Tuesday, August 21, 2018

హస్తామలక స్తోత్రం

ఆదిశంకరుల జీవితానికి సంబంధించిందే హస్తామలక స్తోత్రం.అందులోనూ ఆయన శిష్యులలో ఒకరైన హస్తామలకాచార్యుల వృత్తాంతం ఇది. ఎంతో విస్మయాత్మకంగానూ, ఆత్మజ్ఞాన ప్రబోధకంగానూ ఈ కథ కనిపిస్తుంది. అలాగే మహనీయులు, సిద్ధపురుషులు, తపశ్శక్తి సంపన్నుల స్పర్శ మూగవారిని మాట్లాడేలా చేస్తుందని, అంధులకు చూపు తెప్పిస్తాయని, వికలాంగులకు పరుగెత్తే శక్తిని ఇస్తాయని, చెవిటి వారికి వినికిడి శక్తిని సమకూరుస్తాయని రామాయణాది ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ తరచూ కనిపిస్తుంటుంది. అహల్య శాప విమోచనం ఇందుకొక ఉదాహరణ. అలాంటి విస్మయాత్మక సంఘటన ఈ కథలో ఉంది. రామాయణం, పురాణాలు ఏనాటివో అనుకున్నా.. ఈ ఇతివృత్తం దాదాపు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దానికి చెందినదే. దీనివల్ల మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్న ఆచార్య పరంపర శక్తి ఎంతటిదో సులభంగా అవగతమవుతుంది.

ఆది శంకరులు దేశాటనం చేస్తూ బలి అనే గ్రామానికి వచ్చారు. శిష్యసహితంగా బలి గ్రామంలో ప్రవేశించిన శంకరులకు ఓ విచిత్ర సన్నివేశం ఎదురైంది. ఆ గ్రామంలో ప్రభాకరుడు అనే ఓ వేద పండితుడు ఉన్నాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఎంతో ఉత్తముడుగా పేరు పొందాడు ప్రభాకరుడు. అయితే ఆయన జీవితానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. సంతానాన్ని కోరుకున్న ఆయనకు ఓ చక్కటి మగ శిశువు జన్మించాడు. చూపులకు ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉన్నా.. పుట్టినప్పటి నుంచి ఆ శిశువు ఎటూ కదలక, మెదలక ఉండేవాడు. అలా పెరుగుతూ పెరుగుతూ పదమూడు సంవత్సరాల వయస్సు దాకా వచ్చాడు. స్పృహలో లేక ఏది చెప్పినా వినక ఏమీ మాట్లాడక ఎటు చూస్తున్నాడో ఎదుటి వారికి తెలియకుండా అచేతనంగా పడి ఉన్న తన పిల్లవాడిని ఎందరెందరో వైద్యులకు, భూత వైద్యులకు కూడా చూపించాడు ఆ వేద పండితుడు. అయినా ఏమీ లాభం లేకపోయింది. చివరకు ఆదిశంకరులు తమ గ్రామానికి శిష్యసమేతంగా వచ్చాడని తెలుసుకుని పిల్లవాడిని వెంట తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడవేసి తన సమస్యనంతా చెప్పాడు. ఎంతసేపటికీ తనకాళ్ళ మీద నుంచి లేవని ఆ జడుడిని ఆదిశంకరులు తన చేతులతో లేవనెత్తి కూర్చోపెట్టారు.

ఒక్కసారి అతడి వంక చూసి ఎవరు నీవు...? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేమిటి? అని అడిగారు. పదమూడేళ్ళ పాటు ఒక్కమాట కూడా మాట్లాడక జడుడిగా పడి ఉన్న ఆ బాలుడు శంకరులు ప్రశ్నలకు గడగడా అనర్గళంగా శ్లోక రూపంలో సమాధానాలు చెప్పాడు. తానెవరంటే సర్వవ్యాప్తమూ, సర్వోన్నతమూ, చైతన్యవంతమూ అయిన పరబ్రహ్మ (ఆత్మ) అని అన్నాడు. ఆకలిదప్పులు, శ్లోకమోహాలు, జరామరణాలు అనే షడూర్ములు వికారాలు.. జననం, స్థితి, పెరగటం, తరగటం, విరగటం అనే షడ్భావ వికారాలు.. ఇవేమీ లేని సుఖస్వరూపంగా ఉన్న పరమాత్మ స్థితే తాను.. అని అన్నాడు ఆ బాలుడు. ప్రతి జీవిలోనూ ఉండేవి ఆత్మ పరమాత్మ కనుక దేహాలు ఎప్పటికీ శాశ్వతాలు కావు కనుక ఆ దృష్టితో చూస్తే తాను పరమాత్మనేనని ఆ బాలుడు ఆత్మతత్వాన్ని అక్కడున్న వారందరికీ చాలా సులభంగా వివరించాడు.

