చెప్పారు. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదం కు ఆయన తలయొగ్గక తప్పినదికాదు.

మాడభూషి వేంకటాచార్యులు మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి

 "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్"

అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రిగారు దీనికి అర్ధం ఎట్లు చెప్పుతారో కనుక్కుని రమ్మని పంపించారు. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటమే కాకుండా రెండు గడ్డు శ్లోకములు వ్రాసి ఆచార్యులు గారికి పంపి నిరుత్తరులను చేశారని వదంతి.

ఈయన సంస్కృతాంధ్రములలో చాలా కృతులు రచించారు. పన్నెండవ ఏటనే ఉపదేశము పొందారు. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి ఉపదేశ విషయమును తెలుపుతాయి. 1860 ప్రాంతమున మంజరీ మధుకరీయం నాటకము ను రాశారు.

రచనలు :
------------
శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు.

వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.

ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "మంజరీ మధుకరీయం". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860 ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ మరియు మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తె వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.

వీరు సంస్కృతంలోని వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.

కృతులు :
--------------
మంజరీ మధుకరీయ నాటిక
ఉన్మత్త రాఘవము
నయప్రదీపము
రథాంగదూతము
శాకుంతలము(ఆంఢ్రీకరణం)
వేణీసంహారము
ముద్రారాక్షసము
ఉత్తరరామచరితము
పరశురామ విజయము

సంస్కృత రచనలు :
--------------------------
కుమారోదయము
ఘనవృత్తము
దేవీవిజయము
శృంగార సుధార్ణవము
ఉపమావళి

ఆముద్రిత సంస్కృత కృతులు :
-----------------------------------------
మృత్యుంజయ విజయ కావ్యము
పుమర్థసేవధి కావ్యము
కమనానందభాణము
రామచంద్ర విజయవ్యాయోగము
త్రిపురాసుర విజయడిమము
ఉత్తర రామాయణము
ధీసౌధము
మంజరీ సౌరభము
...ఇంకా ఎన్నో

ఘనవృత్తము :-
------------------
ఇది మేఘదూతమునకు తరువాతి కథ. శాపవశాత్తు భార్యనుండి వేరుపడి విరహ మనుభవిస్తున్న యక్షుడు వర్ష ఋతువులో మేఘమును చూచి తన సందేశమును తన భార్యకు అందజేయుమని ప్రార్థించి, అలకాపురికి మార్గమును కూడ చక్కగా తెలిపినాడు. అది మేఘదూతములోని కథ. ఇక ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అదేమంటే పాపము తన బాధను మేఘునితో యక్షుడు మొర పెట్టుకొన్నాడు. ఐతే ఆ మొరలను ఆలకించిన మేఘుడు ఏమి చేసినాడు అన్నదే ఆ ప్రశ్న. అసలు ఆ నీలజీమూతము విన్నదా, వింటే ఏమి చేసింది? అలకాపురి చేరిందా, యక్షుని భార్యను చూసిందా? ఆమె ఏలాగుంది?

ఈ ప్రశ్నలకు జవాబు మనకు కోరాడ రామచంద్రశాస్త్రి గారు వ్రాసిన ఘనవృత్తములో లభిస్తుంది.

.
యక్షుడు ఇచ్చిన ప్రయాణమార్గపు వివరాలు తీసికొని అలకాపురి చేరుకొంటాడు మేఘుడు. అక్కడ యక్షుని ఇంటిని కూడ కష్టము లేకుండ కనుగొంటాడు. కిటికిలోనుండి తొంగి చూడగా చిక్కిపోయిన యక్షుని భార్య దేవీపూజలో నిమగ్నమై యుంటుంది. శోకాకులయైన ఆమె మేఘునికి అశోకవనములో నున్న సీతను జ్ఞప్తికి తెస్తుంది. హనుమంతుని వలెనే మేఘుడు సూక్ష్మరూపము దాల్చి సుందరాకారముతో ఆమె ముందు ప్రత్యక్షమయి యక్షుని విరహబాధను తెలియజేస్తాడు. యక్షుని ఇంద్రియ నిగ్రహము, ఏకపత్నీవ్రతమును ఆమెకు విశదపరచినాడు.యక్షాంగన ఇది తాను దేవికి చేయు పూజాఫలము అని తలపోస్తుంది. శాపగ్రస్తుడైన యక్షుడు రామగిరిలో తపము చేసెడి సమయాన ఇంద్రుడు ఆతని తపోభంగము కోసం సురూప అనే అప్సరను పంపాడనీ, ఆమె నటనలకు, సౌందర్యమునకు బానిస కాక ఆమెను తూలనాడి ఆమెకు సద్బుద్ధిని కలిగించి తిరిగి దేవలోకానికి యక్షుడు పంపించాడనీ మేఘుడు చెబుతాడు.

