Sunday, August 21, 2016

నవగ్రహాల్లో ఏ గ్రహదోషమైనా తొలగాలంటే చేయవలసిన పరిష్కార మార్గములు నవగ్రహాల్లో ఏ గ్రహదోషమైనా తొలగాలంటే.........!!

ఆయా గ్రహాలకు సంబంధించిన వారం నాడు, మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి. ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఆవుకు పెట్టాలి.

గ్రహాలు – వివరాలు.......

1. సూర్యుడు - ఆదివారం
ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
2. చంద్రుడు - సోమవారం
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
3. కుజుడు - మంగళవారం
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
4. బుధుడు - బుధవారం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

5. గురు - గురువారం
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
6. శుక్రుడు - శుక్రవారం
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
7. శని - శనివారం
ధాన్యం : నల్ల నువ్వులు
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
8. రాహువు - శుక్రవారం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
9. కేతువు - మంగళవారం
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.

జి. ఎస్ ఎస్ శర్మ

Tuesday, August 16, 2016

జంధ్యాలపౌర్ణమి

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఎవరు ఎన్ని ముడులు ధరించాలి? బ్రహ్మచారి ఒక ముడి వున్న జంధ్యాన్ని ధరించాలి. గృహస్థుడు మూడుముడులు ధరంచాలి. అయితే కొందరు నాలుగు ముడులు, ఐదు ముడులు కూడా ధరిస్తూంటారు.

- మొదటిపోగు..., వైదిక నిత్యకర్మానుష్ఠానం కోసం, - రెండవపోగు...,గృహష్థాశ్రమ ధర్మాచరణ కోసం, - మూడవపోగు...,ఉపాకర్మ రోజున ఉపాంగవస్త్రంగా ధరించడంకోసం, - నాల్గవపోగు...,తప్పనిసరి పరిస్థితిలో దానం చేయడం కోసం, - ఐదవపోగు..., పాముకాటుకుగురైన వారి కాలికి కట్టడానికి ఉపయోగంచేవారు.

యజ్ఞోపవీతము యొక్క ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలము వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి ఉంచుకొనవలెను. తదుపరి ఆచమనము చేసి యజ్ఞోపవీత ధారణా మంత్రము

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః"

అని చెప్పుచు, ఒక పోగు "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని ధరించవలెను.

మరల ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ, రెండు పోగులను "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని జంటగా ధరించవలెను.
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.

మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

తదుపరి పాత, క్రొత్త జంధ్యములను కలిపి కుడి చేతి బొటన వ్రేలు-చూపుడు వ్రేలు మధ్యన పట్టుకుని "దశ గాయత్రి" (పది మారులు గాయత్రి మంత్రమును) జపించి, యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మ చారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:
"ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"

తదుపరి ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణ కర్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే"

తిరిగి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవీతము తో కనీసం పది సారులైనను గాయత్రి మంత్రము జపించి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. తరువాత గాయత్రీ దేవత నుద్దేశించి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించ వలెను.

Tuesday, August 18, 2015

నువ్వు నా సొంతం అయినా రోజు

{20/05/2015}

గాలి మనల్ని పిల్చినప్పుడు 
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో, సీతాకోకచిలుకలమై ఆకాశపు ఆనందంలో. 
ఎందుకంటే, మరి రాత్రి అలాగే వచ్చింది మన వద్దకి 
తనను తాకమనీ వినమనీ -

మనకు తోడుగా ఎర్రెర్రని పూలు - 
మాట్లాడలేదు అవి ఏమీ రాత్రంతా, తలలు వొంచి తమ పరిమళాన్ని పంచే పారవశ్యంలో. 
మనమే మరి, కృతజ్ఞతతో వాటి ముందు మోకరిల్లి 
ప్రార్ధించీ, పుష్పించీ -

