Monday, December 3, 2018

ఘంటసాల జయంతి సందర్భంగా అయన గురించి కొన్ని విశేషాలు




బాల్యం

ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడసమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.

సంగీత సాధన

తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపాల్దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు.

శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం(ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.

వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

సినీ ప్రస్థానం

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.

సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలోమొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.

తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాలచిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

కీలుగుర్రం సినిమాలో ఘంటసాల ప్లేబాక్ పాడిన కాదు సుమా కల కాదు సుమా పాట

విజయ విహారం

1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

చివరిదశ

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలోప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

వ్యక్తిత్వం

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.

"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.

సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు

వ. నా. సం. కు. శ.

మంగళ చండీ స్తోత్రం

కుజగ్రహ దోష నివారణకు "మంగళ చండీ స్తోత్రం"

ప్రధానాంశ స్వరూపా యా దేవీ మంగళ చండికా ||

ప్రకృతేర్ముఖసంభూతా సర్వమంగళదా సదా |
సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణీ ||

తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా |
ప్రతిమంగళవారేషు ప్రతివిశ్వేషు పూజితా ||

పంచోపచారైర్భక్త్యా చ యోషిద్భిః పరిపూజితా |
పుత్రపౌత్ర ధనైశ్వర్య యశోమంగళ దాయినీ ||

శోక సంతాప పాపార్తి దుఃఖ దారిద్ర నాశినీ |
పరితుష్టా సర్వవాంఛాప్రదాత్రీ సర్వయోషితాం ||

రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరీ |

"ప్రకృతి' దేవియొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖమునుండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువలన మంగళ చండియని కీర్తింపబడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింపబడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము, దారిద్ర్యము,పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్ఠురాలైనచో స్త్రీలందరకు అన్ని కోరకలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును.

ప్రకృతి ప్రధానాంశ రూపమంగళ చండికాదేవి. ఈమె నేలపై నీటిపై నంత రిక్షుమున పిల్లలున్నచోట నుండి మంగళము గల్గించుచుండును. ఈమె ప్రకృతి ముఖము నుండి యుద్భవించెను. సర్వమంగళ రూపమున సంహారమున కోపముగనుండు దేవి. అందుచే పండితులీమెను మంగళ చండిక యని పిలుతురు. ఈమె ప్రతి మంగళవారమున ఎల్ల జగము లందు పూజింపబడుచుండును. ఈమె ప్రసన్నురాలైనచో స్త్రీలకు పుత్ర పౌత్ర ధనైశ్వర్య యశో మంగళములను ప్రసాదించును. స్త్రీలకోర్కె లన్నియును దీర్చగలదు. 

త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు,సంసారంలో గొడవలు,అనారోగ్య సమస్యలు,కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

మంగళ చండీ స్తోత్రం

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

Sunday, December 2, 2018

పురోహితునికి భార్యవ్వడం భగవత్‌సంకల్పం



" వద్దు మమ్మీ.. ఎన్నిసార్లు చెప్పాలి? ? "
" మళ్ళీ ఆలోచించమ్మా.. అబ్బాయికి ఏ దురలవాట్లూ లేవు.. "
" ఐతే? "
" మంచి కుటుంబం, సొంత ఇల్లు, కళ్ళెదుటే ఉంటారు. సంఘంలో మంచి గౌరవస్థులు.. "
" అబ్బా..ఎన్నిసార్లు చెప్తావ్ అరిగిపోయిన రికార్డులా.. ఆపంచె, నామాలూ..ఉఫ్ఫ్..
" అదికాదమ్మా, మీరిద్దరూ ఈడూజోడూ బావుందని మన సిద్ధాంతిగారు చెప్పారు జాతకాలు చూసి.. "
" ఛ..మీరు మారరా? జాతకాలట జాతకాలు.. "
" అదేంటమ్మా అలా అంటావు? సంబంధం నచ్చకపోతే వదిలేయ్, సంప్రదాయాలను దూషించకు. "
" మీ ఛాదస్తం మీదిలే. న్యూజెర్సీ సంబంధమే ఖాయం చేయండి. ఇదే ఫైనల్. "
" అంతదూరం పంపాలంటే బాధగా ఉందిరా.. "
" నేను బావుండాలా? హ్యాపీగా ఉండాలా? లేదా ఆ పూజారితో పొద్దున్నే మడికట్టుకొని పూజలు చేసుకోవాలా? "
" వద్దులేమ్మా.. నీ ఆనందమే మాక్కావాలి. వాళ్ళతో మాట్లాడమంటా మీ నాన్నని. అనవసరంగా ఆ అబ్బాయిని ఏమనొద్దు. మంచివాడు పాపం. "
" సరే.. ఆపనిలో ఉండండి.  "
" ఏమందండీ మీ అమ్మాయి? ఒప్పుకుందా ఒదినగారూ? "
" లేదు వదినగారూ.. మీ అబ్బాయిని చేసుకోడానికి ససేమిరా అంటోంది "
" అయ్యో మావాడికేమిటమ్మా తక్కువ? " రోజూ ఆలయానికొస్తూంటారు కదా.. ఏవైనా అవలక్షణాలున్నాయా? పైగా వేదం కూడా చదివాడు "
" ఎంతమాట వదినగారూ..మీ అబ్బాయికి పేరుపెట్టడం అంటేనే మహా పాపం.. మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికాసంబంధమేకావాలట మాదానికి "
" సరేలేమ్మా, పిల్లల మనస్సు నొప్పించకూడదు. కలిసిబ్రతకాల్సింది వాళ్ళు. ఇంక మీ అమ్మాయిని బలవంతపెట్టకండి. "