“స్వర్గం గాయాః – పయసి విహరత్ – రాజహంసస్య కుల్యా
సిత్వం యాహి – ద్రుతతరమితో – యాహి కుంజాంతరం తత్”

నా భార్య ఆకాశగంగ వంటిది. నావంటి రాజమరాళం అట్టి ఆకాశగంగలో కాక నీవంటి పిల్లకాలువలో విహరిస్తుందా? నీ వృథాప్రయాస చాలించి ఇక వెంటనే వెళ్ళు అని యక్షుడు సురూపతో అన్న మాటలను ఆమెతో చెబుతాడు. తన భర్తను గురించి యక్షుడు చెప్పిన మంచి మాటలను విన్న యక్షవనిత ఆనందాధిక్యముతో మూర్ఛపోతుంది. ఆమెకు శైత్యోపచారములను జేస్తూ చెలికత్తెలు మేఘునికి ఆమె ఎలా యక్షుని వదలి కాలము గడిపినదో అనే విషయాన్ని వివరిస్తారు. కుబేరుడు తనకిచ్చిన శాపము మాట విన్న యక్షుడు బాధతో భార్యకు ఈ వార్తను తెలుపుట కిష్టము లేక ఇంటికి రాకుండ వెళ్లిపోయిన పిదప కుబేరుడు తన భార్యను యక్షవనిత వద్దకు పంపుతాడు. ఆమె కుబేరుడు తనకు బోధించిన అంబికా మంత్రమును యక్షాంగనకు ఉపదేశించి దేవిని ఆరాధించమని ఓదార్చుతుంది. యక్షపత్ని అలాగే భక్తితో పార్వతిని పూజిస్తుంది. ఆమె పూజలకు తృప్తిబొంది పార్వతి ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది – కుబేరుడు నా ప్రియమైన భక్తుడు. అతని శాపమును నేను తిరగజేయలేను. కాని శాపము త్వరలో ముగుస్తుంది, నీకు శుభము కలుగుతుంది. అదియును గాక యక్షుని శాపమునకు కారణము పూర్వజన్మలో అతడు తన కూతురిని అల్లుడిని కలువనీయకుండ దూరముంచుతాడు. నీవు కూడ నీ చెలికత్తెలను వారి పతులనుండి దూరము చేస్తున్నావు, అలా చేయకు అని చెప్పుతుంది.

అప్పటినుండి ఆ యక్షవనిత దేవీ ధ్యానములో తన భర్తను తలచుచు కాలమును గడపుతున్నది. కొద్ది సేపటికి ఆమె మూర్ఛనుండి తేరుకొని మేఘుడిని ఆదరించి బహుమానముల నిచ్చి తన పతిని గూర్చి కొన్ని రహస్యములను తెలిపి ఒక సందేశాన్ని కూడ ఇస్తుంది. ఆ సందేశములను గొని మేఘుడు మళ్లీ రామగిరికి వెళ్ళి యక్షుని జూచి నీ ప్రియురాలు జీవించి వున్నది, నిన్నే తలుస్తూ ఉన్నది, త్వరలో మీరు శుభములను పొందగలరు అనే మేఘసందేశమును ఇచ్చి వెళ్ళిపోతాడు. వర్షఋతువు పిదప శరదృతువు వస్తుంది. యక్షునికి శాపము తీరుతుంది. అలకాపురికి వెళ్లి తన భార్యను మళ్లీ దర్శిస్తాడు. మేఘుడు వారిని కలిసికొని ఇద్దరిని శ్లాఘిస్తాడు. కుబేరుడు యక్షుని సన్మానించి తన సేవకా వృత్తి నుండి తొలగిస్తాడు. ఇది ఘనవృత్తపు కథ.