ఇక ఆ తరువాత, గూళ్ళల్లో 
పక్షులు కదిలితే, రెక్కలు మొలిచి ఎగిరాం మనం: నాలోకి నువ్వూ, నీలోకి నేనూ. 
మంచు అద్దుకున్న స్వప్నాలూ, గులాబీ కళ్ళ కన్నీళ్ళూ 
శిధిల గృహాలూ అప్పుడు మనలో -

పేర్లని కోల్పోయి మిగిలేం చివరికి 
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో: నా అరచేతిలో నీ హృదయంతో, నీ అరచేతిలో 
కొట్టుకులాడే నా ప్రాణంతో, ఓరిమితో, శాంతితో, అశాంతితో
బ్రతకాలాన్న ఒకే ఒక్క కోరికతో -

ప్రేమ? తెలియదు. ద్వేషం? తెలియదు. 
పిల్లలు కసురుకున్నాంక, మనస్సు చివుక్కుమని చిన్నబోయిన తల్లి ముఖంలా 
జీవితం మారినాంక, ఒక రాత్రిని తాకీ, వినీ - మొగ్గై 
పూవై ముళ్ళై సువాసనై మబ్బై

వానై, మెరుపై, నిప్పై, సర్వం మరచి 
క్షణాకాలమైనా అలా జ్వలించిపోయే ఆ పాప పవిత్ర తీవ్రత కాలాల కన్నా, ఇరువురికి 
ఇరువురూ ఇచ్చుకునే ఒక మెరుగైన బహుమతి 
అంతకన్నా ఏమున్నది?

Sunday, August 16, 2015

పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.

జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్‌' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీభగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.

పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.

భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం

శ్రీరామ దూతం శిరసానమామ

‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.

‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’. ఏడుకాండల గ్రంధమయిన ‘‘రామాయణం’’లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ‘‘కిష్కింధాకాండ’’లో ప్రవేశించిన ‘‘హనుమంతుని పాత్ర’’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. ఎందుకంటే....
శివాంశ సంభూతుడు:

రామాయణం ‘‘హరి, హర తత్త్యాత్మకం
శ్రీరాముడు శిష్ణ్యాంశ సంభూతుడు. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిరువురు ఏకాంత శయ్యామందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకాసంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలతో కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవలది. చూచి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునకు దూరంగా జరిగింది. శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.

అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరుముఖలతో ‘షణ్ముణుడు’ జన్మించాడు
వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి తిధి: పుర్వాభాద్ర నక్షత్రం.ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.

బాల ప్రాయంలోనే ఆంజనేయుడు తన శక్తి ఏమిటో లోకానికి చాటాడు. బాల భీమని పండుగా భావించి, దానిని మ్రింగాలనే ఉద్దేశ్యంతో ఆకాశానికి ఎగిరాడు. ఆరోజు అమావాస్య, సంపూర్ణసూర్యగ్రహణం. అదే సమయానికి సూర్యగ్రహణం చెయ్యడానికి రాహువు వచ్చాడు. ‘‘ఈ సూర్యుడు నాదంటే నాది’’ అని రాహువుకు, బాలాంజనేయునికి మధ్య ఘర్షణ జరిగింది. విసుకుచెందిన ఆంజనేయుడు తన తోకతో రాహువును చుట్టి బలంగా విసిరివేసాడు. రాహువు దేవేంద్రుని ముందుపడి జరిగినది చెప్పాడు. కృద్ధుడైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుని దవడ ఎర్రగా వాచిపోగా, స‌్పృహతప్పి నేలమీద పడ్డాడు. హనుమ (దవడ) వాచినవాడు కనుక ఆనాటి నుంచి ‘‘హనుమంతుడు’’ అని సార్ధక నామధేయుడయ్యాడు. తన కుమారుని దురవస్థ చూసి... వాయువు దేవతలపైన అలిగి స్తంభించాడు. సృష్టిమొత్తం సంక్షోభంతో అల్లకల్లోలమైంది. బ్రహ్మదిదేవతలు వాయువును ప్రస్నం చేసుకోవడం కోసం, అందరూ హనుమంతునికి తలోక వరం ఇచ్చారు. ఏ అస్త్రము హనుమంతుని బాధించవు, బంధించవు అని దీవించారు. సహజ బల సంపన్నుడైన హనుమంతుడు ఇప్పుడు వర బలసంపన్నుడయ్యాడు. అసలే కోతి... పైగా బాల్యం... దానికితోడు వరబలం హనుమంతుని అల్లరికి అంతేలేదు. అతని చిలిపిచేష్టలకు సహనం నశించిన ఋషులు ‘‘నీవు శక్తి హనుడవు అగుగాక’’అని శపించారు. ఆ తర్వాత అంజనాదంపతుల ప్రార్ధనకు ప్రసన్నులైన ఋషులు ‘‘ెవరైనా చెబితేనే అతని శక్తి అతనికి తెలుస్తుంది’’అని శాపాన్ని కాస్త మార్పు చేసారు.