... ... ...

" ఏమ్మా ఎమయ్యింది ? "
" నువ్వు నచ్చావు, నీ పద్ధతులు నచ్చాయి కానీ నీ వృత్తే నచ్చలేదట.. "
" అర్ధమయ్యినమ్మా. దిగులుపడకు. నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి చులకనభావన "
" బాధపడకురా. ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను అన్నాడు పేరయ్య "
" మంచి సంబంధం కాదమ్మా, మంచి అమ్మాయి ఐతే చాలు. నీతో కలిసిపోయి ఉండగలిగితే చాలు.

... ... ...

" అన్నీ సర్దుకున్నావా? మళ్ళీ సంవత్సరం దాకా రావాయె. అల్లుడు పెళ్ళవ్వగానే మరుసటిరోజేవెళ్ళిపోయాడు.. పట్టుమని పదిరోజులు కూడా లేడు "
" మమ్మీ, పెద్ద జాబ్. ఊపిరిసలపని పని. ఇదేమైనా గుడి ఊడ్చే పని అనుకున్నావా? శెలవుదొరకడమే పెద్ద విషయం ఆయనకి "
" సర్లేమ్మా.. మళ్ళీ ఆ సంబంధాన్ని దెప్పడం ఎందుకు? ఐనా మంచి పిల్ల వాళ్ళ చుట్టాల్లోనే చూసి చేసేసారు పోయిన వారం. చిలకాగోరువంకల్లాగున్నారు జంట.
" వాటెవర్. క్యాబ్ వచ్చేసింది. ఏడవకు. నేనేమీ జైలుకి పోవట్లేదు. జస్ట్ అమెరికా అంతే. స్కైప్ లో రోజూ మాట్లాడుతూంటాకదా.. వెళ్ళొస్తా మమ్మీ, వెళ్ళొస్తా డాడీ.. "

... ... ...

" ఏమోయ్.. ఏంటి దిగాలుగా ఉన్నావు ? "
" నేనొచ్చి అప్పుడే రెండేళ్ళైపోతోందండీ..సెలవుకు సీరియస్ గా ప్రయత్నించండి.  మా చెల్లాయ్ పెళ్ళ్కి రెండునెలలముందైనా లేకపోతే ఎలా? "
" చూస్తున్నావు కదా.. ఆదివారాలు కూడా వెళ్ళాల్సొస్తోంది. ఉదయం ఆరింటికి బయల్దేరితే ఆరింటికి ఇంటికొస్తున్నాను. తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సెలవు దొరకట్లేదు "
" అదేంటండీ.. ఏడెనిమిది నెలలనుంచీ ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. ఇండియా చాలా మిస్సౌతున్నాను. "
" సరేలే. ఒక నెలముందు నువ్వెళ్ళు. సెలవు దొరకకపోతే ఒక వారమైనా ఎమర్జెన్సీ లీవు పెట్టుకొని పెళ్ళికొస్తాను. ఫ్రెష్ అవ్వు, గుడికెళ్దాం. మా బాసు, వాళ్ళావిడా రమ్మన్నారు "
" ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాము. మళ్ళీ దీపావళి వచ్చేసింది. మీ బాసు పుణ్యమా అని ఇన్నాళ్ళకి వెళ్తున్నాం. మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇంటిపక్కనే గుడి. రోజూ వెళ్ళేవాళ్ళం "
" నువ్వు రెడీ అయ్యి గుడికి పక్కింటావిడతో వచ్చేయ్ ఎప్పటిలా.. నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి గుడికి వచ్చేస్తాను. టైం లేదు మళ్ళీ మధ్యలో ఆగి షాపింగ్ చేయడానికి.