ఈ కావ్యము నుండి రెండు పద్యాలు:

యత్తే ప్రేయాన్ – మయి సదయయా – గ త్తనూజత్వభావం
దూరే తస్మి – న్నపిచ భవసి – ప్రేమ ధూర్మిర్భరాత్మా
సూనం తస్మా – దహముపగతో – న్యాయతస్త్యాతభావం
పుత్రం మత్వా – తవహృదయ సం – భాషణం నిర్విశంకా

దూరంబున్నన్ – నెనరు మదిలో – నుంచుకొన్నావు నీవున్
ప్రేమన్ జూపెన్ – బ్రియ సుతునిగా – నన్ను నీ భర్త తానున్
నేనున్ దల్తున్ – గనుక నతనిన్ – దండ్రిగా దప్పకుండన్
నీవున్ నన్నున్ – సుతునివలెనే – యెంచుమా శంకలేకన్

యక్షుడి భార్యను చూచిన తరువాత మేఘుడు ఆమెతో, యక్షుడు నన్ను తన కొడుకులా ఆదరించాడు, నేను కూడ అతడిని పితృసమానముగా తలుస్తాను, నీవు నీ భర్త ఎంతో దూరములో ఉన్నా, ప్రేమతో అతనిని మరువకుండా సదా జ్ఞాపకము చేసికొంటున్నావు. నీవు కూడ సందేహాలను తొలగించి సంకోచ పడక నన్ను పుత్రసమానునిగా తలంచుకో, అని అంటాడు.

అన్యోన్యోద్యత్ – ప్రణయవశతా – జాతకందర్పదర్ప
క్రాంతక్రీడా – వశగమనసో – రర్హయోనోఃకయోశ్చిత్
ఆళీహిత్వం – స్వపదవినయం – బోద్దుకామావకాశం
వాదా ఏవం – తదసివిధురా – శాప ఏవప్రసహ్యః

ఆనాడొక్కం – డెఱిగి తనయన్ – భర్తనున్ వేఱు జేసెన్
జ్ఞానంబున్నన్ – మతియు జెడగా – దానె గల్గించె బాధన్
తా నీ జన్మన్ – ధనపతి యిడన్ – శాపమందేను, నీవున్
వేఱుంచేవే – చెలుల పతులన్, – పాప మద్దాని వల్లన్

ఈ పద్యము పార్వతీదేవి యక్షుడికి శాపము ఎందుకు వచ్చిందో అని యక్షపత్నితో వివరించినప్పుడు చెప్పిన మాటలు. వయసులో ఉండే ప్రేమికులను వేరుజేయడము తప్పు. ఆ తప్పునే నీ భర్త పూర్వజన్మలో చేసినాడు, తన కూతురిని అల్లుడిని కలుసుకోకుండా అడ్డంకులు పెట్టేవాడు. దాని ఫలితమే కుబేరుడు ఈ జన్మలో తన శాపముచే మిమ్ములను విడదీసినాడు. నీవు కూడ నీకు పనిచేస్తూ ఉండే చెలికత్తెలను వారి భర్తలను కలిసికోకుండా వేరు చేస్తున్నావు, అది పాపకరమైన కార్యము, అలా చేయరాదు అని దేవి బోధిస్తుంది.

ఆయన జూన్ 6, 1897 ను పరమపదించారు.

Saturday, December 29, 2018

తేలియాడే ఇటుకల నిర్మాణం భు కంపాలను తట్టుకునే సామర్ధ్యం


అద్భుత మన సాంకేతిక జ్ఞాన....

ఇది భారతదేశంలో ఒక 800 ఏళ్ల ఆలయం నుండి తీసుకోబడిన ఒక రాక్, మరియు దీనికి కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. నీటిలో పడిపోయినప్పుడు, ఇది సాధారణ శిలలవలె మునిగిపోదు, అది తేలుతుంది. నీటిలో సహజంగా తేలియాడే కొన్ని రాళ్ళు ప్యూయిస్ వంటివి కానీ ఇక్కడ మీరు చూసే ఈ రాతి సహజమైన నిర్మాణం కాదు. వాస్తవానికి ఇది ఒక రాయి కాదు, ఇది ఒక ఇటుక, ఇది బురద మరియు ఇతర పదార్ధాల మిశ్రమాన్ని ఒక 1000 డిగ్రీల సెల్సియస్కు వేడి చేసి, తేలికపాటి బ్లాక్గా తయారు చేయబడింది.
 ( *పురాతన శిల్పాలను పరిశోధించే శిల్పకారుడు మరియు అరవింద్ అయిన దినేష్. నేటి సాంకేతికతను ఉపయోగిస్తామని వారు వివరించారు* )

ఈ బ్లాక్లను *ACC లేదా AAC బ్లాక్స్* అని పిలుస్తారు. AAC అనేది *ఆటోక్లావ్డ్ ఎరేటేడ్ కాంక్రీట్* కోసం నిలుస్తుంది - *కాంక్రీటులోకి ఫోమ్ను* ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇది తేలికపాటి బ్లాక్ చేస్తుంది. నీటిలో పడిపోయినప్పుడు ఈ బ్లాక్లు, మేము చూసిన పురాతన ఇటుకలాగే కూడా తేలుతూ వచ్చాయి.