అరచేతిలో ఉసిరికాయను సంస్కృతంలో హస్తామలకం అని అంటారు. అర చేతిలో ఉసిరి కాయను పెట్టుకొని ఎవరికి చూపించినా అదేమిటో వివరంగా చెప్పకుండానే అందరికీ అర్థమై పోతుంది. అంత సులువుగా దాదాపు పన్నెండు శ్లోకాలలో, ఉదాహరణలతో సహా ఆదిశంకరుల ముందు ఆ బాలుడు చెప్పినదంతా హస్తామలక స్తోత్రం అని ప్రసిద్ధి కెక్కింది. భగవత్పాదులు తనతో అంత చక్కగా మాట్లాడిన అతడి వంక మరోసారి చూసి అతడి శిరస్సున తన చేయి ఉంచి ఆశీర్వదించి దీక్షనిచ్చారు. ఆ బాలుడి తండ్రి అయిన ప్రభాకరుడికి తేరుకోలేని ఆశ్చర్యం కలిగించింది. ఇన్నాళ్ళు తాను కొట్టినా తిట్టినా ఏ రకమైన వైద్యాలు చేయించినా పలకని జడుడు అనుకున్న వాడు ఇంత పాండిత్యాన్ని ఎలా ప్రదర్శించ గలుగుతున్నాడు అని అనుకొంటూ కూర్చొన్నాడు. అప్పుడు భగవత్పాదులు అతడు అజ్ఞాని కాదు అని.. అజ్ఞాని అయిన వాడు ఎప్పుడూ అలా మాట్లాడలేడు అని అన్నారు.

గత జన్మలో అతడొక సిద్ధ పురుషుడని, బ్రహ్మ జ్ఞాన సంపన్నుడని, తపోనిష్టలో ఉండి తనువును చాలించి జన్మించినందువల్ల ఆ నిర్వికల్ప సమాధి స్థితే ఈ జన్మలోనూ ప్రాప్తించిందన్నారు. అంతటి యోగ సిద్ధుడు సాంసారిక జీవితంలో ఉన్నందు వల్ల ప్రయోజనమేమీ ఉండదని అతడిని తన శిష్యుడిగా చేసుకుని తన వెంట తీసుకు వెళ్ళాలనుకొంటున్నట్లు జగద్గురువులు ప్రభాకరుడితో అన్నారు. ప్రభాకరుడు కూడా విషయజ్ఞాన సంపన్నుడు, శాస్త్ర కోవిదుడే కనుక శంకరుల మాటకు అడ్డు చెప్పలేదు. అప్పటి వరకూ ఏ పేరూ లేకపోయినా హస్తామలక స్తోత్రం చెప్పాడు కనుక అతడికి హస్తామలకుడు అని పేరు పెట్టి తన వెంట తీసుకువెళ్ళారు ఆది శంకరులు.

హస్తామలక స్తోత్రంలో హస్తామలకుడు దీనికొక చక్కటి ఉదాహరణ కూడా చెప్పాడు. ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు ఎప్పుడూ అక్కడ అలాగే కనిపిస్తారు. కానీ కదులుతున్న నీటి అలల మీద సూర్యచంద్రుల ప్రతిబింబాలను చూసినప్పుడు అవి కదులుతున్నట్లు అనిపిస్తాయి. ఇలాగే స్థిరమైన పరమాత్మ వివిధ రకాల జీవులలో ఉంటూ రకరకాల ప్రాణులనే భావన కలిగిస్తుంటున్నది ఇక్కడి పోలిక. సూక్ష్మంగా చెప్పాలంటే అన్ని జీవుల్లోనూ పరిపూర్ణ పరిశుద్ధమైన ఆ పరబ్రహ్మ ఉంటాడు కనుక సపర్వనామ భావనను అందరూ పాటిస్తూ శాంతిమార్గాన్ని అవలంభించాలన్నది ఇక్కడ కనిపించే సందేశం.

Monday, August 20, 2018

కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడికికి ద్విముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

కర్కాటక రాశి ఎండ్రకాయ(పీత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) కలిగి ఉంటారు. పురుగు స్వభావం, పట్టుదల, తప్పించుకొనే తెలివి తేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడక పోవటం, జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్షయాలు మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు. కర్కాటరాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి మేషాదిగా చతుర్ధరాశి కావటం వలన ఎప్పుడు మార్పులు కోరుకుంటారు. స్వాభిమానం కలవారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ప్రతి పనిని జాగ్రత్తగా అమలు పరుస్తారు. చురుకుదనంతో పనిచేస్తారు. ఊహాత్మకంగా ఆలోచిస్తారు. జ్ఞాపకశక్తి అధికం. తమ అభిప్రాయాలను పరిస్ధితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉంటారు. కొంతకాలం సంతోషంగా, కొంతకాలం దుఃఖంగా ఉంటారు. వీరి ముఖ కవళికలలో మార్పులు గమనించవచ్చు. ఊహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, జ్ఞాపక శక్తికి, ఆలోచనా విధానంలో మార్పులకు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