" అరే..ఇతను ఇక్కడున్నాడేంటి ?"
" నీకుతెలా ఆయన? మొన్ననే ఇండియానుంచి తీసుకొచ్చారట, వేదపండితుడట "
" తెలుసు. నాకు ముందర ఇతనితోనే ఇచ్చి చేద్దామనుకున్నారు మావాళ్ళు హ..హ.. మా ఇంటిపక్కన గుడి అని చెప్పాను కదా.. ఈయన అందులోనే పనిచేసేవారు.
" ఎందుకే నవ్వుతావు.. ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావే.. ఆయనకేమి తక్కువ? రెండునెలలకోసారి ఇండియాకి సెలవుమీద వెళ్ళొస్తారు. మనం ఇండియాకెళ్ళడం మాట దేవుడెరుగు. నెలకొకసారైనా ఇల్లుదాటి బయటకెళ్ళలేకపోతున్నాం.
మా ఆయనా మీ ఆయనా సంపాదించేదానికన్నా ఎక్కువ ఈయన జీతం. మనమే కాదు, మీ ఆయన బాసు కూడా ఈయనకాళ్ళమీదే పడతాడు చూడు. ఆ పక్కన విల్లా చూడు. అదే ఈయనకి ఇచ్చిన ఫ్యామిలీ ఎకామొడేషన్. మనలా అగ్గిపెట్టిల్లాంటి గదులుకావు "
" అంటే పూజారి అనీ.. "
" నీ ఖర్మ. పురోహితుణ్ణి చేసుకోవాలంటే నువ్వు కావాలంటే చేసుకోలేవు. పెట్టిపుట్టుండాలి. వచ్చిన లక్కుని వద్దనుకొని బాధపడితే ఏమి లాభం? అదిగో..మీ ఆయనా, మా ఆయనా సామాన్లు తీసుకొస్తున్నారు. పద పద మన భర్తల ప్రమోషన్లకోసం, జీతం పెరగడం కోసం, ఉద్యోగాలు పీక్కుండా ఉండాలనీ వెళ్ళి ఆయనకాళ్ళమీదే పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి. 

బ్రాహ్మణస్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి. మీకు మరోజన్మంటూ ఉందో లేదో తెలీదు. ఈజన్మలో అత్యంత పవిత్రమైన, భగవంతుని సేవకుడితో పెళ్ళయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు. డబ్బూ దస్కం, విదేశాల్లో ఉద్యోగం, ఆస్థీ అంతస్థూ ఇవేమీ శాస్వతంకావు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఊడొచ్చు. ఉన్నా అదొకరిదగ్గర పనిచేయడమే ఎంత పెద్ద ఉద్యోగమైనా. అర్చకత్వమంటే భగవంతునికే సేవచేయడం. అలాంటి అర్చకునికి భార్యగా సేవలుచేసుకొనే భాగ్యం పుణ్యవతిలకు దేవుడిచ్చే భాగ్యం, భగవత్‌సంకల్పం. స్నేహితురాళ్ళముందు చులకనౌతామనో లేదా చెప్పుకోవడానికి బావుండదనో లేదా ఏహ్యభావంతోనో అలాంటి సంబంధాలు తిరస్కరించొద్దు. ఎందుకంటే అలా వెటకరించేవాళ్ళందరూ పురోహితుని పాదాలను పట్టుకోవాల్సినవాళ్ళే. కనుక పురోహితుని భార్యగా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకొనే భాగ్యాన్ని కోల్పోవద్దు.

Written by_ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Friday, November 30, 2018

తురగా రామకవి


రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని ప్రసిద్ధి. ఆయన 1720 ప్రాంతం వారు.
ఆడిదం సూరకవి సమకాలికుడు.
చాటు కవిత్వానికి ప్రసిద్ధులు.

జీవిత విశేషాలు:

భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వారు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవారు. అయనకి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట.

ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చారట. అంతకుముందే ఆయన వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట.

 అందుకు కోపగించిన కవిగారు రాజు గారి కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట.

 కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మొహమాటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.

ఈ కవి లేటవరపు పోతురాజ అనే క్షత్రియుని యింటికి వెళ్లగా అతడు కవి గారి కి ఏమైనా ఇయ్యాల్సి వస్తుందని, ఇంటిలో వుండి కూడా లేడని భార్య తో చెప్పించాడట. అప్పుడు రామకవి,

 కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నించారట. వెంటనే పోతురాజు చనిపోయినాడట. దహన నిమిత్తం బంధువుల ఇంటి నుండి శవమును తీసుకుని పోతున్నప్పుడు అతని భార్య వచ్చి కవి గారి కాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా  రామకవి కరుణించి,

 మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కాడి మీదనుండి దిగివచ్చాడట!

రామ్ కవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు గారు వారి స్వగ్రామము ఉంగుటూరు లో  ఒక పెద్ద యిల్లు కట్టించి, దానిని చూపించటానికి కవి గారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక గదిలో విడిచి బావమరిది ని ఆట పట్టించాలనుకుని తాను వేరొక గది లో దాక్కున్నారు. కవి గారు ఆ పెద్ద ఇల్లంతా తిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,

  అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.

అనగానే కావుకావని అరుస్తూ ఇంటికి నలుమూలల  పట్టపగలు పిశాచాలు సంచరించటానికి వచ్చాయట.

రామకవి ఇల్లు కట్టించుకొంటునప్పుడు దారిని పోయేవారిని అందరినీ పిలిచి తన గోడకు ఇటుకలు అందించమని చెప్పీవారు! ఒకనాడు ఆ దారిన అడిదము సూరకవి గారు పోతుండగా రామ కవి గారు వారిని పిలిచి తక్కినవారిని అడిగినట్లే వారి ని కూడా కొన్ని ఇటుకలు అందిచ్చి పొమ్మని అడుగగా  కోపింతో రామకవి అని తెలియక, సూరకవి

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"
అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,
"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకలు వేసారట. అంతట సూరకవి గారు అడిగింది  రామకవి గారు అని తెలిసికొని  వారి నోటి వాక్కు కు భయపడి, కొన్ని ఇటుకలు అందించి  మరీ వెళ్ళారట.!

ఇవి అన్ని కేవలం కల్పిత కథలనే వాళ్ళు ఉన్నారు..

ఇటువంటి మహా మహిమగల వాడన్న వేములవాడ భీమకవి కోమటి పేర కృతి చేసి స్తుతించినట్లే  ఈ రామకవి కూడా కంసాలి పేర కృతి చేసి స్తుతించారు..

ఆయన మరియు అయ్యంకి బాలసరస్వతి అనే మరొక కవి కలిసి రచించిన నాగరఖండము అనే 5 అశ్వాసముల గ్రంథం ఒకటి కనబడుచున్నది.

ఈ ఇద్దరు .కవులు తమ గ్రంథము యొక్క యాశ్వాసాంత గద్యము ను ఈ ప్రకారముగా వ్రాసుకొన్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈ నాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడు అనే స్వర్ణకారుడి కి అంకితము ఇచ్చారు. అతను బెజవాడకు ప్రభువు గా ఉండినట్ల ,క్రింది పద్యము వల్ల తెలుస్తోంది.

రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈ ధవళేశ్వరపు మార్కండుడు మహమ్మదు కుతుబ్ షాహి కాలములో ఉన్నట్లు నాగరఖండము యొక్క అవతారికలో ఈ క్రింది పద్యమున చెప్పబడింది.

క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

నాగరఖండము అను గ్రంథమున కవితా శైలి:

నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగములు ఉన్నా  మొత్తం మీద కవిత్వము హృద్యముగానే ఉన్నది. నాగరఖండము నుండి కొన్ని పద్యములు

ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
   తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
   స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
   న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై.

 ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
   త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
   నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
   ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా.

 ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
   ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
   యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
   హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా.

 కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
   రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
   హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
   యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్.

కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
   నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
   దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
   ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్.

Thursday, November 29, 2018

మీలో ఎంత మందికి తెలుసు? "ఆడిదము సూరకవి"

మన తెలుగు సాహితీ చరిత్రలో చెప్పుకో దగిన కవులలో “అడిదము సూరకవి” ఒకరు. ఈయన 18వ శతాబ్ధమునకు చెందిన వారు. కవితా వృత్తిచే ఆంధ్రదేశమంతటా పేరు పొందిన  బ్రాహ్మణులు శివ శ్యామలా దేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారు. వీరికి 14 తరాల నుండి రాజాస్థానం లభించింది. వీరు కళింగ దేశంలోని విద్వత్కవి వంశములోని వారు.