ఆదిత్యుడే ఆచార్యుడు
హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ‘‘నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?’’అన్నాడు సూర్యుడు. ‘‘గురుదేవా... మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను’’అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ. ఈ కథను... జాంబువంతుడు.... సాగర తీరంలో వానరులకు వినిపించాడు.

తొలికలయిక:
రామాయణంలో హనుమంతుని పాత్ర కిష్కింధ కాండలో పరిచయం అవుతుంది. తొలి పరిచయంతోనే ా పాత్ర స్వరూప, స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తాడు ఆదికవి’’వాల్మీకి.
రావణాపహృత అయిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణఉలు ఋష్యమాకం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు పరుగులు తీసాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు... సుగ్రీవునికి ధైర్యంచెప్పి... యతిరూపం ధరించి రామలక్ష్మణఉల దగ్గరకు వచ్చాడు. ‘‘అద్యూ క్షత్రియవంశ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు.. అందుకు విరుద్ధంగా నారబీరలు, జటాజూతాలు ధరించడం చూస్తూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులాని అనుకుందామంటే... మీ చేతిలోని ధనర్పాణ, కరవాలాలు చూస్తూంటే మీరు ఋషులు కాదనిపిస్తోంది. తమరెవరు? ఏ కార్యార్గమై యిలా వచ్చారు? ఓ... నాగురించి చెప్పలేదు కదూ.. నా పేరు హనుమంతుడు. వానరసార్వ భీముడైన వాలి, తన తమ్ముడయిన సుగ్రీవుని సందేహించి, అతని భార్యను అపహరించి, రాజ్యం నుంచి తరిమికొట్టాడు. నేను ా సుగ్రీవుని మంత్రిని’’ అన్నాడు.
విన్నరాముడు పరమానంద భరితుడై, లక్ష్మణునితో:
‘‘నా సృగ్వేద వినీతస్య నా యజర్వేద ధారణం:
నా సామవేద విదుష: శక్యమేవం విభాషితుయ్’’
లక్ష్మణా.. చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇంత మఈదు మధురంగా మాట్లాడగలడు.
‘‘అవిస్తర మసందిగ్ధం అవిలంబితమనధ్యమ్
ఉర:స్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్’’
చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు. సాగతీతలు లేవు. గొంతు చించుకోవడం, కనుబొమలు ఎగురవేయటం, తలతిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా, తను చెప్పాల్సింది మృదుమధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యంగల ఈ ధీమంతునితో చాలా జాగ్రత్తగా సంభాషించు’’అని లక్ష్మణుని హెచరిస్తాడు రాముడు. ఈ ఒక్కచోట తప్ప... రాముడు లక్ష్మణుని హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనబడదు. మానవులు ఎలా మాట్లాడాలో మనకు ఈ సన్నివేశంలో నేర్పుతాడు ‘‘హనుమంతుడు’’

అగ్నిసాక్షిగా రామ, సుగ్రీవుల మధ్య మైత్రీ బంధం కల్పించాడు హనుమ. ధర్మభ్రష్టుడైన వాలిని సంహరించి, సుగ్రీవుని కిష్కింధాధిపతి చేస్తానని శ్రీరాముడు మాటిచ్చాడు. వాలి సంహారం జరిగింది. సకల వానర సంఘాలూ, వారి సేనాధిపతులు నల, నీల, గజ, గవయ, గవాక్ష, మైంద, ద్వివిదాది మహావీరులందరూ భయభ్రాంత హృదయులై నిలబడి పోయారు. వాలి మృతదేహం మీద పడి, తార విలవిల విలపిస్తూంటే, ఆమెను ఓదార్చేధైర్యం ఎవ్వరికీ చాలలేదు.