వికీపీడియా పేజీని చూస్తే, ఇది 1920 ల మధ్యకాలంలో AAC కనుగొనబడింది, కేవలం 100 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ

ఈ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో 800 ఏళ్ల క్రితం ఉపయోగించిందని మనము చూడవచ్చు

అప్పుడు, ఇటుకలను తయారు చేసేందుకు పురాతన బిల్డర్లు( మన పూర్వులు) ఏమి చేసి ఉంటారో మాకు తెలియదు,. ఇది ఎలా సృష్టించబడిందో తెలియదు కాబట్టి, ఈ ఇటుకలను ఎందుకు సృష్టించాలో చూద్దాం.

పురాతన భారతదేశం లో ఇటువంటి తేలికైన ఇటుకలు ఈ ఇటుకను రామప్ప ఆలయం అని పిలిచే ఒక ఆలయం నుండి తీసుకున్నారు, అందుచే  దేవాలయానికి వెళ్లి ఈ తేలికపాటి ఇటుకలను ఎందుకు ఉపయోగించాలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ అద్భుతమైన దేవాలయం అని మీరు చూడవచ్చు,  ఈ దేవాలయం క్రింద భాగం ఇసుక రాయితో చేయబడుతుంది, ఇది 25 అడుగుల ఎత్తులో ఉంటుంది, కానీ పైన ఉన్న భారీ టవర్ ఉంది, ఇది పూర్తిగా ఈ ఫ్లోటింగ్ ఇటుకలతో తయారు చేయబడింది.
ఇది ఇప్పుడు ఆర్కియాలజీ విభాగం ద్వారా పారిస్ ప్లాస్టర్తో కప్పబడి ఉంది.
గోపురం కోసం తేలికైన ఇటుకలను సృష్టించేందుకు మరియు ఉపయోగించేందుకు పురాతన బిల్డర్లు ఎందుకు నిర్ణయించుకున్నారు?

భూకంపాల దాడులను తట్టుకునేందుకు తయారు చేయబడ్డ తేలికపాటి ఇటుకలు

     ఆధునిక ఇంజనీర్లు వాటిని భూకంపం రుజువు చేయడానికి భవనాల్లో తేలికపాటి బ్లాక్లను ఉపయోగించమని సిఫార్సు చేస్తాయి.
భారీ పదార్ధాలతో నిర్మించిన నిర్మాణాలు దృఢమైనవి మరియు *భూకంపం సంభవిస్తే* తక్కువగా ఉంటుంది.

ఒక భూకంపం సంభవించినప్పుడు తట్టుకునే సామర్ధ్యం మన వద్ద 800 సం. క్రితమే ఉన్నదనే కదా*...
ఈ ఫ్లోటింగ్ ఇటుకలతో మేము ఒక భవంతిని చేస్తే, భవనం మైదానంతో పాటు ఊగిసలాడుతుంది మరియు కూలిపోదు.,

ఇది మన సాంకేతిక జ్ఞానం... 800 ఏళ్ల క్రితం  భూకంపం ను తట్టుకునే విధంగా చేసిన కట్టడాలకు రుజువును....

నా ఆలోచన ప్రకారం 7 లక్షల సం. క్రితం నాటి రామవారది.. *రామసేతు* కు ఇదే పరిజ్ఞానం ఉపోయోగించి ఉంటారేమో......

                   చదవండి....చదివించండి

పునర్జన్మ

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

         

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.

”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.

ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు.

“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.

స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.

”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”

“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు.

మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”

ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.

ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.

సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం ||

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

హిందూ సాంప్రదాయంలో ముగ్గుకున్న ప్రాముఖ్యత



అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలకి ఆమె నుంచి తొలి ప్రశంసని తెచ్చి పెట్టేది ముగ్గే. అందుకే ఆడపిల్లలు వివిధ రకాల ముగ్గులు వేయడం నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు.

మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. 

ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు. అట్లాగే వంగినప్పుడల్లాaశ్వాస నిదానంగా పీలుస్తూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అవుతుంది.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం. 

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు. స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ. వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు.

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....


నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...