అసలు అడిదము వారి వంశం మొదట మోదుకూరు పిమ్మట గంధవారణం, అనే ఇంటి పేర్లు ఉండేవట. తదుపరి వీరి పూర్వీకులైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని(కత్తిని) కానుకగా పొందారట. అప్పడినుండి “అడిదం” వారని ప్రసిద్ధి వచ్చిందట.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డారు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.

ఇతడు లోకంలో తిట్టు కవిగాను, లోకజ్ఞుడు గాను, విఖ్యాతుడైనప్పటికీ “రామలింగేశ శతకం” వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం రచించారు. ఆయన నీలాద్రి కవికి 9వ తరం వాడు. ఆయన సంభాషణాత్మక చాటువును ఇలా వ్రాసారు.

“ఊరెయ్యది చీపురు పలి
పేరో సూర కవి ఇంటి పేరడిదము వార్
మీ రాజు విజయ రామ మ
హా రాజతడేమి సరసుడా ? భోజుడయా ?”

ఇలా ఈ పద్యాన్ని బట్టి తనకి తనే స్వయం గా చాటువులో చెప్పుకున్నారన్న సంగతి విదితమౌతోంది. అంతే కాదు ఈయన విజయనగర ప్రభువు పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తూనే పెద్దాపుర ఆస్థానంలో ఈ కవి గారు చెప్పిన సుప్రసిద్ధ చాటువు ఇది.

అంతే కాదు మన సూర కవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటువు కుడా ఇదే .

“రాజు కళంక మూర్తి,రతిరాజు శరీర విహీను,డంబికా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమవర్తి,వి
బ్రాజిత పూసపాడ్విజియ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్ !”

ఈ పద్యం వినగానే సభలో ఉన్న రాజులందరు తమని తరాజులంటున్నాడని రోష పడ్డారట. అప్పుడు “తాను పేర్కొన్న రాజు చంద్రుడు, వానికి మచ్చ రతిరాజు అనగా మన్మధుడు, అతగాడికి శరీరమే లేదు, ఇక శివుడికి కట్టు బట్టల్లేవు, సింహం గుహల్లొ నివాసం, వీళ్ళు రాజు లేమిటి?” అని వారినే తాను రాజులు గా చెప్పినట్టు చమత్కరించారట.

ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పినందుకు ఆయన విద్వత్తుకు మెచ్చి విజయ రామరాజు కనకాభిషేకం చేయించాడట. ఐతే ఆనాటి ఆనవాయితీ గా తనకు అభిషేకించబడిన ఆ బంగారు నాణాలను ఆ కవి తీసుకోవాలని రాజాజ్ఞ. కానీ సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మిక్కిలి సంతసించి “తమ దయవలన ఇంత వరకు స్నానం చేసిన ఉదకమును పానము చేయ లేదు. తమరి ఆజ్ఞని సిరసావహించనందుకు మన్నించమని తీసుకోవడనికి సమ్మతించలేను” అన్ని ఆ నాణాలు తీసుకోలేదట. అందుకు ముగ్ధుడైన రాజు తగు రీతిన సత్కరించాడట. బహుశ అప్పడి నుంచే “డబ్బు నీళ్ళలా వాడటం” అనే నానుడి వచ్చిందని ప్రతీతి. అంటే దీని బట్టి మన సూర కవి దారిద్ర్యానికి అధికారానికీ తల వొగ్గలేదన్న మాట.

18వ శాతాబ్దం తొలి పాదంలో సుమారు 1720 లలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవారు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నారు.

 సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర గారు రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితుల ఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –

గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖాను మీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచారు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నారు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య, భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మన అబ్బాయి బాచన్న మీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజ ధోరణిలో

క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్

బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట, తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ.

సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.

అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజ ధోరణిలో ఆశువుగా చెప్పిన పద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.

ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు.

ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయ రామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా.

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చు కోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.

సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వం చెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచారు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

ఇక ఆయన “పొణుగుపాటి వేంకట మంత్రి” అనే మకుటంతో 39 కంద పద్యములు కళింగ దేశ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్నాయట. ఈయన శృంగవరపు కోట జమిందారు శ్రీముఖి కాశీపతిరావు గారి వద్ద దివానుగా ఉండేవాడట. అంతే కాదు మన సూర కవి గారు ఈ మంత్రి గారి ఇంట ప్రతి ఏటా మూడు నాలుగు మాసాలు గడుపుతూ ఉండేవాడట. మచ్చుకి ఒకటి రెండు కంద పద్యములు…

1. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నెకెక్కును
విన్నావా పొణుగు పాటి వేంకట మంత్రీ !

2. చుక్కలవలె కర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణుగు పాటి వేంకట మంత్రీ !

3. పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయ నట్టి భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
వెగటు సు మీ పొణుగు పాటి వేంకట మంత్రీ !

కంద పద్యానికి చౌడప్ప అలవరించిన తేట దనానికి మెరుగులు దిద్దడం సూరకవి కందములో అందముగా అగుపిస్తుందట. ఇక పోతే చుక్కలవలె అన్న పద్యం “కన్యాశుల్కం”లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేంత ప్రసిద్ధమైనదట. ఈయన చాటువులు సమకాలీన కవితా రంగం పై గంట పట్టిన ప్రతి వాడూ వ్రాయడాన్ని గురించి ఇలా విమర్శించాడట.

“దేవునాన మున్ను దేశాని కొక కవి
ఇప్పుడూర నూర నింట నింట
నేవు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసి కవులు పద్మ నాభా !” అని ఎత్తి చూపారట.

సూర కవి “తిట్టు కంసాలి సుత్తి పట్టు” అన్నట్టు గా సూర కవి చాటువులు విజయనగర సమీపంలోని రామచంద్రాపురంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయట.

ఆయన రామలింగేశ శతకం సమకాలీన సాంఘిక జీవనానికి దర్పణం వంటిది.

అంతే కాదు, ధన ధాన్యాలను దోచుకునే రాజులను
“పదుగురు కోతి వెంబడి సంచ రింపరే-వాహకుల్లేరె శవంబునకును
గంగి రెద్దుకులేని ఘన తూర్య రావముల్-కలిమి గల్గదె వారి కామినులకు
న్యాయ పద్ధతి నడువని యవనిపతికి నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొరకు”

-అంటూ ఈ శతకము నుంచి ఉదహరింప బడినవి. వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట,
రాజీవాక్షుండు అవిరళముగ శేషుని పై పవళించుట
నల్లి బాధ పడలేక సుమీ
-అన్న పద్యంలో చాటువు హాస్యం కుడా మిళిత మై ఉండటం గమనార్హం.

 ఈయన తిట్టు పటిమను గురించి తిట్టు కవిగా

“గంటకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడ గితినా పఠీలుమని తూలి పడన్ కుల రాజముల్
విడువ కనుగ్రహించి నిరుపేద ధనాధిపు లార్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే”
-అంటూ ఆయన రాజాస్థానాలను సందర్శించి విజయాన్ని చేపట్టి నట్టు తెలుస్తోంది

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

ఈయనకు శాపానుగ్రహ సమర్థుడు అనే బిరుదు కలదు. దేశం లో అనేక ప్రాంతాల్లో సందర్శించారు. సంవత్సరం లో ఆరు మాసాలు దేశ సంచారము చేసేవారట. సూరకవి తన సమకాలీన పండితులనెందరితోనో, వాగ్వివాదాలు చేసి, గెలిచారట.

సూరకవి బహు గ్రంధకర్త. ఆయన రచనలు.

కవిజనరంజనము

కవిసంశయ విచ్ఛేధ

చంద్రలోకం

ఆంధ్ర నామ శేషము

రామలింగేశ శతకము

పొణుగుపాటి వేంకట మంత్రి శతకము

రామదండకము

 ఈయన 1785 లో పరమపదించారు.

Wednesday, November 28, 2018

"దక్షిణామూర్తి స్తోత్రం"

గురుగ్రహ దోష నివారణకు

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్

Monday, November 26, 2018

పూజ..? యజమాని ఉత్తరీయం..? గోచీపోసి పంచె..?


సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.

అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.

ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ,వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం.

మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది."వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి. 

ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే   యజమాని యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే.

కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు.దేవాలయంలోనైనా అంతే. దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. అలా చెయ్యకపోతే  భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. అందువలన పురుషులు(యజమాని)పూజ చేసెపుడు ఉత్తరీయం వేసుకోవాలి, గోచీపోసి పంచె కట్టుకోవాలి.....

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...