అప్పుడు హనుమంతుడు తారను సమీపించి ‘‘మహారాణీ.. ఇంతకాలం ీ సర్వ వానరకోటిని మీ కనుసన్నలలో నడిపించి, కిష్కింధను పాలించిన మీరు... వీర మరణం పొందిన భర్త గురించి ఇలా శోకించడం తగదు. ఇప్పుడు ఈ సమస్త వానరప్రజ మీ ఆదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కనుక, శోకాన్ని ఆపి, నీ బిడ్డ అంగదుని ఈ కిష్కింధకు సామ్రాట్టుగా అభిషిక్తుని చెయ్యి’’ అన్నాడు.
శ్రీరాముడు వాలిని సంహరించినది సుగ్రీవుని కిష్కింధాధి పతిగా అభిషిక్తుని చెయ్యడానికి గానీ, అంగదుని కాదు. ఈసంగతి హనుమంతునకు తెలియక కాదు అలా అన్నది.. ఎందుకలా అన్నాడంటే....
వాలిమరణంతో సర్వవానరకోటి సుగ్రీవుని పట్ల ద్వేషంతో, పగతో ఉంటారు. నిజానికి కిష్కింధకు ఏలిక వాలి అయినా, తెరవెనుక నుంచి కిష్కింధను పాలించిన పట్టమహిషి తార. భర్త మరణం ఆమెలో ప్రతీకార జ్వాల రగిల్చితే వానరులంతా సుగ్రీవునకు ప్రతిపక్షం అవుతారు. అప్పుడు సుగ్రీవుడు కిష్కిందాధిపతి కావడం కల్ల... వానరులంతా సహకరిస్తేనే సుగ్రీవుడు సీతాన్వేషణ చేయగలడు. తార కోపాన్ని శాంతింపచేసి, సుగ్రీవుని పక్షానికి వచ్చేలా చెయ్యాలంటే... ముందు తార, సుగ్రీవుని కిష్కింధాధిపతిగా అంగీకరించాలి. తను అన్న మాటకు తార నుంచి ఏ సమాధానం వస్తుందో హనుమకు తెలుసు. అలాంటి సమాధానమే వచ్చింది.
‘‘హనుమా.. సుగ్రీవుడే సర్వవానరకోటికి ప్రభువు. అతనికే పట్టాభిషేకం జరగాలి’’ అంది తార. ఆమెచేత అలా పలికించగల ధీమంతుడు హనుమంతుడు. అదీ ఆయన రాజకీయనిఫుణత.