కర్కాటక రాశి వారికి దేశాభిమానం ఎక్కువ. పరిసరాలకు అనుగుణంగా ఆత్మరక్షణ చేపడతారు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల సమయంలో ఉద్రేకానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. స్ధిరాస్ధుల విషయంలో మక్కువ కనబరుస్తారు. బంధుప్రీతి కలవారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పరుస్తారు. జనాధరణపై ఆసక్తి. ఆహారపానీయాలు, రసద్రవ్యాలు, నిత్యవసరాలు, జన సంబంధ విషయాలు ఈ రాశి కారకత్వాలకు చెంది ఉంటాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి మనో ధైర్యం అధికంగా ఉంటుంది. జల సంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అవే జీవితంలో పురోభివృద్ధికి కారణం అవుతాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీపరులు ఉన్నత కాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో రాణిస్తారు. లలిత కళలపై మంచి అవగాహన, ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. లలితకళలో రాణించటానికి, స్దిరాస్ధులు సంపాదించుకోవటానికి, గృహ, వాహన యోగం కలగటానికి ఈ అద్భుత అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

కర్కాటక రాశి వారికి సంతాన పురోగతి బాగుంటుంది. ప్రారంబంలో కొన్ని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాల్లో రాణిస్తారు. హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్య నిర్వహణకు చక్కని ఉపాయాలు పధకాలు ఏర్పరచుకుంటారు. తొందరపాటు వలన నష్టపోయే అవకాశం ఉంది. మనల్ని దెబ్బకొట్టటానికి శత్రువర్గం ఎప్పుడు పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది. టెండర్లు, ప్రోమ్టేడ్ పనులు, చేతి వృత్తులకు సంబందించిన కాంట్రాక్టులు అధికంగా లాభిస్తాయి. ధనం స్ధిరం చేసుకోవటం సమస్య అవుతుంది. ఆస్ధుల సంరక్షణకు సంపాదించటానికి పడినంత శ్రమపడాల్సి వస్తుంది. ప్రజాకర్షణ బాగుంటుంది. నిందలు పుకార్లు ప్రజల్లో ఉంటాయి. కానీ ప్రభావం చూపలేవు. క్రీడలకు సంబందించిన వ్యవహారాలు లాభిస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతారు.  సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించటం వలన చివరకు వాళ్ళ వలనే అధిక పోటీ ఏర్పడుతుంది. వివాదాలు ముదరకుండా ఆదిలోనే పరిష్కరించుకోవటం మంచిది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలంలో లాభించవు. పట్టు విడుపు, లౌకిక ప్రవర్తన వలన చెప్పుకోదగిన ప్రయోజనం కలుగుతుంది. భవిష్యత్ గురించి ఒకటే ఆందోళన, ఏదో జరుగుతుందని ముందే ఊహించుకోవటం, ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఊహించుకోవటం, లేని వాటిని ఊహించుకొని భయపడటం, ఉద్రేకాలను తగ్గించటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.

బంధువులతో విభేదాలు చాలా కాలం కొనసాగుతాయి. అనుకున్న వివాహం ఒకటి చేసుకునే వివాహం ఒకటి అవుతుంది. శనిగ్రహం అనుకూలమైన స్ధానంలో ఉన్న వారికి అనుకున్న వివాహం అవుతుంది. వివాహ జీవితంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. బంధువులు, మిత్రులు కన్నా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేనివారు చేరదీసి ఆశ్రయం ఇస్తారు. ప్రోత్సాహాన్ని ఇస్తారు. జీవితంలో ఇది పెద్ద మలుపుగా మారుతుంది. విదేశీయానాం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య మొదలైనవి లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్ధి మిగలకుండా పోతుంది. స్వార్జితమైన ఆస్ది మిగులుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ఏమాత్రం సంబంధంలేని విషయాల వలన ఇబ్బందులు పడటమే కాకుండా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దైవానుగ్రహం, తెలివితేటలు అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. ఉన్నత స్ధానాన్ని నిలబెట్టుకోవటానికి చాలా కష్టపడతారు. భోగభాగ్యాలు  అనుభవిస్తున్నప్పటికి పూర్వకాలంలో తను గడిపిన జీవితాన్ని, ఇబ్బందులను మరచిపోరు. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. గ్రహణాల ఈ రాశి  వారిపై  అధికంగా ఉంటుంది.  సకాలంలో వివాహం జరగటానికి, వైవాహిక జీవితంలో అన్యోన్నతకు, సకల కార్యసిద్ధికి, బంధు, మిత్రుల అభినందనలు పొందటానికి, సంసార సౌఖ్యతకు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.

Saturday, August 18, 2018

ఋణ విమోచన గణపతి స్తోత్రం

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

సంకష్టనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ –
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం

స్కంద ఉవాచ II
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II

శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II

శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II

మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II 

II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II

కార్తికేయుని 28 నామములు -
1.    యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
2.    మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3.    కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4.    అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5.    స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6.    కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7.    సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8.    స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9.    గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10.          తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11.          బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12.          శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13.          తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14.          ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15.          క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16.          షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17.          శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18.          సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19.          సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20.          గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21.          భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22.          భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23.          శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24.          గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25.          పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26.          ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27.          సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28.          వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

స్కంద ఉవాచ-
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు  జ్ఞానమును పొందుతారు.

సంధ్యావందనం ప్రయోజనం

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.

సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.

త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.

ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి

సావిత్రీం ఆవాహయామి

సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...