Friday, May 25, 2018

స్వస్తి’ అంటే.....?


స్వస్తి’ అంటే ‘శుభం’ అని అర్థం. అందరం శుభాలను కోరుకుంటాం. కానీ ఆ శుభం కావాలంటే దానిని సంపాదించే మార్గం కూడా శుభమయం కావాలి. ధర్మమార్గమే శుభం. ఆ శుభానికి ఫలంగానే క్షేమం లభిస్తుంది. శుభమే శుభాన్నిస్తుంది.
చిత్రం ఏంటంటే – మనందరికీ ఆనందం కావాలి. కానీ తత్సాధనమైన, ‘సత్కర్మ’ చేయాలని ప్రయత్నించం. మనకి ‘దుఃఖం’ అక్కర్లేదు. కానీ దుఃఖానికి కారణమైన దుష్కర్మని మాత్రం వదలం. మనమనుకున్నది మనకు రాదు. మనం చేసేదాని, ఫలితమే మనం పొందుతాం.
‘స్వస్తిమార్గం’ అంటే – మనం చేసే పని, దానికి అవసరమైన పరికరాలు, వనరులు, ఆలోచనలు అన్నీ ‘స్వస్తి’మాయం కావాలి. అప్పుడే అది సరియైన శుభంకరమైన మార్గం అవుతుంది.
లక్ష్యమొక్కటే కాదు, మార్గం కూడా మంగళకరం కావాలి – అని వేదం ప్రబోధిస్తోంది. మన వాంఛితాలు, సంకల్పాలు మంగళకరంగా ఉండాలన్నదే మానసిక విజ్ఞానసారం. మంచి ఆలోచనలవల్ల, మంచి స్పందనలు, తద్వారా మంచి ప్రేరణలు, మంచి ఆచరణలు కలుగుతాయి. ఇదో చక్రనేమిక్రమం.
కాబట్టి వేదం శుభాన్ని సంకల్పించుకోవడం, శుభాన్ని ఆశిస్తూ దైవీశక్తులను ఉపాసించడం వంటి శుభాకాంక్షలెన్నింటినో పలికింది.
జీవిత పరమ లక్ష్యం ‘పరమశుభం’. దానినే ‘శివం’ అంటారు. అదే పరమ (Ultimate) స్వస్తి. అందువల్లనే ‘స్వస్తి’ అనే దానిని భగవన్నామంగా పేర్కొన్నారు(విష్ణుసహస్రనామం). ఆ అఖండమైన ‘స్వస్తి’ని సాధించడానికి, అవసరమైన జీవన విధానమే ‘స్వస్తిపంథా’.
ఏ లక్ష్యానికి ఏ బాట వేసి ఉందో, దానిని ఆశ్రయించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఆ ‘పరమస్వస్తి’కి వేసిన ౧. జ్ఞానమార్గం, ౨. భక్తిమార్గం, ౩. కర్మమార్గం, ౪.
యోగమార్గం...ఇవే స్వస్తిపథాలు. వీటిని వదలరాదు. ఈ నాలుగూ వేటికవి విభిన్నమూ కావు. విరోధమూ కావు. పరస్పర పరిపూరకాలు.
వేదవిహిత కర్మాచరణను జ్ఞాన, భక్తి, యోగనిష్ఠలతో ఆచరించడమే స్వస్తి పథం. ‘దారితప్పకపోవడ’మంటే ఇదే.

‘స్వస్తి’తో అనుసంధానించడానికి పథంలో మనం మాత్రమే ప్రయాణించడం సరిపోదు.

మన ఆచరణతో మరికొంతమందికి స్ఫూర్తి కలిగించి, కలసి ప్రయాణించి ఆ పరమలక్ష్యాన్ని అందుకోవాలి. ఈ ‘కలిసి’ అనే స్ఫూర్తి వైదిక సంస్కృతిలో స్ఫుటంగా లభిస్తుంది.

గొప్ప విషయాన్ని పదిమందితో పంచుకోవడం మన గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు. దానితో అనేకమందిని అనుసంధానింపజేయడమనేది ఒక లోకహితం. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారికి కూడా స్వస్తి కలగాలని కోరుకోవడం ముఖ్యం. మనకి శుభం, మరొకరి ‘అశుభం’ వల్ల రాకూడదు. ఒకరి దుఃఖంవల్ల మనం ఆనందించకూడదు. అలా ఆనందించడం, క్రమంగా దుఃఖంగానే పరిణమిస్తుంది.
స్వస్తినీ, శాంతినీ ఆశించిన భారతీయ సంస్కృతే ‘స్వస్తిపంథా. ఆ పథానికి సదా స్వస్తియగుగాక!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...