తిరుగులేని రామ ‘‘దూత’’
వానర వీరులంతా నీతాన్వేషణకు బయలు దేరారు.
దక్షిణ సాగరతీరానికి చేరారు అంగద, జాంబువంత, హనుమదాదులు. అనితర సాధ్యమైన శతయోజన విస్తీర్ణమయిన సాగరాన్ని లంఘించాడు. ఈ సాగర తరణంలో...
మైనాకుని మన్ననలందాడు
సురసను యుక్తితో జయించాడు
సింహకను సంహరించాడు
లంకిణిని ఓడించి, శత్రుదుర్వేధ్యమయిన లంకలో ఒంటరిగా సీతాన్వేషణ సాగించాడు. ఈ కార్యంలో ఎందరో దేవ, గంధర్వ కన్నర, గంధర్వాది సుందరాంగనలు నగ్నంగా, అర్థనగ్రంగా హనుమంతునికి దర్శనమిచ్చారు. హనుమ హృదయం చివుక్కుమంది. ‘‘పరస్త్రీని చూడడమే పానం... పైగా ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం’’ అనుకుని
‘‘నహిమే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ
అయం చాత్ర మయాదృష్ట: పరదార పరిగ్రహ:’’
‘‘సీతాదేవి కనిపిస్తుందేమో నని చూసానేగానీ, నా మనస్సు కామవశీభూతం కానప్పుడు నేనెందుకు బాధపడాలి. సర్వ పాపపుణ్యాలకు ప్రధానమైన మనస్సు, నిర్మలంగా, నిశ్చలంగా ఉన్పప్పుడు నేను బాధపడక్కర లేదు’’ అనుకున్నాడు.. అది హనుమ స్త్రీ భక్తి. ాత్మపరిశీలన.
అశోక వనంలో సీతాదేవిని చూసాడు. ఆమెకు రామాంగుళి ఇచ్చి ధైర్యం చెబుతూ... ‘‘అమ్మా.. నా భుజాన్ని ఎక్కు. క్షణకాలంలో నిన్ను రామసన్నిధికి చేరుస్తాను’’ అంటాడు. అప్పుడు సీతాదేవి.. ‘‘అలా చేయడం నా రామునకు గౌరవంకాదు. అయినా, ఇంత చిన్న ాకారంగల నీవు, నన్నెలా రాముని దగ్గరకు చేర్చగలవు’’ అంది. అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించి, ధైర్యం చెబుతూ...
‘‘మద్విశిష్టాశ్చ తుల్చాశ్చ సన్తి తత్ర వనౌకస:
మత్త: ప్రత్యవరం: కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిదే’’
‘‘అమ్మా.. సుగ్రీవుని సన్నిధానంలో నన్ను వానరవీరులందరిలోను అతి సామాన్యుడను నేనే. దూతల సామాన్యులనే తప్ప మహమహులను పంపరు కదా’’ అన్నాడు. అదీ హనుమంతునివినయం, నమ్రత.
ఒంటిచేత్తో అశోకవన ధ్వంసం చేసిన హనుమ.. సామాన్యుడా?
శత్రుసభలో నిర్భయంగా రావణునకు హితబోధ చేసిన హనుమ... సామాన్యుడా?
సుందర లంకానగరాన్ని క్షణకాలంలో అగ్నికి ఆహుతి చేసిన హనుమ... సామాన్యుడా?
‘‘సీతాదేవిని చూసాను’’ అని చెప్పి... ఇటు వానరుల ప్రాణాలు, అటు శ్రీరాముని ప్రాణాలు కాపాడిన హనుమ... సామాన్యుడా?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మస్త్ర ప్రయోగానికి రామలక్ష్మణులతో సహా సర్వవానరులూ మూర్చపోతే, సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అందరికీ ప్రాణదానం చేసిన హనుమ... సామాన్యుడా?
అసలు హనుమలేని రామకథను మనం ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా?
హనుమలేనిదే రాముడు లేడు. ఎందుకంటే...
రాముడు విష్ణ్వాంశ సంభూతుడు.
హనుమ ఈశ్వరాంశ సంభూతుడు.
శివకేశమవిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండరు.
‘‘శఇవాయా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయంశివ:’’
అందుకే రామనాయం ఎక్కడుంటే హనుమ అక్కడుంటాడు
శివుడు.. అభిషేక ప్రియుడైన, బోళా శంకరుడు
హనుమ... రామనామాభిషేక ప్రియుడైన, బోళావానజుడు
సామాన్యులమైన మనం,ఆ మహావీరునకు ఏమివ్వగలం? జన్మదిన కానుకగా, భక్తిగా ఒక్క ‘‘రామనామాన్ని’’ఇవ్వడంతప్ప... ఇంకేం చెయ్యగలం?
యత్ర యత్ర రఘునాధ కీర్తనమే
తత్ర తత్ర కృత మస్త కాంజవియ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్ష సాంతకమ్

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...