Wednesday, October 17, 2018

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం




మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.



తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.



అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి' ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!

భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది

ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి.  ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది.   




పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు.  "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని చెప్పాడు. 

పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు.

పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని  చెప్పాడు.

" నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతాలు  వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది.

అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేస్తాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది.

జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది.

మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. 

పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

పార్వతీదేవి "మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయ త్నాలు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది.

అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు" అని చెప్పాడు శివుడు. స్వస్తి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..?



 దేవునికి  హారతి ఇవ్వడానికి కారణం ఏంటి? హారతి రహస్యం ఏంటి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే... భగవంతునికి హారతి ఇచ్చేప్పుడూ... 'స్వామీ... ఈ జన్మని ఇచ్చావ్. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకా ఎన్నో పరిణామక్రమాలు చూడాల్సి ఉంది. అందుకే.. ఎలాంటి కష్టాలు కలుగనీయకుండా... ఈ హారతి కర్పూరం మాదిరిగానే... నీలో  ఐక్యమైపోయే అదృష్టాన్నిప్రసాదించు తండ్రీ'  వేడుకోవడమే హారతి  ఇవ్వడంలోని ఆంతర్యం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ ....✍ 

ధర్మం గుఱించి “కర్ణ-శ్రీకృష్ణ” సంవాదం


ఓ కృష్ణా!  నేను పుట్టి పుట్టక ముందే నా తల్లి కుంతి నన్నువదిలి వేసింది,
అలా పుట్టడం నా తప్పా? నా పాపం కాదు గదా ?
నేను సూతుడనైనందున ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు 

పరశు రాముడు నాకు యుద్ద విద్య నేర్పాడు కాని, అవసర సమయంలో నాకు మంత్రప్రేరిత  అస్త్రాలు ఏమీ గుర్తు రావు అని శపించాడు 

పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు 

ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించబడ్డాను 

చివరికి నా తల్లి కుంతి కుడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణం లోనే నా జన్మ రహస్యం నాతో చెప్పింది , అదీ కుడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం

ఇంత వరకు నేను ఏదైనా పొందాను, గౌరవించబడ్డాను అంటే, అది దుర్యోధనుని దయాబిక్ష !!!

ఇప్పుడు చెప్పు కృష్ణా! నేను దుర్యోదనుని పక్షాన నిలబడం లో తప్పేంటి ?

ఓ కర్ణా! నేను చెరసాల లో పుట్టాను 

నేను పుట్టక ముందు నుండే నన్ను చంపడానికి చూసారు 

నేను పుట్టిన రాత్రే,  నేను నా జననీ జనకుల నుండి నుండి వేరుచేయ బడ్డాను 

నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము, కర్రసాము , రథారోహణ, అశ్వచాలనం, ధనుస్సు, బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు

నేను ఆల మందలను కాస్తూ పెరిగాను, పైగా నడక రాక మునుపే, నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి 

నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు, నాకు ఏ ప్రాధమిక విద్యా లేదు 

"జనమంతా వాళ్ళ భాదలకు కారణం నేనే  కారణం అట" కొన్నిసార్లు జనాలు అనడం నేను విన్నాను 

నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువుల చేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు, కనీసం నాకు ప్రాధమిక విద్య కుడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా!  నా 16వ ఏట !

నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు  నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు, రాక్షసుల / దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను

జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం, నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది.  దానికి కొందరు పిరికి వాడు అనికూడా అన్నారు 

ఒక విషయం గుర్తుంచుకో కర్ణా!

జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూల పాన్పు కాదు..ధర్మరాజు కుడా ఎన్నో సార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ అతను నమ్మిన ధర్మాన్ని అతను ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో? నీ అంతరాత్మకు తెలుసు.

ఎన్ని సార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు  ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం .

ఆరోపణలు ఆపు కర్ణా!

 దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు. ఇది నీకు పూర్తిగా  తెలుసు అయినా అతని పక్షం వహించావు. నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు, నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు కాకూడదు

"ధర్మోరక్షతి రక్షితః"  అనే సూక్తి ని అందంగా అర్ధం అయ్యేలాగ వివరించారు. ఎంత కఠోర పరిస్థితుల కారణం గానైనా ధర్మం తప్పితే అధర్మం.

ధర్మోరక్షతి రక్షిత:

పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి"



ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు . స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు . గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీ కి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాశేవారు. అది తరువాత 'బవారస్'గా మారింది. వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.


సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. పూరాతత్వ పరిశోధనల లెక్కల ప్రకారం వారణాశి పరిసర ప్రాంతాలలో క్రీస్తు పూర్వం 11-12 శతాబ్ధాలలోనే నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తోంది. ఇది ఆర్యుల మత, తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతోంది. 



ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా... ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 

వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. అయితే 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని రెండు గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.



కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో 'సంకట్ మోచన్ హనుమాన్ మందిరం' కూడా అతి ముఖ్యమైనది . ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు .. కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

దీపం వెలిగించే విధానం


                                  భక్తి సమాచారం


ఇక్క డ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను, స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక ననకు వేదమూ అవసరమే, వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.
ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.
భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి.

అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...